బాబు, జగన్ నిస్సహాయత: పవన్ కల్యాణ్ రైట్ ట్రాక్ పట్టారా?
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సత్తా చాటాలని చూస్తున్న జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ రైట్ ట్రాక్ పట్టారా అంటే అవుననే అనిపిస్తోంది. ఇటు పాలక తెలుగుదేశం పార్టీ, అటు ప్రతిపక్ష వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్రంపై తాడోపేడో తేల్చుకోలేని స్థితిలో ఉన్న పవన్ కల్యాణ్ దాన్ని అవకాశంగా తీసుకుంటున్నట్లు కనిపిస్తున్నారు.
Recommended Video
బాబుకు చిక్కులు ,జగన్ డైలమా: పవన్ కల్యాణ్కు ఇదే చాన్స్
ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పోరాటానికి జెఎసి ఏర్పాటు చేస్తామని ప్రకటన ద్వారా ఆయన ఓ అడుగు ముందుకు వేశారు. అందుకే పవన్ కల్యాణ్ ఆలోచనల్లో ఎదుగుదల కనిపిస్తోందని సినీ క్రిటిక్ మహేష్ కత్తి అన్నారు.
వారు ఇలా ఉన్నారని...
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపితో పొత్తును కొనసాగించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమయంత్రి నారా చంద్రబాబు నాయుడు, టిడిపి తెగదెంపులు చేసుకుంటే తాను పొత్తు పెట్టుకోవాలని వైసిపి నేత జగన్ చూస్తున్నారని, అందుకే రాష్ట్ర సమస్యలపై కేంద్రం మీద వారిద్దరు పోరాటానికి సిద్దంగా లేరని ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ స్థితిలో కేంద్రంపై పోరాటానికి పవన్ కల్యాణ్ ముందుకు వస్తానని చెప్పడం ద్వారా పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నట్లు అర్తమవుతోంది.
మహేష్ కత్తి చెప్పినట్లు జెఎసి అవసరం లేదా...
ప్రత్యేకంగా జెఎసి ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని మహేష్ కత్తి అంటున్నారు. కానీ, జెఎసి ఏర్పాటు ద్వారా కేంద్రంపై పోరాటం చేయడానికి సిద్ధపడిన, చేస్తున్న శక్తులన్నీ ఒక వేదిక మీదికి రావడానికి అవకాశం ఏర్పడుతుంది. అది రాజకీయంగా పవన్ కల్యాణ్కు తప్పకుండా ఉపయోగపడుతుంది. అలా వాడుకోవాలని పవన్ కల్యాణ్ చూడడంలో తప్పేమీ లేదు. అలా చేయడం ద్వారా తిరుగులేని నాయకుడిగా ఆయన ముందుకు వస్తే రాష్ట్రంలో రాజకీయాలు మారే అవకాశం ఉంటుంది.
వారు కలిసి వస్తే...
కాంగ్రెసు పార్టీ మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, లోకసత్తా జాతీయాధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తదితర మేధావులతో కలిసి జెఎసి ఏర్పాటు చేసి, కేంద్రంపై ఒత్తిడి తెస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు. ఉండవల్లి అరుణ్ కుమార్కు ఆంధ్రప్రదేశ్ సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉంది. జయప్రకాష్ నారాయణపై ఏ విధమైన మచ్చలు లేవు. వారిద్దరు కలిసి వస్తే పవన్ కల్యాణ్కు ఎనలేని బలం చేకూరుతుంది. యువత పెద్ద యెత్తున మద్దతుగా నిలిచే అవకాశం కూడా ఉంది. యువతలో జెపికి ఆదరణ ఉంది. అది పవన్ కల్యాణ్ రాజకీయాలకు ఉపయోగపడుతుంది.
పవన్ కల్యాణ్ ఆ ముద్రను వదిలించుకుంటారా...
చంద్రబాబుకు పవన్ కల్యాణ్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం ఉంది. ఆ ముద్రను పవన్ కల్యాణ్ తొలగించుకోవడానికి ఎపి సమస్యలపై పోరాటం ఉపయోగపడుతుంది. బుదవారం మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలు గమనిస్తే ఆయన ఆ దిశగా పయనిస్తున్నట్లే కనిపిస్తున్నారు.
పవన్ ఏమన్నారు...
విభజన హామీలపై అటు కేంద్రంలోని బిజెపి, ఇటు రాష్ట్ర టిిపి ప్రజలను మభ్యపెడుతున్నాయని, ప్రజలు తాము మోసపోయినట్లుగా భావిస్తున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజాభిప్రాయాన్ని ఆయన తన మాటల్లో ప్రతిబింబించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తద్వారా ఆయన తాను మోడీకో, చంద్రబాబుకో అనుకూలమనే అభిప్రాయాన్ని పటాపంచలు చేయడానికి సిద్ధపడినట్లు అర్థం చేసుకోవచ్చు.
మోడీపై పవన్ కల్యాణ్ ఇలా...
విభజన ప్రక్రియ సరైన రీతిలో జరగకపోవడం వల్ల, ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరగడం వల్ల తాను అప్పుడే చొరవ ప్రదర్శించానని పవన్ కల్యాణ్ చెప్పారు నరేంద్ర మోడీని ఆయన ప్రధాని కాక ముందే గుజరాత్ వెళ్లి కలిశానని, రాష్ట్ర విభజన శాస్త్రీయ పద్ధతిలో జరగలేదని, చెప్పి న్యాయం చేయాలని అడిగానని, ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరానని ఆయన చెప్పారు.
చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ఇలా...
అపారమైన అనుభవం ఉన్న చంద్రబాబును నమ్మానని, మోడీకి మద్దతు పలికానని, చంద్రబాబును నమ్మానని, మోడీకి మద్దతు పలికానని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబు కూడా ప్రత్యేక ప్యాకేజీ వల్ల మంచే జరిగిందని చెప్పారని అన్నారు మల్లీ చంద్రబాబే కేంద్రం నిధులు విడుదల చేయడం లేదని అంటారని ఆయన అన్నారు.
తన అభిప్రాయాన్ని పవన్ కల్యాణ్ ఇలా...
ప్రస్తుత పరిస్థితిపై పవన్ కల్యాణ్ స్పష్టంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ మొత్తం వ్యవహారం చూస్తుంటే అందరూ కలిసికట్టుగా రాష్ట్ర ప్రజలను అయోమయానికి గురి చేస్తున్నారని అనిపిస్తోందని అన్నారు. తద్వారా ఆయన మోడీనో, చంద్రబాబునో బలపరుస్తున్నట్లు కాదని చెప్పారు. ఆ ముద్ర నుంచి పూర్తిగా బయటపడాలంటే తాను భావిస్తున్నట్లు జెఎసి ఏర్పాటు చేసి పోరాటానికి దిగాల్సి ఉంటుంది. రాజకీయంగా ఆయనకు పూర్తిస్థాయిలో కలిసి వస్తుంది.