జగన్ దూత చర్చలు: మొండికేస్తున్న కొండా సురేఖ
తమ డిమాండ్ను అంగీకరించకపోవడంతో కొండా దంపతులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దూరంగా ఉంటున్నారు. వారిని దారిలోకి తెచ్చే బాధ్యతను వైయస్ జగన్ బాలినేని శ్రీనివాస రెడ్డికి అప్పగించినట్లు సమాచారం. వరంగల్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసే అధికారాన్ని తమకు కట్టబెట్టాలని కొండా దంపతులు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ నాయకత్వం అందుకు అంగీకరించడం లేదు.
జిల్లాలోని భూపలపల్లి, పరకాల శాసనసభ నియోజకవర్గాలకు పరిమితం కావాలని వైయస్సార్ కాంగ్రెసు నాయకత్వం వారికి సూచిస్తోంది. దాంతో తీవ్ర అసంతృప్తికి గురైన కొండా దంపతులు పార్టీకి దూరంగా ఉంటున్నారు. గతంలో కొండా దంపతులు వైయస్ జగన్, వైయస్ విజయమ్మను ఎల్లవేళలా అంటిపెట్టుకుని ఉండేవారు. ప్రతి కార్యక్రమంలో వారు పాల్గొనేవారు. కొండా సురేఖ సీమాంధ్రలో కూడా పర్యటించారు. ఇటీవల చేవెళ్లలో వైయస్ విజయమ్మ చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో పాల్గొనాలని పార్టీ నాయకులు కొండా సురేఖను కోరారు. అయితే, ఆమె అందుకు నిరాకరించారు.
కొండా దంపతుల మొండి వైఖరితో పార్టీ నాయకత్వం విసిగిపోయినట్లు చెబుతున్నారు. కొండా దంపతులు వెళ్లిపోవడం వల్ల పార్టీకి కలిగే నష్టాన్ని, ఏర్పడే ఖాళీని మాజీ పార్లమెంటు సభ్యుడు చాడ సురేష్ రెడ్డి ద్వారా భర్తీ చేసుకునేందుకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకత్వం ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కొండా దంపతులు ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. బొత్స సత్యనారాయణ స్థానంలో డి. శ్రీనివాస్ పిసిసి అధ్యక్షుడిగా వస్తే కాంగ్రెసు పార్టీలో చేరాలనే ఉద్దేశంతో కొండా దంపతులు ఉన్నారని అంటున్నారు. ఏమైనా, వారు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి తప్పకుంటారా, తప్పుకుంటే ఏ పార్టీలో చేరుతారనే విషయం కొద్ది రోజుల్లో తేలనుంది.