ఇక్కడ లేదా అక్కడ: విభజనపై జగన్ పార్టీ లెక్క
తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల్లోని కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీ నేతలు చాలామంది విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయం కోసం నిరీక్షిస్తున్నారు. గతంలో ఉన్నంత లేకపోయినప్పటికీ విభజిస్తే పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తామని ఇప్పటికే పలువురు ప్రకటించారు.
మరోవైపు విభజనపై రాష్ట్రంలో వేడి రాజుకుంటుండగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇరు ప్రాంతాల నేతలను మౌనం దాల్చమని ఆదేశించారు. ప్రస్తుతానికి వారు సైలెంట్గా ఉన్నప్పటికీ నిర్ణయం సంతృప్తికరంగా లేకుంటే పలువురు టిడిపిని వీడేందుకు సిద్ధంగా ఉన్నారంటున్నారు.
అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందో తెలియక మాత్రమే ఆగిపోయారంటున్నారు. నిర్ణయం ప్రకటించాక పార్టీని గుడ్ బై చెప్పే అవకాశాలు లేకపోలేదంటున్నారు. తమను చంద్రబాబు మాట్లాడనివ్వలేదని ఆరోపించే అవకాశాలు కూడా ఉన్నాయని చెబుతున్నారు. నిర్ణయాన్ని బట్టి ఓ ప్రాంతంలోని టిడిపి, కాంగ్రెసు నేతలు కచ్చితంగా చేరేందుకు ఆసక్తి చూపుతారని భావిస్తున్నారట.
అధిష్టానం నిర్ణయం తెలంగాణకు వ్యతిరేకంగా ఉంటే తెలంగాణ ప్రాంతంలోని కాంగ్రెసు పార్టీ నేతలు పెద్ద ఎత్తున తమ పార్టీలోకి వస్తారని భావిస్తున్నారట. నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, కోమటిరెడ్డి సోదరులు వంటి వారు ఆ పార్టీని విడిచి వస్తారని భావిస్తున్నారట. అదే సమయంలో టిటిడిపి నేతలు వచ్చే అవకాశాలు లేవని లెక్కలు వేసుకుంటున్నారట.
నిర్ణయం సమైక్యాంధ్రకు వ్యతిరేకంగా ఉంటే కాంగ్రెసు, టిడిపిల నుండి పెద్ద ఎత్తున తమ పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయని జగన్ పార్టీ భావిస్తోందట. సీమాంధ్రలో టిడిపి నేతలు కూడా రావడానికి.. జగన్ పార్టీకి సమైక్యముద్ర ఉండటమే కారణమంటున్నారు. ఇక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ఉంటే ఆ ప్రాంతంలో తమ పార్టీకి చెందిన పలువురు నేతలు గుడ్ బై చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ లెక్కలు వేసుకుంటోందట.