జగన్ దీక్ష సీమాంధ్రలో పార్టీకి బూస్ట్?
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష పార్టీ పరిస్థితిని సీమాంధ్రలో మెరుగుపరిచినట్లు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన తీరును నిరసిస్తూ ఆయన గత ఏడు రోజులుగా దీక్ష చేస్తున్నారు. ఆస్పత్రిలో కూడా ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు. అయితే, సమైక్యాంధ్ర కోసమే ఆయన దీక్ష చేస్తున్నట్లుగా ప్రజలు భావించడం వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కలిసి వస్తోంది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ప్రజల మద్దతు పెరిగిందని అంచనాలు వేస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యవాదంతో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అయోమయంలో పడినట్లు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వైఖరిని వివిధ పార్టీలతో పాటు ఎపి ఎన్జీవోలు కూడా తప్పు పడుతున్నారు. దీంతో ఆయన ఉత్తరాంధ్రలోని విజయనగరం నుంచి తలపెట్టిన బస్సు యాత్రను గుంటూరు జిల్లాకు మార్చుకున్నారని చెబుతున్నారు. గుంటూరులో పార్టీ బలం ఎక్కువగా ఉండడం వల్ల విఘ్నాలు తక్కువగా ఉంటాయని ఆయన భావిస్తున్నట్లు చెబుతున్నారు.
వైయస్ జగన్ ఆస్పత్రిలో కూడా దీక్ష కొనసాగిస్తుండడం వల్ల, ఆయన వద్ద ఉండేందుకు తల్లి వైయస్ విజయమ్మకు, భార్య భారతీరెడ్డికి కోర్టు అనుమతి నిరాకరించినందువల్ల సానుభూతి పెరిగినట్లు భావిస్తున్నారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీసుకున్న సమైక్యవాద వైఖరి చంద్రబాబును ఇరకాటంలో పెట్టిందని అంటున్నారు.
దాంతో చంద్రబాబు నాయుడు ప్రధాని మన్మోహన్ సింగ్పై తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం ద్వారా దృష్టిని మళ్లించాలని భావించినట్లు చెబుతున్నారు. అలాగే, జగన్ ఆస్తులను జప్తు చేయాలని, జగన్ కేసులపై దర్యాప్తును ముమ్మరం చేయాలని తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు విజ్ఝప్తి చేశారు. వైయస్ జగన్ ప్రయత్నాలను చంద్రబాబు తన బస్సు యాత్ర ద్వారా తిప్పికొట్టాలని భావిస్తున్నారు.