చెల్లాచెదురు: నారా వర్సెస్ నందమూరి (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీని మహా నటుడు ఎన్టీ రామారావు స్థాపించి 31 ఏళ్లు గడిచాయి. ప్రస్తుతం మార్చి 29వ తేదీన టిడిపి నాయకులు 32వ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ సమయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పాదయాత్ర చేస్తున్నారు. ఎన్టీ రామారావు పార్టీలో శాసనంగా ఉండేది. ఒక రకంగా ఆయన చండశాసనుడిగా వ్యవహరించారు.
పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోయినా ఆయన ఖాతరు చేయలేదు. పార్టీని నిలబెట్టి ముందుకు నడిపించారు. ఎన్టీఆర్ హయాంలో ఒక్కసారి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అయినా, ఏ విధమైన గందరగోళానికి గురి కాలేదు. కాంగ్రెసు వ్యతిరేకత అనే పార్టీ ప్రధాన ఎజెండాకు విఘాతం కలగలేదు. మళ్లీ అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. లక్ష్మీపార్వతిని రెండో వివాహం చేసుకున్నట్లు ఎన్టీ రామారావు బహిరంగ సభ వేదిక మీది నుంచి ప్రకటించినా పార్టీ విజయంపై ఏ విధమైన ప్రభావం పడలేదు.
కానీ, ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు చేతుల్లో పార్టీ నాయకత్వం వచ్చిన తర్వాత గత రెండు పర్యాయాలు దానికి అధికారం అందని ద్రాక్షే అయింది. 2014 ఎన్నికల్లో పార్టీ గెలవకపోతే పరిస్థితి దారుణంగా ఉంటుందనే చంద్రబాబుకు కూడా అర్థమైంది. అందుకే ఆయన కఠిన శ్రమకోరుస్తూ పాదయాత్ర చేపట్టారు. కానీ, ఆయన సమస్యలు చుట్టుముడుతూనే ఉన్నాయి.
నందమూరి, నారా కుటుంబాలకు మధ్య నాయకత్వ పోరు జరుగుతోంది. ఎన్టీఆర్ వారసత్వం కోసం నందమూరి హీరోలు ప్రయత్నాలు చేస్తుంటే, నారా వారసత్వం కోసం చంద్రబాబు పట్టుబట్టి కూర్చున్నారు. తన కుమారుడు నారా లోకేష్కు పార్టీ పగ్గాలను అప్పగించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీ చంద్రబాబు చేతికి వచ్చిన తర్వాత తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వర రావు దూరమయ్యారు. ఆయన సతీమణి, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెసులో చేరిపోయారు.
ఎన్టీ రామారావు హయాంలో తెలుగుదేశం పార్టీలో ఆయన మాటే శిలాశాసనంగా ఉండేది. పార్టీ అంటే ఆయన, అయనంటే పార్టీ. కానీ ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు చెల్లాచెదురై పార్టీకి పునరుజ్జీవం సందేహంగా మారింది. ఎన్టీఆర్ పార్టీని స్థాపించి 31 ఏళ్లు నిండాయి. ఈ సమయంలో పార్టీ తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తే తప్ప పార్టీకి మనుగడ ఉండదనేది అందరూ అనుకుంటున్న మాటే.
చంద్రబాబు ఎన్టీ రామారావు నుంచి పార్టీని సొంతం చేసుకున్న తర్వాత ఓసారి ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ఆ తర్వాత రెండు సార్లు ఓటమి పాలయ్యారు. ఈసారి పార్టీని గెలిపించలేకపోతే పార్టీకే కాకుండా వ్యక్తిగతంగా చంద్రబాబుకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పార్టీ మనుగడ ప్రశ్నార్థకంగా మారవచ్చు. అందుకే ఆయన పాదయాత్ర చేస్తూ ప్రజలను తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
నందమూరి హీరో బాలకృష్ణ బావ చంద్రబాబు పక్కన నిలుస్తున్నారు. అయితే, ఆయనను కూడా ఏదో సందేహం పీడిస్తున్నట్లే ఉంది. తనను లోకసభకు పోటీ చేయిస్తారనేది ఆ సందేహం. అలా కాకుండా చూసుకోవడానికి ఆయన శాసనసభకే పోటీ చేస్తానని పదే పదే చెబుతున్నారు. తన వారసుడిగా ఓ సమయంలో బాలకృష్ణను ఎన్టీ రామారావు ప్రకటించినప్పుడు చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో తన మాటలను ఎన్టీఆర్ వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
సోదరుడు బాలకృష్ణ సినిమాల్లో బిజీగా ఉంటే నందమూరి హరికృష్ణ రాజకీయాల్లో చురుగ్గా ఉండడానికి ప్రయత్నించారు. ఎన్టీ రామారావు నుంచి అధికారం చంద్రబాబు చేతిలోకి రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత చంద్రబాబుకు దూరమయ్యారు. ఆ తర్వాత మళ్లీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు. ఇప్పుడు ఆయన చంద్రబాబుపై అలక వహించినట్లు చెబుతున్నారు. పార్టీలో అంతర్గత పోరుకు ఆయన తెర లేపినట్లు అనుమానిస్తున్నారు.
ఎన్టీఆర్ నుంచి అధికారం చేజిక్కించుకునే క్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వర రావు చంద్రబాబుకు సహకరించారు. కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయకత్వంలో ఇమడలేకపోయారు. వివిధ పార్టీలు తిరిగి చివరికి కాంగ్రెసులో స్థిరపడిపోయారు. ఈ క్రమంలో ఆయన భార్య, ఎన్టీఆర్ కూతురు దగ్గుబాటి పురంధేశ్వరి రాజకీయాల్లోకి వచ్చి కాంగ్రెసులో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మంత్రిగా ఆమె పదవీబాధ్యతలు నిర్వహిస్తున్నారు.
చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ పార్టీ నాయకత్వాన్ని తన చేతుల్లోకి తీసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు ఆయనకు తండ్రి మద్దతు కూడా లభిస్తోంది. పార్టీలో ఇప్పుడు నిర్ణయాలన్నీ నారా లోకేష్వేనని అంటున్నారు. తెర వెనక కార్యాలు చక్కబెడుతున్న ఆయన త్వరలోనే తెర ముందుకు రానున్నారు.
చంద్రబాబుకు ఇప్పుడు అసలు సమస్య జూనియర్ ఎన్టీఆర్. తాత వారసత్వం కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబుపై పోరాటంలో నందమూరి హరికృష్ణ తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ను తురుపు ముక్కగా వాడుతున్నట్లు భావిస్తున్నారు. హరికృష్ణ వర్గమంతా ఇప్పుడు పార్టీ నుంచి ఒక్కరొక్కరే తప్పుకునేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ వ్యవహారశైలి వైయస్ జగన్కు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు చెల్లాచెదురైనట్లు కనిపిస్తున్నారు. నందమూరి కుటుంబంలోకి దూకుడుగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు చంద్రబాబుకు పెద్ద సవాల్గా మారారు. ఆయన తండ్రి నందమూరి అండదండలు ఉండడం కూడా చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. మరోవైపు, పార్టీ నుంచి శాసనసభ్యులు, నాయకులు ఒక్కరొక్కరే వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులోకి జారిపోతున్నారు. పార్టీని, కుటుంబ సభ్యులను ఒక్కతాటి మీద నిలబెట్టలేక చంద్రబాబు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తున్నారు. అయితే, తన నాయకత్వంలో తిరిగి పార్టీ అధికారంలోకి తెస్తాననే ధీమాతో పాదయాత్రను కొనసాగిస్తున్నారు.