వైఎస్ రిజర్వ్ ప్లాన్: సాయి పదవి, జగన్కి పెట్టుబడి
టిటిడి బోర్డు సభ్యుడు, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ తర్వాత రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ పదవిని కట్టబెట్టే ప్రయత్నం చేశారని సిబిఐ దర్యాఫ్తులో తెలిసిందని ప్రముఖ తెలుగు దినపత్రిక ఈనాడు రాసింది. సాయి రెడ్డికి వైయస్తో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్న సంబంధాలకు ఆధారాలతో పాటు వైయస్ కేంద్రానికి చేసిన సిఫార్సుల లేఖను సోమవారం దాఖలు చేసిన అనుబంధ ఛార్జీషీటులో సిబిఐ చేర్చిందని వార్తలు వచ్చాయి.
వైయస్ తండ్రి రాజారెడ్డి హయాం నుండి సాయి రెడ్డికి ఆయన కుటుంబంతో అనుబంధాన్ని సిబిఐ పేర్కొందట. వైయస్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయనకు పలు పదవులు కట్టబెట్టారని తెలిపిందని సమాచారం. ఓబిసి డైరెక్టరుగా సాయి రెడ్డిని నియమించాలని వైయస్ 2006 ప్రారంభంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిఫార్సు చేయగా... ఆదే ఏడాది చివర్లో ఆయనను నియమించారు. మూడేళ్లు ఆయన కొనసాగారు.
విజయ సాయి రెడ్డి ఓబిసిలో డైరెక్టరుగా ఉంటూ జగతి పబ్లికేషన్స్, సండూరు డైరెక్టర్లుగా కొనసాగడం ఓబిసి నియమావళిని ఉల్లంఘించడమేనని సిబిఐ పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. 2009 జూన్ 17న వైయస్.. సాయిని ఆర్బిఐ డైరెక్టర్గా నియమించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశారని, కేంద్రమంత్రిత్వ శాఖ వద్ద ఉన్న రెండు ప్రాధాన్య జాబితాల్లో ఒకదాంట్లో ఏడో వ్యక్తిగా, మరో దాంట్లో మూడో వ్యక్తిగా సాయి పేరు ఉందని సిబిఐ వెల్లడించినట్లుగా సమాచారం.
వైయస్ కుటుంబంతో తన అనుబంధానికి నిదర్శనంగా సాయి రెడ్డి.. జగన్కు చెందిన జగతి తదితర సంస్థలలో పెట్టుబడులను తీసుకు వచ్చే బాధ్యతను తీసుకున్నారని సిబిఐ పేర్కొందట. జగన్, వైయస్ల కుట్రలో సాయి రెడ్డి భాగస్వామి అయ్యారని తెలిపిందట. పదవులకు ప్రతిఫలంగా జగన్కు పెట్టుబడులను విజయ సాయి రెడ్డి రాబట్టారని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది.