విందూతో కోహ్లీ, భజ్జీ లింక్స్: టీమ్ బాస్కో కోటి లాస్?
అయితే, రాయల్ చాలెంజర్స్ బెంగళూర్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్భజన్ సింగ్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ క్రీడాకారుడు మన్ప్రీత్ గోని తనకు అత్యంత సన్నిహితులని విందూ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు వారి ముగ్గురిపై కూడా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఉన్నప్పుడు గోనీ 2008లో భారత వన్డే జట్టులో ఉన్నాడు.
విందూ దారాసింగ్ ఓ జట్టు బాస్ గురించి కూడా చాలా విషయాలు చెప్పినట్లు సమాచారం. ఈ ఐపియల్ సీజన్లో తన ద్వారా బెట్టింగులో సొమ్ము పెట్టిన ఓ ఐపియల్ జట్టు బాస్ కోటి రూపాయలు నష్టపోయినట్లు విందూ ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోది. గత వారం రోజులుగా వార్తల్లో నానుతూ వస్తున్న బాస్ గురించి విందూ ఆ విషయం చెప్పినట్లు శుక్రవారం వార్తలు వచ్చాయి.
అయితే, టీమ్ బాస్ విందూతో తన సంబంధాలను వెల్లడించే అవకాశాలు ఏ మాత్రం లేదు. తన జట్టుకు సంబంధించిన సమాచారాన్ని విందూకు ఆ బాస్ చేరవేశాడా అనే విషయంపై పోలీసులు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కాగా, తన జట్టుపై కాకుండా ఇతర జట్లపై ఆయన విందూ ద్వారా బెట్టింగ్ కట్టాడా అనే దిశలో ఆలోచన సాగుతోంది. విందూ చెప్పిన విషయాల్లో ఏ మేరకు వాస్తవం ఉందనేది తేలాల్సే ఉంది.