తమిళ రాజకీయాల్లో ట్వీస్ట్: శశికళ ఔట్, వారిద్దరు ఒక్కటి
తమిళనాట రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ స్థానం ఉప ఎన్నిక అధికార అన్నాడీఎంకేను పూర్తిగా అప్రతిష్టపాలు చేసింది.
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారుతున్నాయి. మాజీ సీఎం జయలలిత ప్రాతినిధ్యం వహించిన ఆర్కేనగర్ స్థానం ఉప ఎన్నిక అధికార అన్నాడీఎంకేను పూర్తిగా అప్రతిష్టపాలు చేసింది. ఎన్నికల్లో ఓటర్లకు డబ్బు పంచినట్లు సాక్షాత్ వైద్యశాఖా మంత్రి విజయభాస్కరే సాక్ష్యాధారాలతో ఆదాయం పన్ను శాఖ (ఐటీ) అధికారులకు పట్టుబడడం ప్రభుత్వాన్నీ ఇరుకున పడేయగా, ఐటీ అధికారులను బెదిరించినట్లుగా ముగ్గురు మంత్రులపై పోలీసులు కేసు నమోదు చేయడం రాష్ట్రంలోని విచిత్ర పరిస్థితికి దారి తీస్తున్నది.
ఇక ఆర్కే నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్న దినకరన్.. భవిష్యత్ లో సీఎం కావాలని కలలు కంటున్న నేపథ్యంలో సీఎం ఎడపాడి పళనిస్వామి, ఇతర మంత్రులు ఎదురు తిరిగినట్లు కనిపిస్తున్నది. దీనికి తోడు అన్నాడీఎంకే పార్టీ ఎన్నికల చిహ్నం 'రెండాకుల' కోసం దినకరన్ ఏకంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మధ్యవర్తి ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి రూ.50 కోట్ల మేరకు లంచం ఇవ్వజూపడం రాజకీయాల్లో నైతిక ప్రమాణాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతున్నది.
ఈ క్రమంలో కొందరు మంత్రులు.. సీఎంకు వ్యతిరేకంగా వ్యవహరించడం.. ఈసీకి లంచం ఇచ్చే ప్రయత్నం చేసినందుకు దినకరన్ అరెస్టుకు రంగం సిద్ధమవుతున్న తరుణంలో తమిళనాడు ఇన్ చార్జి గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు ముంబై నుంచి యధాలాపంగా చెన్నైకి చేరుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు చోటు చేసుకోనున్నాయా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
గవర్నర్ రాకతో అన్నాడీఎంకేలో ఆందోళన
రాష్ట్రంలో పాలన కుంటువడి గందరగోళ పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇన్చార్జ్ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్రావు సోమవారం ఉదయం ముంబయి నుంచి ప్రత్యేక విమానంలో అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. ఐటీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో ముగ్గురు మంత్రులు పోలీసు కేసులను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి తరుణంలో గవర్నర్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారోనని అధికార పార్టీ, ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. విజయభాస్కర్కు ఉద్వాసన తప్పదని కొందరు, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారని మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. అయితే గవర్నర్ అత్యవసర రాక ఏదో ఒక సంచలనానికి దారి తీయడం ఖాయమని అంటున్నారు. రెండు రోజుల క్రితమే డీఎంకే ప్రతినిధి బ్రుందం.. ముంబైకి వెళ్లి అవినీతిలో కూరుకున్న అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాలని వినతిపత్రం సమర్పించడం గమనార్హం.
పళనిసామి వర్గంతో చర్చలకు పన్నీర్ రెడీ
రాష్ట్రంలో సంక్లిష్ట పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శశికళను కలుసుకునేందుకు దినకరన్ బెంగళూరుకు పరుగులు పెట్టారు. రెండాకుల చిహ్నం కోసం రూ.60 కోట్ల ఎర ఆరోపణలు, రూ.1.30 కోట్లతో బ్రోకర్ పట్టుబడడం, ఢిల్లీ పోలీసుల సమన్లు తదితర అంశాలను ఆమెతో చర్చించేందుకు వెళ్లారు. పలు ఆరోపణలు, అప్రతిష్టల సుడిగుండంలో అన్నాడీఎంకే చిక్కుకోవడాన్ని అదనుగా భావించిన మాజీ సీఎం పన్నీర్సెల్వం పాచిక విసిరారు. రెండు వర్గాల విలీనానికి సీనియర్ మంత్రులు వస్తే చర్చలకు సిద్ధమని ఆహ్వానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండాకులు గుర్తు తమకే దక్కుతుందని ధీమా వ్యక్తం చేశారు. రెండాకుల చిహ్నం కోసం దినకరన్ లంచం ఇవ్వజూపే ప్రయత్నాలపై ఢిల్లీ పోలీసులు కేసు పెట్టిన విషయంపై తన వద్ద పూర్తి వివరాలు లేవని అన్నారు. ఇరువర్గాలు ఒకటి కావాలని తాను కోరుకుంటున్నానని, ఈ దిశగా సీనియర్ మంత్రులు వస్తే చర్చించేందుకు తాను సిద్ధమని చెప్పారు.
సీఎం పళనిసామితో తంబిదురై భేటీ
అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నాన్ని కాపాడుకునేందుకు పన్నీర్ వర్గంలో చేరిపోయేందుకు మంత్రులు, సీనియర్ నేతలు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అమ్మ మరణం తరువాత కోల్పోయిన ప్రతిష్టను పొందాలంటే రాజీనామా చేయాలన్న మంత్రుల సూచనను శశికళ, దినకరన్ నిరాకరించినట్లు సమాచారం. దీంతో సీఎం పళనిసామి తదితరులు శశికళ వర్గం నుంచి తప్పుకుని పన్నీర్ వర్గంలో విలీనం కావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి తెలుసుకున్నాకే పన్నీర్సెల్వం వారికి ఆహ్వానం పలికారని అంటున్నారు. మంత్రులు, సీనియర్ నేతలు పన్నీర్ పక్షం చేరితే ప్రభుత్వాన్ని కూల్చేస్తామని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు హెచ్చరికలు జారీ చేశారు. ఈ పరిణామాలతో కంగారు పడిన లోక్సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై హడావిడిగా సీఎం ఎడపాడి పళనిసామితో సమావేశమయ్యాక మీడియాతో మాట్లాడుతూ అన్నాడీఎంకే చీలిపోలేదు, వర్గాలు లేవని, ప్రజాస్వామ్యంలో చిన్నపాటి అసంతృప్తులు సహజమని వ్యాఖ్యానించారు.
ఐక్యతకే ప్రాధాన్యం అన్న మంత్రి జయకుమార్
మాజీ సీఎం పన్నీర్సెల్వం నేతృత్వంలోని అన్నాడీఎంకే చీలికవర్గంతో సంధి కుదుర్చుకోవటమే లక్ష్యంగా 25 మంది రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు చెన్నైలో సోమవారం రాత్రి అత్యవసర సమావేశం జరిపారు. వీరందరూ శశికళ గ్రూపునకు (అన్నాడీఎంకే అమ్మ పార్టీ) చెందినవారు. పార్టీపై శశికళ, ఆమె బంధువుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా వీరు వ్యూహం రూపొందిస్తున్నట్లు సమాచారం. సమావేశం తర్వాత మంత్రి డీ జయకుమార్ మీడియాతో మాట్లాడుతూ, పార్టీని, అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఐక్యంగా ఉంచటం కోసం చర్చిస్తున్నామని తెలిపారు. దీంతోపాటు అన్నాడీఎంకే ఐక్యంగా ఉన్నదని తెలియజేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి అఫిడవిట్ సమర్పించే అంశంపైనా చర్చించామన్నారు. రెండు గ్రూపులను విలీనం చేసేందుకు అవసరమైన చర్చలు, చర్యల కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవాలని మంత్రుల సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.
నేడు ఎమ్మెల్యేలతో సీఎం పళనిసామి భేటీ
పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళా నటరాజన్ రాజీనామా గురించి తనకు ఎటువంటి సమాచారం లేదని మంత్రి జయ కుమార్ పేర్కొన్నారు. పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా టీటీవీ దినకరన్ కొనసాగింపు విషయమై కూడా తమ సమావేశంలో ఎటువంటి చర్చ జరుగలేదన్నారు. అయితే బెంగళూరు జైలులో ఉన్న శశికళను కలుసుకునేందుకు వెళ్లిన దినకరన్ తిరిగి వచ్చిన తర్వాతే రెండు గ్రూపుల విలీన ప్రక్రియపై అన్నాడీఎంకే ఒక నిర్ణయానికి రావచ్చునని భావిస్తున్నారు. మరోవైపు మంగళవారం సీఎం ఎడపాడి పళనిసామి ఎమ్మెల్యేలతో సమావేశం కానుండటం గమనార్హం.
శశికళ, దినకరన్ ఔట్...
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో శశికళను, టిటివీ దినకరన్ను పక్కన పెట్టి పళనిస్వామి, పన్నీర్ సెల్వం ఒక్కటవుతారా అనే చర్చ సాగుతోంది. జైలు నుంచి శశికళ, బయటి నుంచి దినకరన్ తమపై ఆధిపత్యం వహించడాన్ని పళని సామి కూడా జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు.