జగన్పై కిరణ్ గేమ్: అసద్పై పోటీకి అజహర్ రెడీ
ప్రస్తుతం హైదరాబాద్ ఎంపీగా మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఉన్నారు. ఇటీవల మజ్లిస్ పార్టీ కాంగ్రెసు పార్టీకి దూరమైన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి నచ్చలేదని చెబుతూ మజ్లిస్ కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో 2014లో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతోంది. దీంతో ముస్లింలు జగన్ వైపుకు మళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ అజహరుద్దీన్ను రంగంలోకి దింపినట్లుగా కనిపిస్తోంది.
అందులో భాగంగానే అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీకి సై అన్నారని అంటున్నారు. అజహరుద్దీన్ శనివారం ఎపి భవనంలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... తనకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తి ఉందని, అధిష్టానం ఆదేశిస్తే హైదారాబాదు నుండి పోటీ చేస్తానని చెప్పారు. ముఖ్యమంత్రి, మంత్రులను అజహరుద్దీన్ పొగిడారు. మజ్లిస్ దూరమై జగన్ వైపుకు వెళ్లిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా అజహర్తో భేటీ అయ్యేందుకు ఆసక్తి కనబర్చారట.
ఆయనతో మాట్లాడి హైదరాబాదు నుండి పోటీ చేయాలని సూచించినట్లుగా తెలుస్తోంది. అదే విషయాన్ని అధిష్టానానికి కూడా చెప్పారని అంటున్నారు. చరిష్మా ఉన్న అజహరుద్దీన్ హైదరాబాదు నుండి పోటీ చేస్తే మజ్లిస్ పార్టీకి ఎదురు దెబ్బ పడుతుందని కాంగ్రెసు పార్టీ భావిస్తోంది.