ఎపి వలసలు, మంత్రులు: సోనియాకు తలనొప్పి
ఓ వైపు వలసలు, మరో వైపు కేసులు గందరగోళం సృష్టిస్తుంటే, సోనియా గాంధీ స్వయంగా రంగంలోకి దిగి ఆరా తీస్తున్నారు. సోమవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాంనబీ ఆజాద్తో ఆమె చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ పరిస్థితి గురించి వివరాలు తెలుసుకున్నారు. తమ పార్టీ ఎంపీలకు తెరాస అధ్యక్షుడు కెసిఆర్ ఆఫర్ ఇవ్వడంపై, తెరాసవైపు కదిలే దిశగా పార్టీ నేతలు మంతనాలు జరపడంపై ఆజాద్తో సోనియా చర్చించినట్లు తెలిసింది.
హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సిబిఐ చార్జిషీటు దాఖలు చేసిన అంశంపైనా సోనియా దృష్టి సారించినట్లు తెలిసింది. జగన్ అక్రమాస్తుల కేసులో రాష్ట్ర మంత్రులకు కూడా బురద అంటుతుండటంతో ప్రభుత్వ, పార్టీ ప్రతిష్ఠ పడిపోతోందని ఆజాద్ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సోనియా కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలిసింది. ఈ విషయంపై సాధ్యమైనంత త్వరలో నిర్ణయం తీసుకోవాలనుకున్నా ధర్మాన విషయంలో ఉదాసీనంగా వ్యవహరించి, సబితా ఇంద్రారెడ్డి విషయంలో తక్షణం ప్రతిస్పందించినట్లయితే తప్పుడు సంకేతాలు వెళతాయని భావిస్తున్నట్లు తెలిసింది.
ధర్మానపై ప్రాసిక్యూషన్ను అనుమతించే విషయంలో వచ్చే వారం రాష్ట్ర హైకోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని, కోర్టు స్పందనను బట్టి మొత్తం కళంకిత మంత్రుల విషయంలో ఒకేసారి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. సోనియాతో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడడానికి గులాం నబీ ఆజాద్ నిరాకరించారు. చెప్పాల్సిందేమీ లేదని ఆయన అన్నారు.
మొత్తం మీద, తెలంగాణ కుంపటి సోనియా గాంధీ అనుకున్నంత సులువుగా ఆరేది కాదని అర్థమవుతోంది. దీంతో పార్టీకి చెందిన ఎవరెవరు తెరాసవైపు వెళ్తారనే విషయంపై కూడా సోనియా గాంధీ దృష్టి సారించినట్లు చెబుతున్నారు.