సుమన్కు రజనీకాంత్ సలహా: తెరాసలోకి..?
ప్రముఖ సినీ నటుడు సుమన్ రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. అయితే ఏ పార్టీలో చేరేది ఆయన చెప్పలేదు. తెరాసలో చేరుతారనే ప్రచారం సాగుతోంది..
హైదరాబాద్: ప్రముఖ సినీ నటుడు సుమన్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారు. అయితే, అది 2018 తర్వాతనే. ఇటీవలి కాలంలో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. దీంతో ఆయన తెరాసలో చేరుతారని ప్రచారం ముమ్మరంగా సాగుతోంది.
తెలుగు న్యూస్ చానెల్ టీవీ9కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తాను బ్లూ ఫిల్మ్ వివాదంలో చిక్కుకున్న విషయంపై కూడా మనసు విప్పి మాట్లాడారు.ఆ సంఘటనపైనే కాకుండా తన రాజకీయ ఆరంగేట్రంపై కూడా ఆయన మాట్లాడారు.
Also See : బ్లూఫిలిం కేసులో చిరంజీవి కుట్ర... హీరో సుమన్ క్లారిటీ ఇచ్చాడు.., అప్పటి రహస్యాలన్నీ...
ఏ పార్టీలో చేరుతారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. రాజకీయాల్లోకి రావడం ఖాయమని మాత్రం చెప్పారు. ఎప్పుడు వస్తారనే ప్రశ్నకు కూడా సమాధానం ఇచ్చారు. తాను రాజకీయాల విషయంలో తనకు ఏ విజన్ ఉందని చెప్పారు.
సుమన్ తెరాసలో చేరుతారా..
సుమన్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)లో చేరుతారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. టీవీ9 ప్రతినిధి తెరాసలో ఎప్పుడు చేరుతారని అడిగినప్పుడు ఏ పార్టీలో చేరాలనే విషయంపై నిర్ణయం తీసుకోలేదు. వివిధ పార్టీలు తనను అహ్వానించాయని చెప్పారు. అయితే, 2018 తర్వాతనే తాను రాజకీయాల్లోకి వస్తానని చెప్పారు. ఆ తర్వాతనే తన జాతకం బాగుందదని, అందువల్ల ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టబోనని చెప్పారు.
అక్కడి నుంచి పిలుపు రాలేదు..
తనకు తెరాస నుంచి పిలుపేమి రాలేదని సుమన్ చెప్పారు. తెలంగాణ పరిణామాలను తాను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో హైదరాబాద్ తప్ప మిగతా జిల్లాలన్నీ వెనకబడి ఉన్నాయని, అన్ని జిల్లాలు కూడా అభివృద్ధి చెందాలని ఆయన అన్నారు. అందుకే తెలంగాణ ఏర్పాటును తాను సమర్థించినట్లు తెలిపారు.
కెసిఆర్కు స్పష్టమైన విజన్ ఉంది..
తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి రాష్ట్ర విభజనను సమర్థిస్తూ తొలుత ప్రకటన చేసింది తానేనని ఆయన చెప్పుకున్నారు. కెసిఆర్కు ఓ విజన్ ఉందని, ఇతరులకు ఆ విజన్ లేదని ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ, ఇతర వెనకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని ఆయన అన్నారు.
ప్రశంసలను బట్టి కాదు...
తమిళనాడులో ఏం జరుగుతుందో కూడా తాను చూస్తుంటానని, తాను రాజకీయాల్లోకి వచ్చింది టిడిపితోనేనని ఆయన చెప్పారు. బిజెపికి తాను ప్రచారం కూడా చేశానని ఆయన చెప్పారు. ముస్లింలకు, దళితులకు, క్రైస్తవులకు కెసిఆర్ మద్దతుగా నిలిచారని, అన్ని వర్గాలు కెసిఆర్ పాలనలో సంతృప్తిగా ఉన్నాయని ఆయన అన్నారు. కెసిఆర్ను తాను ప్రశంసించడంలో స్వార్థం ఏమీ లేదని స్పష్టం చేశారు.
నేను నయీం నుంచి కొనలేదు..
తాను నయీం నుంచి భూమి కొనలేదని ఆయన స్పష్టం చేశారు. జాయింట్ ఫ్యామిలీ భూమిని కొన్నానని ఆయన చెప్పారు. ఆ భూమి వివాదం కొర్టులో ఉందని, కోర్టు ద్వారానే తాను న్యాయం పొందుతానని ఆయన చెప్పారు. ఆ భూమి వివాదం పరిష్కారం కోసం కెసిఆర్ను ప్రశంసిస్తున్నట్లు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని ఆయన అన్నారు. అలా అంటే తాను తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలోనే పరిష్కరించుకుని ఉండేవాడనని, కానీ అలా చేయడం తనకు ఇష్టం లేదని, కోర్టులోనే పరిష్కరించుకుంటానని సుమన్ చెప్పారు.
నోట్ల రద్దును యాభై శాతం అంగీకరిస్తా..
పెద్ద నోట్ల రద్దును తాను యాబై శాతం మాత్రమే అంగీకరిస్తానని నటుడు సుమన్ చెప్పారు. టెర్రరిజం, కరప్షన్ సమస్యలకు కొంత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. అయితే డూప్లికేట్ నోట్లను ఎలా రద్దు చేస్తారనే ప్రశ్న మిగిలే ఉందని అన్నారు. లోయర్, మిడిల్ క్లాస్ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఆయన చెప్పారు. సామాన్యులకు ఇబ్బంది కలుగుతుందని సలహాదారులు మోడీకి ఎందుకు చెప్పలేకపోయారని ఆయన అడిగారు.
బ్లాక్ షర్ట్ ఉంది, బ్లాక్ మనీ లేదు..
తనకు బ్లాక్ షర్ట్ ఉంది గానీ బ్లాక్ మనీ లేదని సుమన్ ఓ ప్రశ్నకు సమాధానంగా నవ్వతూ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు వల్ల సినీ పరిశ్రమలో చెల్లింపులకు ఇబ్బంది అవుతోందని అన్నారు. చిన్న నిర్మాతలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. సినీ నటులు నిర్మాతల నుంచి లెక్క చెప్పని డబ్బులు తీసుకోవడం మామూలేనని, అవకాశాలు దండిగా వచ్చినప్పుడు వచ్చే అవకాశాలను తాము వదులుకోవడం సరికాదని, అవకాశాలు లేనప్పుడు ఇబ్బంది పడకూడదని అలాంటి డబ్బులు తీసుకుంటామని ఆయన చెప్పారు.
సెకండ్ లేదా థర్డ్ ప్లేస్..
తనపై కేసు పెట్టడం వెనక కుట్ర దాగి ఉందని తాము అప్పట్లో అనుమానించామని, అయితే ఎవరు కుట్ర చేశారనేది తేలలేదని సుమన్ చెప్పారు. కుట్ర వెనక చిరంజీవి ఉన్నారనే ప్రచారాన్ని తాను విశ్వసించడం లేదని ఆయన అన్నారు. రెండు రోజుల క్రితం తాము కలుసుకున్నామని ఆయన చెప్పారు. తానంటే చిరంజీవికి చాలా ఇష్టమని చెప్పారు. అప్పుడు తామిద్దరం కూడా సినీ పరిశ్రమలో కఠిన శ్రమ చేశామని చెప్పారు. కేసులో ఇరుక్కుని ఉండకపోతే తెలుగు హీరోల్లో తాను సెకండ్ లేదా థర్డ్ పొజిషన్లో ఉండేవాడినని చెప్పారు. తాను ఎవరినీ మోసం చేయలేదని చెప్పారు. తన మిత్రుడు తమనంతా కేసులో ఇరికించాడని ఆయన చెప్పారు.
అప్పట్లో రజినీ నాకు చెప్పారు..
సరైన అవకాశాలు రాకపోవడం వల్లనే తాను విలన్ పాత్రలు వేస్తున్నట్లు వేసిన ప్రశ్నలో నిజం లేదని సుమన్ అన్నారు. రజినీ కాంత్ శివాజీ సినిమాలో విలన్ పాత్ర వేశానని ఆయన చెప్పారు. బ్రేక్ కావాలనే ఉద్దేశంతో తాను ఆ పాత్ర వేశానని చెప్పారు. అప్పటికే తాను క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నట్లు తెలిపారు. శివాజీలో విలన్ పాత్ర వేయాలని ఆఫర్ గురించి రజినీకాంత్ను అడిగానని, ఆ పాత్ర చేయాలని రజినీ చెప్పారని, తమిళంలో మంచి రీఎంట్రీ ఉంటుందని అన్నారని ఆయన వివరించారు. శివాజీలో తనకు ఇచ్చినంత పవర్ ఫుల్ క్యారెక్టర్ మరెవరూ ఇవ్వలేదని చెప్పారు.
నా జీవితంలో అది మిరాకిల్
అన్నమయ్య సినిమాలో వేంకటేశ్వర స్వామి పాత్ర వేసే అవకాశం రావడాన్ని సుమన్ ఓ బహుమతిగా చెప్పుకున్నారు. తన జీవితంలో అదో మిరాకిల్ అని అన్నారు. తనకు ముఖ్యమంత్రి పదవి వద్దని ఆయన అన్నారు. క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సినిమాలు చేస్తానని చెప్పారు. ఏదైనా బాధ్యత అప్పగిస్తే మాత్రం మానేస్తానని అన్నారు.