జగన్ ఫ్యామిలీ 'చిత్రం': వైయస్గా సుమన్(పిక్చర్స్)
వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పైన ఓ చిత్రాన్ని నిర్మించనున్నారట. చంద్రశేఖర రెడ్డి 'జగన్నాయకుడు' అనే చిత్రాన్ని రూపందించేందుకు సిద్ధమయ్యారట. ఈ చిత్రంలో వైయస్ కుటుంబానికి చెందిన మూడు తరాలను చూపించనున్నారట. వైయస్ రాజారెడ్డి, వైయస్ రాజశేఖర రెడ్డి, వైయస్ జగన్మోహన్ రెడ్డి తరాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. ప్రస్తుతం 2014 ఎన్నికలలో జగన్ స్థాపించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ క్లీన్ స్వీప్ చేస్తోందా? లేదా? అనే చర్చ సాగుతోంది.
అంతకుముందు ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆ కుటుంబం పైన ఓ చిత్రం తీస్తానని చెప్పినప్పటికీ అది కుదరలేదు. ఇప్పుడు చంద్రశేఖర రెడ్డి సినిమాను రూపొందించనున్నారు. ఈ చిత్రాన్ని తీసేందుకు ఇదే సరైన సమయమని, ఈ చిత్రాన్ని తాను ఓ సవాల్గా భావిస్తున్నానని ఆయన చెబుతున్నారు. ఈ చిత్రంలో జగన్ జైలుకు వెళ్లాక ఆయన సోదరి షర్మిల పార్టీ బలోపేతం కోసం చేస్తున్న కృషిని కూడా ప్రస్తావించనున్నారట.
వైయస్ తండ్రి రాజారెడ్డి రైతు నుండి ఎదిగిన తీరును, వైయస్ రాజకీయాల్లోకి రాకముందు చేసిన వైద్య సేవలను, జగన్ రాజకీయ పార్టీ స్థాపన అంశాలను తెరకెక్కించనున్నారట. ఈ చిత్రంలో వైయస్ పాత్రను సుమన్, జగన్ పాత్రను రాజా, విజయమ్మ పాత్రను ఆమని పోషించే విషయమై చర్చలు సాగుతున్నాయని తెలుస్తోంది. షర్మిల, రాజారెడ్డి పాత్రలకు సెట్ అయ్యే వారి వేటలో ఉన్నారట. ఈ చిత్రంలో పాపులర్ నటులను తీసుకోవాలని భావిస్తున్నారట. ఈ చిత్రానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫండ్ ఇస్తుందని, అదేం లేదనే రెండు వాదనలు వినిపిస్తున్నాయి.
వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం పైన జగన్నాయకుడు చిత్రం ప్లాన్ చేస్తున్నారు. అందులో రాజారెడ్డి, వైయస్, జగన్.. ఇలా మూడు తరాల చరిత్రను తెరకెక్కించనున్నారట.
2004లో కాంగ్రెసు పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చిన వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. 2009లో రెండో టర్మ్ ప్రారంభంలో ఆయన హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందారు. వైయస్ ప్రవేశ పెట్టిన పథకాలు సామాన్య జనాలకు లబ్ధిని చేకూర్చాయని కొందరంటే, ఆయన తన హయాంలో భారీ అవినీతికి పాల్పడ్డారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.
వైయస్ ఉన్నన్నాళ్లు విజయమ్మ ఇంటి గడప దాటలేదు! ఆయన మృతి తర్వాత, ప్రధానంగా జగన్ అరెస్టయ్యాక విజయమ్మ పార్టీ పగ్గాలను చేపట్టారు.
వైయస్ మృతి తర్వాత జగన్ కాంగ్రెసు పార్టీ నుండి బయటకు వచ్చి వైయస్సార్ కాంగ్రెసు పార్టీని స్థాపించారు. ఆయన కాంగ్రెసు, తెలుగుదేశం, ఓ సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ముచ్చెమటలు పట్టించారు.
జగన్ జైలుకు వెళ్లాక ఆయన సోదరి షర్మిల పార్టీ బలోపేతం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. గత తొమ్మిది నెలలుగా ఆమె పాదయాత్ర చేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. ఓ మహిళ ఇన్నాళ్లుగా, ఇన్ని వేల కిలోమీటర్లు నడవడం విశేషం.
ప్రముఖ నటుడు సుమన్ ఈ చిత్రంలో వైయస్ రాజశేఖర రెడ్డి పాత్రలో కనిపించే అవకాశాలున్నాయట. దీనిపై చర్చలు సాగుతున్నాయట.
విజయమ్మ పాత్రలో ఆమని ఒదిగిపోనున్నారట. దీనిపై కూడా చర్చలు సాగుతున్నట్లుగా తెలుస్తోంది.
వైయస్ జగన్ పాత్రలో ప్రముఖ నటుడు రాజా నటించే అవకాశాలున్నాయని చెబుతున్నారు. షర్మిల పాత్రధారి కోసం వెతుకుతున్నారట.