ఢీ అంటే ఢీ: జగన్ను ఫాలో అవుతున్న లోకేష్!
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గతేడాది అక్టోబర్ 2న ప్రారంభించిన వస్తున్నా మీకోసం పాదయాత్ర ఏప్రిల్ 27న ముగియనుంది. ఆయన పాదయాత్ర ఇప్పటికి ఆరు నెలలు పూర్తి చేసుకుంది. సోమవారం ఆయన పాదయాత్ర 2500 కిలోమీటర్లకు చేరుకుంది. మరో నెల రోజుల పాటు ఆయన పాదయాత్ర కొనసాగుతుంది. బాబు పాదయాత్ర టిడిపిలో కొత్త ఉత్సాహాన్ని నింపింది.
బాబు ఆ తర్వాత బస్సు యాత్ర చేపట్టనున్నారు. పాదయాత్ర చేయని ఐదు జిల్లాల్లో ఆయన బస్సు యాత్ర చేస్తారు. ఆయనకు అండగా లోకేష్ కూడా పార్టీ బలోపేతం కోసం బస్సు యాత్రను ప్రారంభించనున్నారట. లోకేష్ రాజకీయ ఆరంగేట్రం టిడిపిలో కొత్త ఉత్సాహాన్ని రేపుతున్న విషయం తెలిసిందే. లోకేష్ సైలెంట్గా ఆరంగేట్రం చేశారనే చెప్పవచ్చు. కొద్ది నెలల క్రితం వరకు లోకేష్ ఆరంగేట్రంపై బాబు విముఖత చూపారు. ఆ తర్వాత ఆయన అంగీకరించారు.
అప్పటి నుండి లోకేష్ ఆరంగేట్రంపై చర్చ సాగింది. ఇదిగో అదిగో అంటుండగానే అతను సైలెంట్గా రాజకీయాల్లోకి ప్రవేశించారు. వచ్చే ఎన్నికల్లోను లోకేష్ పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చంద్రబాబు, బాలయ్య, లోకేష్లు పోటీ చేస్తే టిడిపికి పెద్ద ప్లస్ అవుతుందని భావిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఢీకొనేందుకు టిడిపికి సమర్థ, సమాన యువ నాయకత్వం కావాలని టిడిపి క్యాడర్ భావించింది.
అందులో భాగంగానే లోకేష్ రాజకీయ ఆరంగేట్రం చేశారని చెబుతున్నారు. సాధారణ ఎన్నికలు జరిగినా ముందస్తు ఎన్నికలు జరిగినా సమాయత్తంగా ఉండాలని టిడిపి అధినేత కార్యకర్తలకు, నేతలకు సూచిస్తున్నారు. ఇప్పటికే బాబు పాదయాత్రతో కొత్త ఉత్సాహం కనిపిస్తున్న టిడిపిలో లోకేష్ బస్సు యాత్ర మరింత ఊపు తెస్తుందని అంటున్నారు. వచ్చే ఎన్నికల వరకు లోకేష్ ప్రజల్లోనే ఉండాలనే అభిప్రాయంతో ఉన్నారట. ఒకవిధంగా అనధికార ఎన్నికల ప్రచారం అని కూడా చెప్పవచ్చునని అంటున్నారు.
గతంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్ర పేరుతో ఆ తర్వాత దీక్షలు, ధర్నాల పేరుతో నిత్యం ప్రజల్లో ఉన్నారు. జగన్ జైలుకు వెళ్లాక జగన్ సోదరి షర్మిల మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేపట్టారు. ఆ పార్టీ ప్రజల్లోకి వెళ్లేందుకు యాత్రలు, ధర్నాలు చేపడుతోంది. ఇప్పటికే అధికారానికి రెండుసార్లు దూరంగా ఉన్న టిడిపి మూడోసారి కూడా దూరమైతే ఆ పార్టీ నిలదొక్కుకోవడం కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాన ప్రతిపక్షంగా సమస్యలపై పోరాటం చేస్తూనే.. మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు తరహాలో ఎన్నికలకు ముందు నిత్యం ప్రజల్లో ఉండాలని లోకేష్ భావిస్తున్నారట.