చంద్రబాబు సామర్థ్యం: 2019లో ఏపీలో నేషనల్ గేమ్స్
న్యూఢిల్లీ: 2019 జాతీయ క్రీడలకు (నేషనల్ గేమ్స్) నవ్యాంధ్ర ఆతిథ్యమిచ్చే అవకాశముంది. అధికారికంగా ఇంకా ప్రకటన రాకపోయినప్పటికీ.. జాతీయ క్రీడలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐవోఎస్) జనరల్ బాడీ బుధవారం గౌహతిలో భేటీ అయింది.
ఈ భేటీలో 37వ జాతీయ క్రీడల నిర్వహణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చేందుకు అంగీకరించారు. తద్వారా తెలుగు రాష్ట్రానికి మరోమారు జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చే అవకాశం దక్కుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో 2002లో నిర్వహించిన జాతీయ క్రీడలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
2019లో నిర్వహించనున్న 37వ జాతీయ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు ఆంధ్రప్రదేశ్ దాఖలు చేసిన బిడ్కు భారత ఒలింపిక్స్ సంఘం(ఐఓఏ) ఆమోదముద్ర వేసింది. ఏపీకి ఈ క్రీడల ఆతిథ్య హక్కులు రావడం దాదాపుగా లాంఛనమే.
గౌహతిలో నిర్వహించిన ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో జాతీయ క్రీడల నిర్వహణ బిడ్ను ఏపీ సమర్పించింది. ఆంధ్రప్రదేశ్ క్రీడాప్రాధికార సంస్థ(శాప్) ఛైర్మన్ పీఆర్ మోహన్, ఎండీ రేఖ రాణి, ఏపీఓఏ కార్యదర్శి పురుషోత్తం, ఉపాధ్యక్షులు వెంకట్రామయ్య, పున్నయ్య చౌదరిలు ఆంధ్రప్రదేశ్ బిడ్ను, రూ.50 లక్షల చెక్కును ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్ సమక్షంలో కార్యదర్శి రాజీవ్ మెహతాకు అందజేశారు.
ఈ బిడ్కు ఐఓఏ ఏజీఎంలో సానుకూల స్పందన వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో జాతీయ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన నేపథ్యంలో ఐఓఏతో పాటు రాష్ట్రాల ఒలింపిక్ సంఘాల ప్రతినిధులు కరతాళ ధ్వనులతో ఆంధ్రప్రదేశ్ను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ బిడ్కు ఆమోదం తెలుపుతున్నట్లు సమావేశంలో ఐఓఏ తెలిపింది. కాగా రాష్ట్రానికి ఇంత గొప్ప అవకాశం లభించడంపై ఏపీ శాప్ ఛైర్మన్ పిఆర్ మోహన్ హర్షం వ్యక్తం చేశారు. 2003లో చంద్రబాబు నాయకత్వంలో ఆఫ్రో ఏషియాన్ గేమ్స్ విజయవంతంగా నిర్వహించామని బుధవారం ఆయన చెప్పారు.
2002లో జాతీయ క్రీడలు హైదరాబాదులో జరిగాయి. 2003లో ఆఫ్రో - ఏషియన్ గేమ్స్ నిర్వహించారు. ఈ రెండు సమైక్య ఆంధ్రప్రదేశ్లో జరిగాయి. అప్పుడు చంద్రబాబు సీఎంగా ఉన్నారు. వాటిని సమర్థవంతంగా నిర్వహించారని పేరు తెచ్చుకున్నారు. ఈ కారణంగానే మరోసారి నవ్యాంధ్రకు అవకాశమిచ్చారు.