జెడ్పీ పీఠాలపై నిన్నటి టైలర్, రైల్వే కూలీ
జెడ్పీ, ఎంపీపీల్లో తెలంగాణలో తెరాస, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ జోరు కనిపించిన విషయం తెలిసిందే. గతంలో వివిధ రకాల పనులు చేసిన వారు ఇప్పుడు జెడ్పీ పీఠంపై కూర్చున్నారు. టైలర్ పని చేసిన చమన్ అనంతపురం జెడ్పీ పీఠంపై కూర్చోగా.. హమాలీగా పని చేసిన బి భాస్కర్ మహబూబ్ నగర్ జెడ్పీ పీఠంపై కూర్చున్నాడు.
మాజీ మంత్రి, టీడీపీ దివంగత నేత పరిటాల రవి చిన్ననాటి స్నేహితుడైన చమన్ తొలుత టైలర్గా పని చేసేవారు. అనంతరం గీత కార్మికుడిగా పని చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘంలో చురుకైన పాత్ర పోషించారు.
ఆ సమయంలోనే పీపుల్స్వార్ సానుభూతిపరుడిగా ముద్రపడ్డారు. పరిటాల టీడీపీలో చేరిన తర్వాత చమన్ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎలాంటి పదవులు వరించకపోయినా టీడీపీతో అనుబంధాన్ని కొనసాగిస్తూ వచ్చారు. ఆయన సేవలను గుర్తించిన అధిష్ఠానం ఆయనకు జడ్పీ చైర్మన్గా అవకాశాన్ని కల్పించింది.
మరోవైపు, సాధారణ హమాలీ అయిన భాస్కర్ ఇప్పుడు జెడ్పీ పీఠంపై కూర్చున్నాడు. మహబూబ్నగర్ జిల్లా గద్వాల మండలం కాకులారం నుంచి కేబినెట్ హోదాకు ఎదిగిన ఆ హమాలీ పేరు బండారి భాస్కర్. కాకులారానికి చెందిన నారాయణ, దేవమ్మల 9 మంది సంతానంలో భాస్కర్ పెద్దవాడు. కర్నూలులో రైల్వే హమాలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు.
10వ తరగతి వరకు చదివిన భాస్కర్ 2001లో టీడీపీలో చేరి కాకులారం పంచాయతీ సర్పంచిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. కాకులారం తొలి సర్పంచిగా భాస్కర్ తండ్రి నారాయణ పని చేశారు. విభజన ఉద్యమం నేపథ్యంలో భాస్కర్ టీడీపీని వీడి తెరాసలో చేరారు.
ఈ ఏడాది గద్వాల జడ్పీటీసీ స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేశారు. దీంతో భాస్కర్కు జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం లభించింది. మహబూబ్నగర్ జడ్పీ చైర్మన్ స్థానం సైతం ఎస్సీ జనరల్కు రిజర్వ్ అయింది. దీంతో భాస్కర్ను అది వరించింది. కాగా, జిల్లా రాజకీయాల్లో పట్టు సాధించేందుకు సన్నిహితుడు అయిన తెరాస ముఖ్య నేత కృష్ణమోహన్ రెడ్డి భాస్కర్ను జడ్పీ చైర్మన్ అభ్యర్థిగా తెరపైకి తెచ్చారని అంటున్నారు. కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ నేత డీకే అరుణ పైన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.