చంద్రబాబు రెడీ: జగన్ తేల్చేది తర్వాతే?
కాంగ్రెసు, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ను ఏర్పాటు చేసి, ప్రధాని కావాలనే కోరికతో ములాయం సింగ్ యాదవ్ ఉన్నారు. ఈ స్థితిలో మూడో ఫ్రంట్లోకి రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలను తీసుకునే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. చంద్రబాబు ములాయం సింగ్కు సన్నిహితుడు. జగన్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, ములాయం కుమారుడు అఖిలేష్ యాదవ్కు మిత్రుడు. ఈ విషయాన్ని ఇటీవలి హైదరాబాదు పర్యటనలో అఖిలేష్ యాదవ్ స్వయంగా చెప్పారు.
చంద్రబాబుతో పాటు జగన్ను కూడా మూడో ఫ్రంట్లోకి లాగే ప్రయత్నంలో ములాయం సింగ్ ఉన్నట్లు అర్థమవుతోంది. అయితే, ఇరువురు ఒకే ఫ్రంట్లో ఇముడుతారా, అలా ఇమడడానికి ఇష్టపడుతారా అనేది సందేహం. కాగా, ఫెడరల్ ఫ్రంట్ను ఏర్పాటు చేయాలని చూస్తున్న తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చంద్రబాబును పక్కన పెట్టి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు ఫోన్ చేసి తమ ఫ్రంట్లోకి రావాలని పిలిచారు.
మమతా బెనర్జీ ఆహ్వానంపై వైయస్ జగన్ ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదు. ఆయన ఎన్నికలకు ముందు ఏ విధమైన పొత్తులకు కూడా సిద్ధపడే అవకాశాలు లేవు. ఎన్నికలు పూర్తయిన తర్వాత అప్పటి పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఉన్నారు. అవసరమైన కాంగ్రెసు నేతృత్వంలోని యుపిఎకు మద్దతు ఇచ్చేందుకు కూడా ఆయన సిద్ధంగా ఉన్నారు.
బిజెపి నేతృత్వంలోని ఎన్డీయెతో తాము కలువబోమని, ఎన్నికల తర్వాత అవసరమైతే యుపిఎకు మద్దతిచ్చే విషయాన్ని పరిశీలిస్తామని వైయస్ జగన్ చెప్పారు. అందుకు అనుగుణంగానే ఆయన వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు. ఏమైనా, మమతా బెనర్జీ ఏర్పాటు చేయబోయే ఫెడరల్ ఫ్రంట్కు గానీ, ములాయం సింగ్ ఏర్పాటు చేయబోయే మూడో ఫ్రంట్కు గానీ ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు అనివార్యం. కానీ, ఏ ఫ్రంట్ ఏ పార్టీ మద్దతు పొందుతుందనేది ఇప్పుడే తేలే పరిస్థితి లేదు.
అయితే, చంద్రబాబు మాత్రం అటు ఫెడరల్ ఫ్రంట్ పట్ల గానీ ఇటు మూడో ఫ్రంట్ పట్ల గానీ విముఖత ప్రదర్శించడం లేదు. చంద్రబాబు జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలనే ఉద్దేశంతో ఉన్నారు. జగన్ మాత్రం ఇప్పుడు తేల్చడానికి సిద్ధంగా లేరు.