హడలెత్తిస్తున్న ట్రంప్: నిరసనల వెల్లువ
ట్రంప్ నిరంకుశ అధికారంపై నిరసన వెల్లువెత్తుతున్నది.
వాషింగ్టన్: ముస్లిం జనాభాగల ఏడు దేశాలు.. ఇరాన్ , ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్ , సిరియా, యెమెన్ నుంచి శరణార్థుల వలసను అడ్డుకునేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు నెలల నిషేధం విధిస్తూ జారీచేసిన ఆదేశం అమెరికన్లతోపాటు వివిధ దేశాల ప్రవాసీలు హడలిపోతున్నారు. ట్రంప్ నిరంకుశ అధికారంపై నిరసన వెల్లువెత్తుతున్నది.
దేశంలోని అన్ని విమానాశ్రయాల వద్ద నిరసన జ్వాలలు వెల్లువెత్తుతున్నాయి. న్యూయార్క్లోని జాన్ కెన్నడీ, లిబర్జీ విమానాశ్రయాల వద్ద గుమిగూడిన ఆందోళనకారులు.. 11 మంది శరణార్థుల అరెస్ట్ను తీవ్రంగా తప్పుబట్టారు. తామంతా శరణార్థులమే, 'నేను నా ముస్లిం నైబర్ ను ప్రేమిస్తా', 'అడ్డుగోడలొద్దు', 'నిషేధం వద్దు' అని రాసి నినాదాలు రాసి ఉన్న ప్లకార్డులు ప్రదర్శించారు. వైట్ హౌస్ బయట, బోస్టన్ కొప్లే స్క్వేర్, మాన్ హట్టన్లోని బ్యాటరీ పార్క్, అట్లాంటా, లాస్ ఎంజిల్స్, డల్లాస్, వాషింగ్టన్ తదితర నగరాల్లోని విమానాశ్రయాల వద్ద ఆందోళనకారులు భారీగా చేరారు.
ట్రంప్ తాజా నిర్ణయంతో అమెరికా పౌరసత్వం కలిగి ఉంటే తప్ప, తాత్కాలిక విద్యార్థి, ఉద్యోగ వీసాలు ఉన్నవారితోపాటు గ్రీన్ కార్డుదారులు ఒకసారి అమెరికాను వీడితే ఇక తిరిగి వెళ్లడం కుదరదు. ట్రంప్ నిర్ణయంతో పలు కుటుంబాలు విడిపోవడమే కాక, కొడుకు పెళ్లికి తల్లిదండ్రులు వెళ్లలేరు. కొత్త దంపతులకు వివాహ వీసా రద్దు కావడంతో వారు విడిగా ఉండాల్సిందే. ఇరాన్ నుంచి అమెరికా వెళ్తోన్న పలువురిని విమనాశ్రయాల్లోనే అడ్డుకున్నారు. ఈ ఏడు దేశాలకు చెందిన ద్వంద్వ పౌరసత్వం ఉన్నవారికీ అమెరికాలో ప్రవేశం ఉండకపోవచ్చని బాగ్దాద్లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది.
ఏ కారణంతో స్వదేశానికి వెళ్లినా ఇక అంతే
సెలవు, ఉద్యోగ కారణాలతో అమెరికా వదిలి వెళ్లినవారినీ తమదేశంలోకి అనుమతించబోమని అమెరికా హోం ల్యాండ్ భద్రతా విభాగం అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఏడు దేశాలకు చెందిన విద్యార్థి, ఉద్యోగ వీసాలపై అమెరికాలో నివసిస్తున్న వారితోపాటు 5 లక్షల మంది గ్రీన్ కార్డుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దౌత్య వీసాలు ఉన్నవారికి మాత్రమే మినహాయింపు ఉంటుందని హోం ల్యాండ్ విభాగం చెబుతోంది. ‘ఈ నిర్ణయం ప్రకారం తాత్కాలికంగా విదేశీ పర్యటనకు వెళ్లిన వారు అమెరికాకు తిరిగి రావడం కష్టం. విద్యార్థి శీతాకాల సెలవుపై స్వదేశానికి వెళ్తే అమెరికా రావడం కుదరదు' అని న్యాయ నిపుణుడు లెగోంస్కీ అన్నారు. మూడేళ్లలో ఈ ఏడు దేశాలకు చెందిన 25 వేల మందికి విద్యార్థి లేదా ఉద్యోగ వీసాలు జారీ చేశారని, గత పదేళ్లలో 5 లక్షల మందికి గ్రీన్ కార్డులు జారీ అయ్యాయని హోం ల్యాండ్ భద్రతా నివేదికలు చెప్తున్నాయి. గ్రీన్ కార్డుదారుల్లో ఇరాన్, ఇరాక్లకు చెందిన వారే 2.5 లక్షల మంది వరకూ ఉన్నారు.
ఆందోళనలకు హిల్లరీ మద్దతు
డొనాల్డ్ ట్రంప్ నిషేధాజ్నలకు నిరసనగా ఆందోళన చేస్తున్న వారికి డెమొక్రటిక్ పార్టీ నాయకురాలు, విదేశాంగశాఖ మాజీ మంత్రి హిల్లరీ క్లింటన్ మద్దతు పలికారు. అమెరికా రాజ్యాంగం, విలువల పరిరక్షణ కోసం ఆందోళన చేస్తున్న వారికి తన మద్దతు ఉంటుందన్నారు. ట్రంప్ ఆదేశాలు అమెరికా విధానం కాదని ట్వీట్ చేశారు.
బలమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ కావాలి: మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్, సిఇఓ సత్య నాదెళ్ల
ట్రంప్ నిర్ణయాన్ని ప్రముఖ సాఫ్ట్ వేర్ జెయింట్ మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బ్రాడ్ స్మిత్, సిఇఓ సత్య నాదెళ్ల వ్యతిరేకించారు. ట్రంప్ ఆదేశాలను ఖండిస్తూ సంస్థ ఉద్యోగులకు ‘ఈ- మెయిల్' పంపారు. ‘సమర్థవంతమైన, సమతూకంతో కూడిన అత్యంత నైపుణ్యవంతమైన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ అవసరం అని మేం భావిస్తున్నాం. అదే విధంగా విస్త్రుతస్థాయి ఇమ్మిగ్రేషన్ అవకాశాలు కల్పించాలని భావిస్తున్నాం. ప్రతిభావంతులకు, చట్టంపట్ల నిబద్ధతతో పనిచేసే వారికి రక్షణలు కల్పించాలి. ఇమ్మిగ్రేషన్ చట్టాలు ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ త్యాగం చేయకుండా రక్షించాలి' అని ఆ ఈ - మెయిల్ లో పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా మెక్రో సాఫ్ట్ సంస్థ తరఫున అమెరికా నుంచి వివిధ దేశాలకు వెళ్లిన వారిలో ఆ ఏడు దేశాలకు చెందిన76 మంది ఎగ్జిక్యూటివ్లపై ట్రంప్ నిషేధాజ్నలు అమలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ట్రంప్ జారీచేసిన ఆదేశం తప్పుదోవ పట్టడంతోపాటు ప్రాథమిక హక్కులు వెనుకడుగు వేస్తాయని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. ప్రజల రక్షణకు సమర్థవంతమైన మార్గాలు అనుసరించాలేగానీ, దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలు చేపట్టొద్దని వ్యాఖ్యానించింది.
ప్రతిభకు అడ్డంకులు: సుందర్ పిచ్చాయ్
ట్రంప్ జారీచేసిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు అమెరికాలోకి ప్రతిభావంతులైన నిపుణుల రాకకు అడ్డంకులు కల్పిస్తాయని గూగుల్ సిఇఓ సుందర్ పిచ్చాయ్ వ్యాఖ్యానించారు. ఏడు ముస్లిం దేశాల నుంచి గూగుల్ కు ప్రాతినిద్యం వహిస్తున్న 187 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని సంస్థ సిబ్బందికి పంపిన ఈ - మెయిల్లో తెలిపాడు. వివిద దేశాల్లో విధులు నిర్వర్తిస్తున్న 100 మంది సిబ్బందిని తక్షణం అమెరికాకు వచ్చేయాలని ఆదేశించారు.
ప్రపంచ దేశాధినేతల ఖండన
ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచ దేశాధినేతలు తప్పుపట్టారు. ఉగ్రవాదంపై పోరు అత్యంత అవశ్యకమైనా సరే ఒక జాతికి, విశ్వాసానికి చెందిన ప్రజల్ని సందేహించడం సరికాదని జర్మనీ చాన్స్లర్ ఏంజెలా మెర్కెల్ తప్పుపట్టారు. ద్వంద్వ పౌరసత్వం ఉన్న జర్మనీ ప్రజలపై ట్రంప్ నిర్ణయ ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని అంగీకరించమని బ్రిటన్ ప్రధాని థెరెసా మే అన్నారు. ట్రంప్ ఆదేశాలపై ఆలస్యంగా స్పందించిన థెరిసా మేపై పలువురు ప్రముఖులు తీవ్ర నిరసన తెలిపారు.
నిషేధాన్ని సమర్థించుకున్న ట్రంప్
ఏడు ముస్లిం దేశాల నుంచి పౌరుల వలసలపై తాత్కాలిక నిషేధం చాలా బాగా పనిచేస్తుందని, అలాగే కొనసాగుతుందని ట్రంప్ చెప్పారు. ‘విమానాశ్రయాలు, తదితర చోట్ల చాలా బాగా పనిచేస్తోంది. మనం చాలా కఠినమైన నిషేధం అమలుచేస్తున్నాం. ఎన్నో ఏళ్ల నుంచి ఇలా చేసి ఉండాల్సింది' అని చెప్పారు. ఈ నిర్ణయం ముస్లింలపై నిషేధం కాదని సమర్థించుకునేందుకు ప్రయత్నించారు. ఐఎస్ను ఓడించేందుకు 30 రోజుల్లో సమగ్ర వ్యూహాన్ని రచించాలని ట్రంప్ ఆ దేశ సైనిక విభాగాన్ని ఆదేశించారు.
శరణార్థులకు కెనడా ఆహ్వానం
ట్రంప్ నిర్ణయానికి దీటుగా ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ దేశంలోకి అమెరికన్ల రాకపై కఠిన ఆంక్షలు విధించింది. అట్టావా: ఉగ్రవాదం, యుద్ధం వల్ల స్వదేశాన్ని విడిచిపెడుతున్న శరణార్థులకు కెనడా ప్రధాని జస్టిస్ ట్రుడో స్వాగతం పలికారు. ‘వారి విశ్వాసాలతో నిమిత్తం లేకుండా కెనడాకు ఆహ్వానిస్తున్నాం. భిన్నత్వమే మన బలం' అని ట్వీట్ చేశారు.
ఆయన ఆదేశాలు పాటించం: న్యూయార్క్ మేయర్ బ్లాసియో
న్యూయార్క్: ట్రంప్ ఆదేశాలను గుడ్డిగా పాటించే ప్రసక్తేలేదని న్యూయార్క్ మేయర్ బిల్ డి బ్లాసియో ఇంతకుముందే తేల్చి చెప్పారు. ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలను న్యాయస్థానాల్లో సవాలు చేస్తామని, అక్కడే వాటి గురించి తేల్చుకుంటామని ఓ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ‘వలసదారులపై ఫెడరల్ ప్రభుత్వమే చర్యలు తీసుకునేలా నగరాలకు ఉన్న ప్రత్యేక హోదా, వాటి న్యాయ పరిధిని తొలగించాలని ట్రంప్ భావిస్తున్నారు. న్యూయార్క్ పోలీసులకు వచ్చే నిధుల్లో కోత పెట్టాలని భావిస్తున్నారు. అదేజరిగితే దీనిపై కోర్టులకు వెళ్తాం. మా ప్రాంత ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది' అని బ్లాసియో పేర్కొన్నారు.
పాకిస్తాన్పైనా నిషేధం?
అమెరికాలోకి వలసల నిషేధ దేశాల జాబితాలో పాకిస్తాన్ను కూడా చేర్చే అవకాశాలున్నాయని వైట్హౌస్ ఉన్నతాధికారి అదివారం సూచనప్రాయంగా చెప్పారు. జాబితాలో పేర్కొన్న ఏడు ముస్లిం ఆధిక్య దేశాలు ప్రమాదకర ఉగ్రవాదం సాగుతున్నవిగా అమెరికా కాంగ్రెస్తో పాటు ఒబామా యంత్రాంగం గుర్తించాయి' అని వైట్హౌస్ చీఫ్ ఆఫ్ స్టాప్ రెయిన్స్ ప్రీబస్ చెప్పారు. అదే తరహా పరిస్థితులు ఉన్న పాకిస్తాన్ వంటి దేశాల గురించి మీరు ప్రస్తావించొచ్చని చెప్పారు. ప్రస్తుతానికి ఆయా దేశాల నుంచి వచ్చి, వెళ్లేవారి వివరాలు క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని ప్రీబస్ చెప్పారు.