తెలంగాణ ఇష్యూ: రింగ్ లీడర్ జైపాల్ రెడ్డే
చాలా కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్న జైపాల్ రెడ్డి లోలోపల మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తన వాదనను అధిష్టానం పెద్దల వద్ద గట్టిగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీతో కూడా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పినట్లు సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంటే పార్టీకి ప్రయోజనం చేకూరే తీరును కూడా ఆయన వివరించినట్లు చెబుతున్నారు.
రాష్ట్ర ఏర్పాటుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఆయన అధిష్టానం పెద్దలతో నిరంతరం మాట్లాడుతున్నట్లు సమాచారం. కాగా, అధిష్టానం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యోచన నుంచి వెనక్కి తగ్గకుండా చూడాలంటే ఈ నెల 30వ తేదీన హైదరాబాదులో తలపెట్టిన సభను విజయవంతం చేయాలని తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులతో చెబుతున్నట్లు తెలుస్తోంది. జైపాల్ రెడ్డి చొరవ కారణంగానే తెలంగాణకు చెందిన కాంగ్రెసు నాయకులంతా ఒక తాటిపైకి వచ్చి తెలంగాణ సభను విజయవంతం చేయడానికి పనిచేస్తున్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, తెలంగాణపై మరోమారు కూలంకషంగా చర్చించాలని, ఆచితూచి వ్యవహరించాలని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో మరో నెల రోజుల పాటు తెలంగాణపై నిర్ణయం వెలువడే అవకాశాలు లేవని అంటున్నారు. పంచాయతీ ఎన్నికలు, ఇతర స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు వేచి చూడాలని భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణపై నిర్ణయం తీసుకునే విషయంలో పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా కీలక భూమిక పోషించినట్లు తెలుస్తోంది. శ్రీనివాస్పై సోనియా గాంధీకి అపారమైన విశ్వాసం ఉంది. విషయాలను పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని విశ్లేషిస్తారని ఆమెకు డిఎస్పై విశ్వాసం ఉంది. దీంతో ఆయనను విశ్వాసంలోకి తీసుకుని కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే రాయల తెలంగాణ, ప్యాకేజీల ప్రతిపాదనల ప్రచారాన్ని డిఎస్ కొట్టిపారేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తీరుతుందని ఆయన గట్టిగానే చెబుతున్నారు. తెలంగాణ ఇచ్చేది, తెచ్చేది కాంగ్రెసు పార్టీ అంటూ తెలంగాణ కాంగ్రెసు నాయకులు ఇప్పటికే పెద్ద యెత్తున ప్రచారంలోకి దిగారు. తామే తెలంగాణను తెచ్చామని, తమ అధిష్టానం ఇచ్చింది అని చెప్పుకోవడానికి అవసరమైన ప్రాతిపదికను ప్రకటనకు ముందే వారు తయారు చేసుకుంటున్నట్లు కనిపిస్తోంది. తద్వారా విభజన తర్వాత రాజకీయ ప్రయోజనాలు తమకే దక్కేలా వారు జాగ్రత్త పడుతున్నట్లు చెబుతున్నారు.