'స్థానికత'పై ఏపీ ట్విస్ట్, తెలంగాణ ఏం చేస్తుంది?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన విద్యార్థుల ఫీజు చెల్లింపుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు లోబడి, 371(డి) అధికరణ మేరకు ఆంధ్రప్రదేశ్ స్థానికత ఉన్న విద్యార్థులు తెలంగాణలో చదువుతున్నప్పటికీ బోధన ఫీజులు తాము చెల్లిస్తామని ప్రకటించింది. సీమాంధ్రలో వరుసగా ఏడేళ్లు చదివిన వారిని స్థానికులుగా గుర్తిస్తామని స్పష్టం చేసింది.
2014-15 విద్యాసంవత్సరానికి ఫీజుల చెల్లింపు విధానాన్ని ఖరారు చేస్తూ సాంఘిక సంక్షేమశాఖ శనివారం జీవో నం.72 జారీ చేసింది. లోకల్ కేటగిరీపై స్పష్టత ఇస్తూనే ఏడేళ్లనాటి స్టడీ సర్టిఫికెట్ను సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇక ప్రభుత్వం నుంచి బోధన ఫీజు పొందాలనుకునే వారందరికీ ఆధార్ తప్పనిసరి చేసింది. విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల ఆధార్ సంఖ్యనూ తప్పనిసరిగా దరఖాస్తులో పేర్కొనాలని పేర్కొంది.
పాన్కార్డు నంబర్ను తప్పనిసరి చేయలేదు. ఫీజుల కోసం కొత్తగా దరఖాస్తు చేసుకునేవారితోపాటు ఇప్పటికే ఈ పథకం కింద ఫీజులు, ఉపకారవేతనాలు పొందుతున్న విద్యార్థులకూ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు 2010, 2012లో వివిధ నిబంధనలతో స్కాలర్షిప్ విధానాలు విడుదలయ్యాయి.
ఇదిలా ఉండగా... ఆంధ్రప్రదేశ్కు లోకల్ కావాలంటే కనీసం వరుసగా ఏడు సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలో చదివి ఉండాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఏడేళ్ల కాలవ్యవధిలో వరుసగా నాలుగేళ్లపాటు ఏ ప్రాంతంలో విద్యాభ్యాసం చేస్తే ఆ ప్రాంతాన్నే లోకల్గా పరిగణించాల్సి ఉంటుంది. అయితే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన స్కాలర్షిప్ విధానంలో నాలుగేళ్ల ప్రస్తావన తీసుకురాలేదు. వరుసగా ఏడేళ్ల స్టడీ సర్టిఫికెట్ సమర్పించాలని పేర్కొనడం గమనార్హం.
కాగా, రాష్ట్ర విభజన అనంతరం తాము తెలంగాణ విద్యార్థులకు మాత్రమే ఫీజులు చెల్లిస్తామని, ఇందుకు 1956ను ప్రామాణికంగా తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సహాయం (ఫాస్ట్) పథకంపై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేస్తుందేమోనని ఏపీ ప్రభుత్వం కొంతకాలంగా ఎదురు చూస్తోంది. అయితే, ఈ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా నిలిపి ఉంచింది.
వృత్తి విద్యాకాలేజీల్లో సీట్లు పొందిన బడుగు వర్గాల విద్యార్థుల ఫీజులు, ఉపకారవేతనాల కోసం ఒత్తిడి పెరగడంతో ఏపీ ప్రభుత్వం ఎట్టకేలకు శనివారం స్కాలర్షిప్ పాలసీని విడుదల చేసింది. స్థానికతపై ఏడేళ్లు వరుసగా సీమాంధ్రలో చదివి ఉండాలనే నిబంధన విధించింది. ఇప్పుడు స్థానికతపై తెలంగాణ సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది. 1956 నిబంధన తీవ్ర వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే.
దీనిని హైకోర్టు కూడా తప్పుపట్టింది. అయినప్పటికీ ఫాస్ట్పై వెనక్కి తగ్గకూడదని, న్యాయస్థానంలో బలమైన వాదనలు వినిపించాలని తెలంగాణ సర్కారు భావిస్తోంది. ఒకవేళ హైకోర్టులో ఫాస్ట్కు చుక్కెదురైతే తెలంగాణ సర్కారు కూడా ఏపీలాగా స్థానికతకు ఏడేళ్ల నిబంధన అమలు చేస్తుందా? మరేదైనా విధానాన్ని అనుసరిస్తుందా? ఫాస్ట్ మార్గదర్శకాలు వెలువడితేకానీ దీనిపై స్పష్టత రాదు.