తిరుమలలో సాయి హల్చల్!: వెంట తారకరత్న
కుమార్తె పెళ్లి కోసం బెయిల్ తీసుకున్న విజయ సాయి.. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆదివారం శ్రీవారిని దర్శించుకోడానికి కుటుంబ సమేతంగా తిరుమల చేరుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు, హీరో నందమూరి తారకరత్న... ఇలా దాదాపు 15 మంది ఎల్1 కింద (వివిఐపిలలో అత్యంత ఉన్నతమైన స్థానం) తెల్లవారుజామున 5.30 గంటలకు ఆలయంలోకి ప్రవేశించారు. ఆ తర్వాత ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు.
దాదాపు మూడు గంల పాటు ఆలయంలోనే ఉన్నారు. ఇంతసేపు ఆలయంలో ఏం చేశారని విలేకరులు ప్రశ్నించగా, టిటిడి బోర్డు మాజీ సభ్యుడి హోదాలో ధ్యానం చేసుకుని వస్తున్నట్లు సమాధానమిచ్చారు. అయితే విజయ సాయి రెడ్డి తన మనవడికి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అన్నప్రాసన చేయించారు. ఇది నిబంధనలకు విరుద్ధం. 1987లో ముఖ్యమంత్రి కుమారుడి హోదాలో సినీనటుడు బాలకృష్ణ తన కుమార్తె బ్రాహ్మణికి రంగనాయకుల మండపంలో అన్నప్రాశన చేయగా, అప్పట్లో పెద్ద దుమారం రేగింది.
ఈ చర్యను పీఠాధిపతులు తప్పుబట్టారు. దీనికి ఎన్టీఆర్ కలత చెందారు. ఆలయ నిబంధనలను మరింత కట్టుదిట్టం చేశారు. ఇలాంటి కార్యక్రమాలను ఆలయం వెలుపలే చేసుకోవాలని నిబంధన పెట్టారు. ఇప్పుడు విజయ సాయి రెడ్డి కుటుంబానికి మాత్రం మినహాయింపు ఇచ్చారు. రంగనాయకుల మండపంలోనే అన్నప్రాశనకు అవకాశం కల్పించి, దగ్గరుండి ఆశీర్వచనాలు ఇప్పించారు. దర్శనాలు, ఆశీర్వచనాలు, అన్నప్రాశన ఈ కార్యక్రమాలన్నీ ముగియడానికి 3 గంటల సమయం పట్టింది.
అంతసేపు విజయ సాయి రెడ్డి, ఆయనతోపాటు వెళ్లిన 15 మంది ఆలయంలో ఉన్నారు. మరోవైపు తిరుమలలో గత నాలుగు రోజులుగా భక్తుల రద్దీ అధికంగా ఉంది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం క్షణం కూడా నిలవడనీయకుండా భక్తులను మందిరం వెలుపలికి బలవంతంగా పంపేందుకు టిటిడి చర్యలు తీసుకుంటోంది. వెనుక వచ్చే యాత్రికులకు అవకాశం ఇవ్వడానికి బలవంతం చేయక తప్పదని నచ్చజెప్పి పంపిస్తున్నారు.
విజయ సాయి రెడ్డి విషయంలో మాత్రం మూడు గంటల సమయం గడిపే అవకాశం కల్పించారు. వ్యక్తిగత కార్యకర్మాల కోసం రంగనాయకుల మండపంలో సందడి చేసినా అభ్యంతరం చెప్పలేదట. రంగనాయకుల మండపంలో కూర్చుని గంటన్నర పాటు ధ్యానం చేసుకున్నానని విజయ సాయి రెడ్డి చెప్పడం గమనార్హం.