బాబు స్మార్ట్ ఆలోచన: ఏపీలో పేదలకు ఉచిత ఫోన్లు!
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మరో కొత్త ఆలోచనతో ముందు వస్తున్నారు. రాష్ట్రంలో మొబైల్ ఫోన్ లేని పేదలకు వాటిని సమకూర్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చంద్రబాబు గురువారం తెలిపారు. డిజిటల్ లావాదేవీలు చేపట్టడానికి వీలుగా అందరికీ ఫోను సదుపాయం ఉండాలని ప్రభుత్వం భావిస్తోందని, పేదలకు వాటిని సమకూర్చే అంశంపై ఆలోచిస్తున్నామని అన్నారు. గురువారం బ్యాంకర్లతో సమీక్ష సమాశంలో ఆయన మాట్లాడారు.
డిసెంబరు ఒకటో తేదీకల్లా ప్రజలు ఆర్థిక లావాదేవీల్లో సమస్యలు లేకుండా చూడటమే మనముందున్న లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు మొబైల్ బ్యాంకింగ్లో తర్ఫీదు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. డిసెంబరునాటికి ఈ శిక్షణను పూర్తి చేయాలని, 5వేల మందికి శిక్షణనిస్తే వాళ్లు మిగిలిన వారికి శిక్షణ ఇస్తారన్నారు.
మొబైల్ బ్యాంకింగ్లో రాష్ట్ర డ్వాక్రా మహిళలు అందరికీ ఆదర్శం కావాలనీ, నగదురహిత లావాదేవీల వైపు ప్రజల్ని ప్రోత్సహించాలన్నారు. మిగిలిన రాష్ట్రాల మహిళలకంటే మనవాళ్లు చాలా త్వరగా నేర్చుకోగలరన్నారు. రాష్ట్రంలోని 90లక్షలమంది డ్వాక్రా మహిళల్లో 70లక్షల మందికి బ్యాంకు ఖాతాలు, 20శాతం మందికి రూపే కార్డులున్నాయనే విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ప్రస్తావించారు.
'పసుపు కుంకమ' కింద ఇస్తున్న రూ.3 వేలను మహిళలు రూపే కార్డుల్లో వేసుకోవాలని సూచించారు. డ్వాక్రా సభ్యుల ఇంటింటికీ వెళ్లి మొబైల్ బ్యాంకింగ్ వైపు మళ్లేలా చైతన్యపరచాలని సూచించారు. సెర్ప్, మెప్మా విభాగాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసుకోవాలన్నారు.
నగదురహిత లావాదేవాలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక సాంకేతిక బృందాలను నియమించాలని ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణామాల నేపథ్యంలో మొబైల్ బ్యాంకింగ్, ఆన్లైన్ లావాదేవీలు, డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగమే ప్రత్యామ్నాయమని చంద్రబాబు వివరించారు.