చిరంజీవి, చంద్రబాబులకు అల్లుళ్ల టెన్షన్
శిరీష్ భరద్వాజ్ బిజెపిలో చేరారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ఆశయాలతో ముగ్ధుడై తాను బిజెపిలో చేరినట్లు శిరీష్ భరద్వాజ్ చెప్పారు. అయితే, చిరంజీవి కుటుంబ వివాదం గురించి నోరెత్తాలని శిరీష్ భరద్వాజ్పై బిజెపి నాయకుల నుంచి ఒత్తిడి పెరుగుతున్నట్లు చెబుతున్నారు. కానీ, శిరీష్ భరద్వాజ్ అందుకు ఇష్టపడడం లేదంటూ వార్తలు వస్తున్నాయి.
రాజకీయాల్లో, సమాజంలో తానేమిటో నిరూపించుకుంటానని, వేరేవాళ్లపై దుమ్ము పోయడం తనకు ఇష్టం లేదని ఆయన చెబుతున్నారట. కానీ, ఎన్నికల సమీపించేనాటికి పరిస్థితి ఎలా మారుతుందో, శిరీష్ భరద్వాజ్ మనసు ఎలా మారుతుందో చెప్పలేమని అంటున్నారు. శిరీష్ భరద్వాజ్ నుంచి చిరంజీవికి ఎప్పటికైనా రాజకీయంగా తిప్పలు తప్పవా అనే సందేహం తలెత్తుతోంది.
కాగా, జూనియర్ ఎన్టీఆర్ను చంద్రబాబు దూరంగా పెట్టారు. తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో జూనియర్ ఎన్టీఆర్కు వేలు పెట్టే సందు కూడా ఆయన ఇవ్వడం లేదు. తాను తెలుగుదేశం పార్టీలో ఉంటానని జూనియర్ ఎన్టీఆర్ ఒక్కటికి రెండు సార్లు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో అడిగితే తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తానని కూడా ఆయన అన్నారు. కానీ, చంద్రబాబు ఆయన సేవలను వినియోగించుకోవడానికి ఇష్టంగా లేరని అంటున్నారు.
ప్రస్తుతం మౌనముద్ర వహించిన జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు నోరు విప్పుతారోననే అనుమానాలు పీడిస్తూనే ఉన్నాయి. అయితే, ఆయన వేరే పార్టీలో చేరే అవకాశాలు లేవని చెబుతున్నారు. కానీ, చంద్రబాబుపై సమరానికి మాత్రం కాలు దువ్వే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. ఎన్నికలు సమీపించేనాటికి జూనియర్ ఎన్టీఆర్ ఏం చేస్తారోననే అనుమానాలు కలుగుతున్నాయి.