పవన్ వైఖరితో సర్వత్రా దిగ్భ్రాంతి: సందు దొరికితే అంతే సంగతి..
అమరావతి: ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఆమరణదీక్షకైనా సిద్దమని ప్రకటించిన పవన్ కల్యాణ్.. నాలుగు రోజులు గడవకముందే మాట మార్చడం అన్ని వర్గాలను దిగ్బ్రాంతికి గురిచేసింది. పవన్ నిలకడగా ఒక స్టాండ్ పై నిలబడడు అనడానికి ఇదిగో మరో సాక్ష్యం అంటూ ప్రత్యర్థులు కూడా దాడికి సిద్దమైపోయారు. జనసేనతో జతకట్టడానికి ఉవ్విళ్లూరుతున్న వామపక్షాలు కూడా.. ఆమయన స్టేట్ మెంట్ చూసి తలపట్టుకున్నాయి. అయితే జనసేన మాత్రం పవన్ ఆ స్టేట్ మెంట్స్ ఇవ్వలేదని చెబుతోంది.
బాబు రెబలా?.. అవకాశవాదా?: మళ్లీ ఏకేసిన పవన్, లోకేష్ అవినీతిపై ఆధారాలున్నాయ్!
కాచుకు కూర్చున్నారు..:
టీడీపీపై నేరుగా విమర్శలను ఎక్కుపెట్టిన నాటి నుంచి పవన్ కల్యాణ్ వీక్నెస్పై దెబ్బకొట్టడానికి ప్రత్యర్థులు కాచుకు కూర్చున్నారు. ఏ చిన్న అవకాశం దొరికినా.. తమ అనుకూల మీడియాతో ఆయన్ను మరింత ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదాపై పవన్ మాట మార్చారన్న ప్రచారం వారికి ఆయుధంగా మారింది. పవన్ ఇమేజ్ దెబ్బ తీయడానికి ఒక్క రోజులోనే దీన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లారు.
వివరణ ఇచ్చినా..:
జనసేన మాత్రం పవన్ హోదాపై మాట మార్చలేదని క్లారిటీ ఇచ్చింది. ఆర్థిక సమస్యలను తీర్చడం ముఖ్యం కానీ ప్యాకేజీనా? హోదానా? అన్నది సంబంధం లేదని పవన్ ఎక్కడా వ్యాఖ్యానించలేదని చెబుతోంది.
అయితే జనసేన వివరణ కాస్త ఆలస్యమయ్యేసరికి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయిందనే అంటున్నారు. అసలే 'అవిశ్వాసం'తో పవన్ చిచ్చు పెట్టాడన్న ఆగ్రహంతో ఉన్న టీడీపీకి.. ఆయన్ను టార్గెట్ చేయడానికి ఇదో అస్త్రంగా మారింది. దీంతో పవన్ కల్యాణ్ రాజకీయ వైఖరి పూటకోసారి మారిపోయే రకం అంటూ వారు విమర్శలకు దిగుతున్నారు.
దిగ్భ్రాంతి చెందిన వామపక్షాలు:
హోదాపై పవన్ మాట మార్చారన్న ప్రచారం అటు వామపక్షాలకు కూడా గట్టి షాక్ ఇచ్చింది. దీనిపై స్పందించిన సీపీఎం మధు కూడా పవన్ ను గట్టిగా వెనుకేసుకురాలేకపోయారు. మాతో మాత్రం హోదా డిమాండ్ కు కట్టుబడి ఉంటాననే చెప్పాడే.. మరి జాతీయ మీడియాతో ఎందుకలా చెప్పాడో? అంటూ వాపోయారు. పవన్ ఇచ్చిన షాక్ తో వామపక్షాలు కూడా ఆయన వైఖరిపై మరోసారి ఆలోచించుకునే పరిస్థితి ఏర్పడింది అంటున్నారు.
జనసేనను విలన్ని చేసేవారేమో!:
ఇప్పటికైనా జనసేన నుంచి వివరణ వచ్చింది కాబట్టి సరిపోయింది కానీ.. లేదంటే టీడీపీ ఆరోపిస్తున్నట్టు మోడీ వ్యూహంలో పవన్ కల్యాణ్ భాగమని మరింత గట్టిగా ప్రచారం చేసేవారు.
కేంద్రం హోదాకు వ్యతిరేకంగా ఉన్నవేళ.. పవన్ వారికి పరోక్షంగా లాభం చేకూర్చేలా వ్యాఖ్యలు చేశారని ఆరోపించేవారు. హోదాతో సంబంధం లేకుండా ఆర్థిక సమస్యలు తీర్చడమే ముఖ్యమనుకుంటే.. గతంలో ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలతో ఎందుకు పోల్చినట్టు అని నిలదీసేవారు. మొత్తంగా జనసేనను విలన్ని చేయడానికి జరగాల్సిన ప్రయత్నాల్ని జరిగేవి.
ఇకనైనా జాగ్రత్త పడాల్సిందే..:
పవన్ అంతకుముందు ఏం చేసినా అంత సాదాసీదాగానే నడిచిపోయింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ లపై నేరుగా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి.. పవన్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది. ఎక్కడ ఏ చిన్న తప్పు దొరికినా.. తప్పుడు ఆరోపణలు చేసినా పవన్ పరువు తీయడానికి ప్రత్యర్థులు కాచుకు కూర్చున్నారు. కాబట్టి పవన్ కల్యాణ్ మరింత అప్రమత్తంగా ఉండాలని జనసేన శ్రేణులు కూడా భావిస్తున్నాయట.