దాపరికాలొద్దు: ఆస్తులు పోగేసుకున్న పార్టీలు
ప్రజలకు సేవ చేస్తామంటూ అధికారంలోకి వచ్చే పార్టీలు ఆ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందేనని, అవి సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయని సిఐసి స్పష్టం చేసింది. ‘మేమంతా ప్రత్యేకం. మేం మీ పరిధిలోకి రాం' అని 2012 నవంబర్లో పార్టీలు వాదించడాన్ని సిఐసి తోసిపుచ్చింది. ఈ తీర్పుతో రాజకీయ పార్టీలు సమాచార హక్కు పరిధిలోకి వచ్చేశాయి. ఇకపై ఆర్టీఐ కింద చిన్న దరఖాస్తు పెడితే పార్టీలు స్పందించక తప్పదు.
లేనిపక్షంలో కేసుల మీద కేసులు వేసి ఢిల్లీ స్థాయిదాకా వెళ్లి ఆ పార్టీల మెడలు వంచి మరీ నోరు తెరిపించవచ్చు. ఈ తీర్పుపై సమాచార హక్కు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటిదాకా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వం నుంచి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారీగా నిధులు పొందుతున్న స్వచ్ఛంద సంస్థలు మాత్రమే ఆర్టీఐ పరిధిలో ఉన్నాయి. ఇప్పుడు రాజకీయ పార్టీలు కూడా ఆర్టీఐ కిందికి వచ్చేశాయి.
సమాచార తీర్పుతో వెల్లడైన నిజాలు....
రాజకీయ పార్టీలు సమాచార హక్కు చట్టం కిందకే వస్తాయనే చారిత్రక తీర్పు నేపథ్యంలో ఆయా రాజకీయ పార్టీల స్వరూపం బయటపడింది. వివరాల ప్రకారం... దేశంలోని జాతీయ పార్టీలు ఢిల్లీలో రూ.2556 కోట్ల విలువైన ఆస్తులను కూడగట్టుకున్నాయి. గత మూడేళ్లలో రూ.510 కోట్ల పన్ను మినహాయింపు పొందాయి.
2006-09 మధ్య ఆయా రాజకీయా పార్టీలు పొందిన మినహాయింపులు ఇలా ఉన్నాయి... కాంగ్రెస్ రూ.300.92 కోట్లు, బిజెపి రూ.141.25 కోట్లు, బిఎస్పీ రూ.39.84 కోట్లు, సిపిఎం, రూ.18.13 కోట్లు, సిపిఐ రూ.0.24 కోట్లు, ఎన్సీపి రూ.9.64 కోట్లు.
ఢిల్లీలో ఆయా పార్టీలు పొందిన ఆస్తుల ప్రస్తుత మార్కెట్ విలువ ఇలా ఉంది... రాజేంద్రప్రసాద్ రోడ్డులోని, కోట్లా రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల విలువ రూ.1036.41 కోట్లు, రాజేంద్రప్రసాద్ రోడ్డులోని, కోట్ల రోడ్డులోని బిజెపి కార్యాలయాల విలువ రూ.557.23 కోట్లు, సిపిఎంది రూ.240.94 కోట్లు, సిపిఐది రూ.78.41 కోట్లు ఆర్జెడీది రూ.122.92 కోట్లుగా ఉన్నాయి.