బిజెపితో బాబు కటీఫ్: సాక్షి, ఆంధ్రజ్యోతి వేర్వేరు
హైదరాబాద్: తెలుగుదేశం, బిజెపి మధ్య సీమాంధ్ర తెగదెంపులు జరగడానికి అసలు కారణం ఏమిటనే విషయంపై మీడియాలో భిన్నమైన కథనాలు వస్తున్నాయి. ఎవరికి అనుకూలంగా వారు వాదనలను ముందుకు తెస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనానికి, వైయస్సార్ కాగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్కు చెందిన సాక్షి డైలీ కథనానికి మధ్య తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆంధ్రజ్యోతి కథనం తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కనిపిస్తుంటే, సాక్షి డైలీ కథనం వ్యతిరేకంగా కనిపిస్తోంది.
రాజకీయ అనుబంధతలకు అనుగుణంగా మీడియాలో వార్తాకథనాలు వస్తున్నాయనే విషయం మరోసారి బయటపడింది. పొత్తులపై బాబు జిత్తులు, మండిపడుతున్న బిజెపి రాష్ట్ర నేతలు అంటూ సాక్షి డైలీ వార్తాకథనం ప్రచురిస్తే, ఒంటరి పోరే అని పతాక శీర్షిక పెట్టి కమలం ఏకపక్ష వైఖరే ఈ పరిస్థితికి కారణమని ఆంధ్రజ్యోతి వ్యాఖ్యానిస్తూ వార్తాకథనాన్ని ప్రచురించింది. డబుల్ గేమ్ అంటూ బిజెపి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్తో కుమ్మక్కయిందంటూ వార్తాకథాన్ని కూడా ఆంధ్రజ్యోతి ప్రచురించింది.
జగన్తో నరేంద్ర మోడీ సన్నిహితుడు ఆదానీ బేటీ జరిగిందని, ఆ రకంగా జగన్తో మోడీ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని, అందువల్లనే సీమాంధ్రలో బిజెపి తనకు కేటాయించిన స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను దించిందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఆంధ్రజ్యోతి వార్తాకథనం వ్యాఖ్యానించింది.
పొత్తును సాకుగా తీసుకుని చంద్రబాబు బిజెపిపై కర్రపెత్తనం చేస్తున్నారని, పారిశ్రామికవేత్తల ఒత్తిళ్లకు లొంగి బిజెపిని నిర్దేశించాలని చూస్తున్నారని బిజెపి మండిపడుతున్నట్లు సాక్షి వ్యాఖ్యానించింది. బిజెపి తనకు కేటాయించిన స్థానాల్లో బలహీనమైన అభ్యర్థులను పోటీకి దించిందని, తనకు భయమేస్తోందని, అది ప్రత్యర్థులకు ఉపయోగపడుతుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి విజయనగరం జిల్లా గజపతినగరంలో అన్నారు.
బిజెపిని చిత్తు చేయడానికి చంద్రబాబు వ్యూహం పన్నారనే అనుమానాలు మరో వైపు వ్యక్తమవుతున్నాయి. విశాఖపట్నం సీటు దగ్గుబాటి పురంధేశ్వరికి కేటాయించడానికి బిజెపి ముందుకు వచ్చినప్పుడు అభ్యంతరం చెప్పింది తెలుగుదేశం పార్టీ నాయకులే. పురంధేశ్వరికి టికెట్ ఇవ్వకూడదనే వాదనను ముందుకు తచ్చింది ఆ పార్టీయే. విశాఖలో బలహీనమైన అభ్యర్థిని బరిలోకి దింపారని వాదిస్తోంది కూడా బిజెపియే.
బిజెపి అభ్యర్థులను కూడా తానే ఖరారు చేయాలనే పద్ధతిలో చంద్రబాబు వ్యవహరించారనే అనుమానాలు కూడా ఉన్నాయి. అలాగే, విజయవాడ సీటు విషయంలో కూడా చర్చలు జరిపినట్లు జరుపుతూనే తన పార్టీ నేత కేశినేని నానికి బీ ఫారం ఇచ్చేశారు. మరోవైపు, బిజెపికి కేటాయించిన అసెంబ్లీ స్థానాల్లో కూడా టిడిపి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తూ వచ్చారు.
నర్సాపురం సీటు విషయం కూడా. తమకు కేటాయించిన సీటు ఎవరికి ఇవ్వాలనేది బిజెపి నాయకత్వం ఇష్టమై ఉంటుంది. బిజెపి రంగారాజుకు నర్సాపురం సీటు కేటాయిస్తే చంద్రబాబు అభ్యంతరం చెప్పారు. రఘురామ కృష్ణంరాజుతో మంతనాలు జరిపి ఆయనతో నామినేషన్ దాఖలు చేయించారు. బిజెపికి కేటాయించిన ఇచ్చాపురం, మదనపల్లి తదితర అసెంబ్లీ స్థానాల విషయంలో కూడా వివాదం సృష్టించారు. తమకు కేటాయించిన సీట్లలో తమకు నచ్చినవారిని పోటీకి దించుకునే బిజెపి స్వేచ్ఛను హరించడానికి ఆయన ప్రయత్నించారు.
పురంధేశ్వరికి విశాఖపట్నం సీటు కేటాయిస్తే వ్యతిరేకించిన తెలుగుదేశం పార్టీ అందుకు బిజెపి తలొగ్గితే బలహీనమైన అభ్యర్థిని దించిందని గొడవ చేసింది. ఆమెకు రాజంపేట సీటు కేటాయిస్తే బలహీనమైన అభ్యర్థి అంటూ గొడవ చేసింది. పురంధేశ్వరికి సీటు కేటాయించాల్సిన అనివార్యత బిజెపి నాయకత్వానికి ఉందనే విషయాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలోనూ చంద్రబాబు దారుణంగా వ్యవహరించారు. ఒక్క సీటు అడిగితే ఇవ్వడానికి నిరాకరించారు. పైగా, పవన్ కళ్యాణ్ తమ పార్టీకి ప్రచారం చేయాలని కోరుకుంటున్నారు. విజయవాడ సీటు కావాలని పవన్ కళ్యాణ్ ఎంతగా పట్టుబట్టినా ఆయన వినలేదు. మరో సీటు కేటాయించడానికి కూడా ఇష్టపడలేదు. ఇతర పార్టీలను శాసించాలనే చంద్రబాబు వ్యవహారం పొత్తులు బెడిసి కొట్టే స్థితికి వచ్చింది.