న్యూటన్కంటే ముందే ఆర్యభట్టకి తెల్సు: వేదాల్లో చంద్రుడిపై నీటి జాడ
ఢిల్లీ: గురుత్వాకర్షణ శక్తి గురించి... ఐజాక్ న్యూటన్ చెప్పడాని కంటే 1500 ఏళ్ల ముందే ఖగోళ శాస్త్ర నిపుణుడు ఆర్యభట్టకు దాని గురించి తెలుసునని, చంద్రుని పైన జలరాశి ఉందని వేదాల్లోని కొన్ని శ్లోకాలు ప్రస్తావించాయని ప్రముఖ శాస్త్ర్వేత్త, ఇస్రో మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ అన్నారు.
లోహశాస్త్రం, బీజ గణితం, ఖగోళ శాస్త్రం, గణితం, జ్యోతిషం, వాస్తు శిల్పి శాస్త్రాల గురించి పాశ్చ్తాయ దేశాలు తెలుసుకోవడానికంటే చాలా ముందే భారతీయ వేదాలు, ప్రాంచీన గ్రంథాల్లోను వాటి సమాచారం ఉందని ఆయన చెప్పారు. వేదాల్లో సమాచారం కుదించిన రూపంలో ఉందన్నారు.
అందువల్ల ఆధునిక విజ్ఞాన శాస్త్రం దానిని అంగీకరించడం కష్టమవుతోందన్నారు. చంద్రుడి పైన నీరు ఉందని ఒక వేదంలోని శ్లోకాలు చెబుతున్నాయని తెలిపారు. దానిని ఎవరు విశ్వసించలేదన్నారు. చంద్రయాన్ కార్యక్రమం ద్వారా దానిని రుజువు చేయగలిగామని చెప్పారు.
అలా నిరూపించగలిగిన మొదటి వ్యక్తులం మనమే అన్నారు. వేదాలు స్వచ్ఛమైన సంస్కృతంలో ఉన్నందున వాటిలో ఉన్నదంతా అర్థం చేసుకోలేకపోతున్నామని, పాశ్చాత్య ప్రపంచానికి ఏమాత్రం తెలియని ప్రాథమిక ఆవిష్కరణలు దీనిలో ఉన్నాయన్నారు. వేదాలను చదవాలంటే సంస్కృతి తెలిసి ఉండాలనేదే ఒక అవరోధమన్నారు.
వేదాల్లోని కొన్ని శ్లోకాల్లో చంద్రుడిపై నీటి జాడల ప్రస్తావన ఉందన్నారు. దాన్నిబట్టి చూస్తే ఆర్యభట్టలాంటి ఖగోళ నిపుణులకు గురుత్వబలం గురించి ముందే తెలుసునని తేలుతోందన్నారు. వేదాలపై అంతర్జాతీయ సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రహపరిశోధనకు ఖగోళ, గణిత శాస్త్రవేత్తలు ఆర్యభట్ట, భాస్కర కృషి అమోఘమన్నారు.
సౌర కుటుంబంలోని వెలుపలి గ్రహాల ఉనికి గురించి అయిదో శతాబ్దానికి చెందిన ఖగోళ నిపుణుడు, గణిత పండితుడు ఆర్యభట్ట చేసిన కృషి గర్వకారణమన్నారు. చంద్రయాన్ కోసం ఆర్యభట్ట సమీకరణాలను ఉపయోగించుకున్నామని చెప్పారు.
హరప్పా నాగరికత కాలంలోనే నగరాల నిర్మాణానికి రేఖా గణితాన్ని వినియోగించారన్నారు. పైథాగరస్ సిద్ధాంతం వేదాల కాలం నుండి ఉందని చెప్పారు. ఆ రోజుల్లోనే వేసిన లెక్కలు నిజంగా అద్భుతమని ఒక శాస్త్రవేత్తగా తాను చెప్పగలనని మాధవన్ నాయర్ అన్నారు.