మరీ దారణంగా, సెహ్వాగ్ కథ కంచికే?
రెండో టెస్టు తొలి ఇన్నింగ్సులో అతను ఘోరంగా విఫలమయ్యాడు. రెండో ఇన్నింగ్సు ఆడే అవకాశం వస్తుందో రాదో తెలియదు. రెండో టెస్టు మ్యాచు తనకు అత్యంత కీలకమని తెలిసి కూడా సెహ్వాగ్ దారుణంగా విఫలమయ్యాడు. భవిష్యత్తుపై ఆందోళనో, బాగా ఆడాలన్న అతి జాగ్రత్తో గానీ సెహ్వాగ్ ఆటలో వాడి తగ్గిందని మీడియా వ్యాఖ్యానిస్తోంది.
హైదరాబాదులో జరుగుతున్న తొలి టెస్టు మ్యాచు తొలి ఇన్నింగ్సులో తొలి రోజు ఆరు బంతులు ఆడి, ఓ ఫోర్ కొట్టాడు. మర్నాడు ఆదివారం 13 బంతులు ఆడి రెండు పరుగులు చేశాడు. అతను ఎక్కువగా సిడిల్ బౌలింగునే ఎదుర్కున్నాడు. అయితే, సెహ్వాగ్ ఆత్మవిశ్వాసంతో ఆడిన బంతి ఒక్కటి కూడా లేదు. చివరకి సిడిల్కే దొరికిపోయాడు. సిడిల్ వేసింది అద్భుతమైన బంతేమీ కాదు. కాస్తా బౌన్సై వచ్చింది. దాన్ని సెహ్వాగ్ ఆత్మవిశ్వాసంతో ఎదుర్కోలేకపోయాడు. బంతి సెహ్వాగ్ బ్యాట్ను ఒరుసుకుంటూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది.
వరుసగా విఫలమవుతూ వస్తున్న గౌతం గంభీర్ను పక్కన పెట్టి సెహ్వాగ్కు జట్టులో చోటు కల్పించారు. కానీ ఆ అవకాశాన్ని కూడా సెహ్వాగ్ జారవిడుచుకున్నట్లే కనిపిస్తున్నాడు. మరోవైపు, యువకులు ఓపెనింగ్ స్లాట్లో కూడా తమ సత్తా చాటడానికి ఎదురు చూస్తున్నారు. సెహ్వాగ్ అవుటైన తర్వాత మురళీ విజయ్, ఛతేశ్వర్ పుజారా అద్భుతంగా ఆడారు. వారి ముందు సెహ్వాగ్ ఎందుకు కొరగాకుండా పోయాడు.
ఇప్పటి వరకు 103 టెస్టులు ఆడిన సెహ్వాగ్ 49.59 సగటుతో 8580 పరుగులు చేశాడు. గత 22 టెస్టుల్లో సెహ్వాగ్ చేసింది ఒక్క సెంచరీ మాత్రమే. 2010 నవంబర్లో న్యూజిలాండుపై 173 పరుగులు చేసిన అతను మళ్లీ 2012 నవంబర్లో ఇంగ్లాండుపై అహ్మదాబాదులో సెంచరీ చేశాడు. 2011లో ఏడు టెస్టుల్లో 13 ఇన్నింగ్సు ఆడి అతను 29.53 సగటుతో 384 పరుగులు చేశాడు. 2012లో 9 మ్యాచుల్లో 16 ఇన్నింగ్సు ఆడి 31.56 సగటుతో 505 పరుగులు చేశాడు. ఈ గణాంకాలను చూస్తే అతను మునుపటి వీరేంద్ర సెహ్వాగ్ కాడనే విషయం సులభంగానే అర్థమవుతుంది.
ఓపెనింగ్ స్లాట్ కోసం యువకులు కాచుకుని కూర్చున్నారు. మురళీ విజయ్ ఈ మ్యాచులో తన ప్రతిభను ప్రదర్శించి, తన స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించాడు. గంభీర్తో పాటు శిఖర్ ధావన్, అజింక్యా రహనే పోటీలో ఉన్నారు. రోహిత్ శర్మ కూడా ఈ స్లాట్కు పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఈ స్థితిలో వీరేంద్ర సెహ్వాగ్ కథ కంచికి చేరే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.