నిద్రకు బాబు పర్మిషన్!: ముగింపు అప్పుడే కాదు
నేను నిద్రపోను.. నిద్రపోనివ్వనని అప్పుడు చెప్పిన చంద్రబాబు.. దానిపై స్పందిస్తూ... తన వ్యాఖ్యలపై వ్యతిరేక ప్రచారం జరిగిందని, దీనివల్ల ఉద్యోగాలు వ్యతిరేకమయ్యారన్నారు. ఈసారి మీరు ఎంతసేపైనా నిద్రపోండని, ఆ తర్వాత కలిసి పని చేద్దామని సూచించారు. ఇదే నినాదంతో ముందుకు వెళ్తామని కార్యకర్తలతో సరదాగా అన్నారు. మరోవైపు చంద్రబాబు ఈ ఏడాదంతా ప్రజల్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇందుకోసం ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసుకున్నారట. ఈ ప్రణాళిక అమలుపై ఆయన ఇప్పటికే పార్టీ సీనియర్లతో సమాలోచనలు సాగిస్తున్నారు. గత నూటా ఏభై రోజులుగా అవిశ్రాంతంగా కొనసాగిస్తున్న ప్రస్తుత తన పాదయాత్రను మే ఒకటో తేదీతో ముగించాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. ముందు అనుకొన్నట్లుగా మే ఒకటో తేదీ నాటికి ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పాదయాత్ర ముగించనున్నారు.
పరిస్థితులను బట్టి ఒకటి రెండు రోజులు అటూఇటూ కావొచ్చునని, ఇది తాత్కాలిక ముహూర్తం మాత్రమేనని చెబుతున్నారు. పాదయాత్ర పూర్తి కాగానే మే నెలాఖరులో హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహణకు నడుం కట్టనున్నారు. ప్రతిసారీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగే మహానాడు సందర్భంగా రాష్ట్ర స్ధాయిలో భారీ సభను నిర్వహించడం తెలుగుదేశం పార్టీలో అనవాయితీగా వస్తోంది.
మే 28వ తేదీ స్వర్గీయ నందమూరి తారక రామారావు పుట్టిన రోజు. ఆ తేదీనే ఈ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సభ ముగిసిన వెంటనే జూన్ నుంచి రెండో విడత పాదయాత్రకు చంద్రబాబు మరోసారి ప్రజల్లోకి వెళ్ళాలని అనుకొంటున్నట్లుగా సమాచారం. మొదటి విడత పాదయాత్రలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను సందర్శించలేకపోయారు. మలి విడతలో ఈ జిల్లాల్లో పాదయాత్ర చేయాలన్న సంకల్పంతో చంద్రబాబు ఉన్నారు.
ఆరోగ్యం సహకరించినంత వరకూ పాదయాత్రతోనే వెళ్తానని, కుదరకపోతే అప్పుడు ఆలోచిస్తానని ఆయన పార్టీ నేతలకు తేల్చి చెప్పారట. రెండు విడతల్లో కలిపి చంద్రబాబు సుమారు వంద నియోజకవర్గాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా సుమారు 194 దాకా మిగిలిపోయి ఉంటాయి. వీటినీ, మండలాలవారీగా కలుపుకుపోయేలా బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.