హైదరాబాద్లో భారీ పేలుళ్లకు ఉగ్ర కుట్ర: ఎన్ఐఏ సంచలనం
మహానగరంలో మరోసారి ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. ఈ విషయం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో తేలింది.
హైదరాబాద్: మహానగరంలో మరోసారి ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. ఈ విషయం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) విచారణలో తేలింది. తమిళనాడు మథురైలో పట్టుబడ్డ ది బేస్ మూమెంట్కు చెందిన ఉగ్రవాదులను విచారిస్తున్న సందర్భంగా హైదరాబాద్లో రక్తపాతం సృష్టించే విధంగా ప్రణాళికలు చేసినట్టు పలు సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వచ్చాయని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
భారత్లో భారీస్థాయిలో దాడులకు 2013లోనే అల్ఖైదా కుట్ర చేసింది. అల్ఖైదా నుంచి ప్రేరణ పొందిన 'ది బేస్ మూమెంట్'.. నిఘా వర్గాలకు చిక్కకుండా ఆన్లైన్, సోషల్ మీడియా వెబ్సైట్ల ద్వారా ఆన్లైన్ రాడికల్ రిక్రూటింగ్ ఏజెన్సీ అనే సంస్థ ద్వారా ప్రత్యేకంగా గ్రూపులు రూపొందించింది.
ఈ క్రమంలోనే తమిళనాడులోని మధురై టీసీఎస్లో పనిచేస్తున్న దావూద్ సులేమాన్ ఆమీర్గా పేరుమార్చుకొని అబ్బాస్ అలీ, సామ్సమ్ కరీంరజా, శంషూద్దీన్, మహ్మద్ అయుబ్లను గ్రూప్లో చేర్చుకున్నాడు. వీరిలో శంషూద్దీన్కు తమిళనాడులో మాడ్యుల్ అల్-ఉమ ఉగ్రవాద సంస్థతో సన్నిహిత సంబంధాలున్నాయి.
ఓ విధ్వంస కుట్రకు పథకం రూపొందించారన్న ఆరోపణలతో గతంలో శంషూద్దీన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత తమిళనాడు, బెంగళూరులో కరుడుగట్టిన నేరస్థుడు ఇమామ్ అలీ గ్యాంగ్లో చేరిన శంషూద్దీన్ బాంబుల తయారీలో నిష్ణాతుడయ్యాడు.
ఈ ఏడాది ఇప్పటివరకు ఐదు ప్రాంతాల్లోని కోర్టుల ప్రాంగణాల్లో ప్రాణనష్టం లేకుండా కేవలం హెచ్చరికల కోసం పేలుళ్లు జరిపినట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. తదుపరి పేలుళ్లకు హైదరాబాద్, కేరళలోని పాలక్కడ్ను లక్ష్యంగా ఎంచుకొన్నట్టు తాజా దర్యాప్తులో బహిర్గతమైంది. ఎన్ఐఏ, రాష్ట్ర కౌంటర్ ఇంటెలిజెన్స్ అప్రమత్తతో ఉగ్ర కుట్రను ముందు పసిగట్టి భగ్నం చేసినట్లయింది.