ఏపీ ఇబ్బంది: క్యాంప్ ఆఫీస్ల కోసం బాబు భారీ ఖర్చు
హైదరాబాద్/విజయవాడ: ఓ వైపు కొత్త రాష్ట్రమైన ఏపీ ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అవసరాల నిమిత్తం క్యాంప్ కార్యాలయాలకు కోట్లు ఖర్చవుతున్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.
గత రెండేళ్లలో ఏపీ ప్రభుత్వం ఐదు క్యాంప్ కార్యాలయాలు, మరో రెండు రెగ్యులర్ కార్యాలయాలను చంద్రబాబు కోసం ఏర్పాటు చేసింది. వీటి ఖర్చు తడిసిమోపెడు అవుతున్నాయి. సీఎంవో లెక్కల ప్రకారం క్యాంప్ ఆఫీసులను మార్చేందుకు అయిన ఖర్చు రూ.80 కోట్లు దాటేసిందట.
పెట్టిన ఖర్చులో అత్యధికం, సెక్యూరిటీ సిబ్బందికి వసతులు, భవంతులకు మార్పు చేర్పుల కోసమే వెచ్చించడంతో చాలా వరకూ ప్రజాధనం వృథా అయినట్లేనని అంటున్నారు. తాజాగా వెలగపూడిలోని తాత్కాలిక ప్రభుత్వ కాంప్లెక్స్లో సైతం చంద్రబాబు కోసం ఓ కార్యాలయం సిద్ధమవుతోంది.
ఇది సిద్ధమయ్యాక ప్రస్తుతం ఉన్న విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి చంద్రబాబు కార్యాలయం వెలగపూడికి మారుతుంది. వచ్చే రెండు మూడేళ్లలో సెక్రటేరియట్ నిర్మాణమంతా పూర్తయితే, అప్పటికి చంద్రబాబు తొమ్మిది క్యాంపు కార్యాలయాలు మారినట్లవుతుందని అంటున్నారు.
ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో ఏపీ సీఎం చంద్రబాబు నివసించే శేరిలింగంపల్లిలోని మదీనాగూడలో ఉన్న ఇంటికి రెసిడెన్స్ క్యాంప్ ఆఫీస్ హోదాను ఇస్తూ ప్రభుత్వం జీవో 114ను జారీ చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో గత రెండేళ్లలో మూడో ఇంటికి ఈ హోదా లభించింది.
తొలుత జూబ్లీహిల్స్లోని సొంత గృహంలో చంద్రబాబు ఉండేవారు. పునర్నిర్మాణం చేయాలనే సంకల్పంతో ఈ ఇంటికి తొలుత రెసిడెన్స్ క్యాంప్ ఆఫీస్ హోదా ఇచ్చారు. ఆ తర్వాత జూబ్లీహిల్స్లో మారిన ఇంటికి కూడా ఇదే హోదా ఇచ్చారు. తాజాగా ఈ ఇంటి నుంచి మదీనాగూడలోని ఫాంహౌస్లో ఉన్న ఇంటికి మారారు.
ఈ ఇంటికి రెసిడెన్స్ హోదా ఇచ్చారు. హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా చంద్రబాబు ఇకపై ఈ ఇంట్లోనే బస చేస్తారు. మదీనాగూడలోని ఇంటికి రెండు కోట్ల నిధులు ప్రభుత్వం ఖర్చుపెట్టింది. ఏప్రిల్ 1వ తేదీన 1.36కోట్ల రూపాయలు, ఏప్రిల్ 6వ తేదీన రూ. 57 లక్షలు ఈ ఇంటి ఆధునీకరణ, మరమ్మతులు, భద్రత దృష్ట్యా విడుదల చేశారు.
గతంలో జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 24, 65లో ఉన్న ఇళ్లకు కూడా రెండు కోట్ల రూపాయల చొప్పున విడుదల చేసి మరమ్మతులు చేశారు. రాష్ట్ర విభజన జరిగిన సమయంలో చంద్రబాబుకు రాజ్ భవన్కు పక్కనే ఉన్న లేక్వ్యూ విశ్రాంతి భవనం కేటాయించారు.
దీనికి రూ.45 లక్షలతో మరమ్మతులు చేశారు. ఇప్పుడా భవనంలో ఎవరూ లేరు. కొంతకాలం లేక్ వ్యూ విశ్రాంతి భవనం సీఎంవో కార్యాలయంగా ఉంది. ఇక్కడ సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి కార్యాలయం కోసం హెచ్, ఎల్ బ్లాక్లో కొన్ని భవనాలను 21 కోట్ల రూపాయలతో ఆధునీకరించారు.
ఈ మధ్య కాలంలో వాటిని ఉపయోగించడం లేదు. ఆ తర్వాత విజయవాడలో సిఎంఓ ఆఫీసును, ఉండవల్లి వద్ద సిఎం నివాస గృహం మరమ్మతులు, ఆధునీకరణ, భద్రత పటిష్టతకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించింది. త్వరలో వెలగపూడి వద్ద నిర్మించనున్న సచివాలయం కాంప్లెక్స్లోనే సిఎం నివాస గృహం రానుంది.