కాదంటూనే..: జగన్, కాంగ్రెస్ పొత్తు ఎత్తులు?
వచ్చే ఎన్నికల్లో జగన్ పార్టీతో పొత్తుపై వాయలార్ రవి శనివారం ఖండించలేదు. పైగా ఈ వ్యవహారం రాష్ట్ర కాంగ్రెసు చేతిలో పెట్టారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కూడా అధికారం కోసం అడ్డదారులు తొక్కమని చెబుతూనే కాంగ్రెసు పార్టీ సిద్ధాంతాలు, ఆలోచనలు, సోనియా గాంధీ నాయకత్వానికి ఆకర్షితులై వచ్చిన వారితో పొత్తులుంటాయని చెప్పారు. బొత్స కూడా తన వ్యాఖ్యల్లో జగన్ పార్టీతో పొత్తుపై పూర్తిగా కొట్టివేసినట్లుగా కనిపించడం లేదు.
మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తీరు కూడా అలాగే ఉంది. వాయలార్ రవి వ్యాఖ్యలు వన్ సైడ్ లవ్ స్టోరీగా ఉందని చెబుతూనే... రాష్ట్రం వరకు తాము ఎవరితోనూ పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదని, జాతీయ స్థాయిలో తన పార్టీ అధినేత లౌకికవాద పార్టీలతో పొత్తు ఉండవచ్చునని గతంలోనే చెప్పారని మైసూరా అన్నారు. రాష్ట్రం వరకు నో చెప్పినా జాతీయస్థాయిలో కాంగ్రెసుతో వెళ్లేందుకు సిద్ధమన్న సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.
అంటే రాష్ట్రంలో ఎలాగూ తమకు ఆశించిన సీట్లు వస్తాయనే భావనతో రాష్ట్రంలో కాంగ్రెసుతో అవసరం లేకున్నా ఎన్నికల తర్వాత అవసరమైన పక్షంలో యూపిఏ ప్రభుత్వానికి బయటి నుండి మద్దతిచ్చే అవకాశాలను కూడా కొట్టి పారేయలేమంటున్నారు. ఎన్నికల సమయంలో మాత్రం జగన్ పార్టీ పొత్తులకు నో చెబుతోంది. ఎన్నికల తర్వాతనే ఆ విషయం గురించి ఆలోచించే అవకాశముందని అంటున్నారు. అదే సమయంలో ఎన్డీయే, యూపిఏకు ప్రత్యామ్నాయంగా మరో ఫ్రంట్ కూడా రావొచ్చునని వారు అంటున్నారు. అయితే తృతీయ ఫ్రంట్ వచ్చినా అందులో తెలుగుదేశం పార్టీ ఉండే అవకాశాలు ఉన్నందున.. జగన్ పార్టీ జాతీయస్థాయిలో మద్దతు అవసరం వస్తే యూపిఏకే చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు.