కాపుల్ని రెచ్చగొడుతున్నారా: ముద్రగడ ఏంచెప్పారు?
రాజమహేంద్రవరం: కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారా? కాపు సభ సమయంలో జరిగిన తుని ఘటన విషయంలో ఆయన ఆ రోజు చెప్పిన దానికి భిన్నంగా స్పందిస్తున్నారా? అంటే టిడిపి నేతలు అవుననే అంటున్నారు.
కాపు గర్జన సమయంలో కొందరు దుండగులు విధ్వంసానికి పాల్పడిన విషయం తెలిసిందే. రైలు బోగీలను తగులబెట్టారు. పోలీస్ స్టేషన్లకు నిప్పు పెట్టారు. దీనిని సీఐడీ విచారిస్తోంది. విచారణలో భాగంగా గత కొద్ది రోజులుగా ఆరుగురు నిందితులను గుర్తించి, అరెస్టు చేసింది.
అయితే, అరెస్టు నేపథ్యంలో మరోసారి ముద్రగడ, విపక్షాలు ప్రభుత్వం పైన దండయాత్రకు సిద్ధపడ్డాయి. ప్రభుత్వం అమాయకులను అరెస్టు చేసిందని చెబుతూ ముద్రగడ పద్మనాభం పోలీస్ స్టేషన్కు వచ్చారు. తన పైన ఏ1 కేసు నమోదు చేయాలని, తనను అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఓ వైపు అమాయకులను అరెస్ట్ చేశారని ముద్రగడ చెబుతుండటం, మరోవైపు ముద్రగడ పైన తెలుగుదేశం పార్టీ నేతలు నిప్పులు చెరుగుతుండటం, ఇంకోవైపు తాము అన్ని ఆధారాలతో నిందితులను అరెస్టు చేశామని సీఐడీ అధికారులు చెబుతుండటం గమనార్హం.
ఎవరి వాదన ఏమిటి?
పోలీసులు ఉద్దేశ్యపూర్వకంగా అమాయకులను అరెస్టు చేశారని ముద్రగడ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన పోలీస్ స్టేషన్కు వచ్చి.. తొలుత తనను అరెస్టు చేయాలని చెబుతున్నారు. కాపు ఉద్యమానికి తాను నాయకత్వం వహిస్తున్నానని, ఏం జరిగినా తొలి బాధ్యత తనదే అని చెప్పారు. అమాయకులను అరెస్టు చేసే ముందు తనను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.
అయితే, ముద్రగడ నాడు ఒకలా, ఈ రోజు మరోలా మాట్లాడుతున్నారని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. కాపు ఉద్యమం ఆయన భుజానికెత్తుకున్నందున ఆయన బాధ్యత వహించాలని, కానీ గతంలో ఆయన మాట్లాడుతూ.. కాపు ఉద్యమానికి తాను బాధ్యత వహిస్తున్నానని, కాని అసాంఘిక శక్తులకు తన బాధ్యత కాదని ఆయన చెప్పారని గుర్తు చేస్తున్నారు.
సీఐడీ పోలీసులు పక్కా ఆధారాలతో, అన్ని వివరాలు.. అంటే సీసీటీవీ ఫుటేజీలు, ఆడియో, వీడియో ఆధారాలు సేకరించి, నిర్దారణ చేసుకున్న తర్వాతనే నిందితులను అరెస్టు చేశారని కొందరు అంటున్నారు. అరెస్టైన వారి పైన కూడా గతంలో రౌడీషీట్ నమోదయి ఉందని గుర్తు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో వారు అమాయకులు ఎలా అవుతారని అంటున్నారు. పూర్తి ఆధారాలతో అరెస్ట్ చేసినట్లు సీఐడీ కూడా చెబుతోందని తెలుస్తోంది.
కాగా, తూర్పు గోదావరి జిల్లా అమలాపురం పోలీస్ స్టేషన్లో ముద్రగడ మంగళవారం నాడు బైఠాయించిన విషయం తెలిసిందే. తుని ఘటనలో ఆరుగురి అరెస్టు పైన నిరసన తెలుపుతూ ఆయన బైఠాయించారు. మొదట తనను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. కాపు ఉద్యమానికి కర్త, కర్మ, క్రియ తానే అని చెప్పారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న విషయం తెలిసిందే.