33 ఏళ్ళలో 71 బదిలీలు: నిజాయితీ గల ఐఎఎస్ ప్రదీప్కు అవమానాలు
న్యూఢిల్లీ: నిజాయితీగా పనిచేసినందుకు ఓ ఐఎఎస్ అధికారికి అవమానమే మిగిలింది. తన 33 ఏళ్ళ సర్వీసులో 71 సార్లు బదిలీ అయ్యారు. నిజాయితీగా పనిచేసినందు వల్లే ఆ ఐఎఎస్ అదికారికి బదిలీలు చోటు చేసుకొన్నాయి. బుధవారం నాడు హర్యానా రాష్ట్రానికి చెందిన ఐఎఎస్ అధికారి ప్రదీప్ కాస్ని ఉద్యోగ విరమణ చేశారు.
ఏడాదికి రెండు దఫాలు ప్రదీప్ కాస్ని తన సర్వీసులో బదిలీకి గురయ్యారు. చివరికి ఆర్నెళ్ల జీతం అందకుండానే పదవీ విరమణ పొందాల్సి వచ్చింది. 34ఏళ్ల సర్వీసులో 71సార్లు బదిలీ అయ్యారు. హర్యానా భూ ఉపయోగ బోర్డులో(ల్యాండ్ యూస్ బోర్డ్) ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా విధుల్లో చేరారు.
అయితే ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆయన పనిచేస్తున్న బోర్డే రికార్డుల్లో లేదు. దీంతో ఆయనకు గత కొన్ని నెలలుగా జీతం అందడం లేదు. ఈ విషయం కూడా ఆయనకు సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన పిటిషన్ ద్వారా తెలిసింది. దీనిపై ప్రదీప్ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునలో ఫిర్యాదు చేయగా అది మార్చి 8న ఈ కేసుపై నిర్ణయం తీసుకోనుంది. అయితే అప్పటికే ఆయన రిటైర్ కావాల్సి వచ్చింది.
ల్యాండ్ యూస్ బోర్డులో ప్రదీప్ను నియమించారు. అయితే కార్యాలయంలో ఉద్యోగులు లేకపోవడం, అధికారిక పత్రాలు కనిపించకపోవడంపై ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎలాంటి సమాధానం లేకపోవడంతో ఆర్టీఐ చట్టం ద్వారా పిటిషన్ వేశారు. దీంతో ఆ ల్యాండ్ యూస్ బోర్డు 2008 నుంచి మనుగడలో లేదని సమాధానం వచ్చింది. ఈ బోర్డును పర్యావరణ విభాగం కింద తొలుత ప్రవేశపెట్టారు. తర్వాత వ్యవసాయ విభాగానికి బదిలీ చేసి అనంతరం బోర్డును మూసేశారు. అయితే హరియాణా ప్రభుత్వం అసలు ఉపయోగంలోనే లేని బోర్డుకు ప్రదీప్ను ప్రత్యేక ఆఫీసర్గా బదిలీ చేసింది.
దీంతో 1984 బ్యాచ్ హరియాణా సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అయిన ప్రదీప్ తన హక్కుల కోసం న్యాయ పోరాటం చేస్తున్నారు. రిటైర్ అయినప్పటికీ తన పదవీ కాలం కొనసాగించాలని అడుగుతున్నారు. ప్రదీప్ భార్య కూడా ఐఏఎస్ అధికారిణి. ఆమె గత ఏడాది రిటైర్ అయ్యారు. ప్రదీప్ అత్యధికంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో భూపీందర్ సింగ్ హయాంలో బదిలీ అయ్యారు. ఖట్టార్ హయాంలో 2016లో మూడు సార్లు బదిలీ అయ్యారు.