నిప్పు పెట్టిన కెసిఆర్, బాబు దోస్తీ: రేవంత్ రెడ్డికి అనివార్యం?
పార్టీ మారుతారంటూ గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి త్వరలో తెర దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెసులో చేరడం ఖాయంగా కనిపిస్తోం
హైదరాబాద్: పార్టీ మారుతారంటూ గత కొంత కాలంగా జరుగుతున్న ప్రచారానికి తెలుగుదేశం పార్టీ ప్రస్తుత వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి త్వరలో తెర దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన కాంగ్రెసులో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
బిజెపి నుంచి కూడా ఆయనకు ఆహ్వానం ఉన్నట్లు ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే, ఆయన కాంగ్రెసు పార్టీని ఎంచుకున్నట్లు దాదాపుగా నిర్ధారణ అయింది. ఆయన బిజెపిని కాదని కాంగ్రెసులో చేరడానికి, అసలు టిడిపిని వదలడానికి వెనక బలమైన కారణాలే ఉన్నాయని భావించాల్సి ఉంటుంది.
తెలంగాణలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావును ఎదుర్కునే శక్తి, వాగ్ధాటి కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే ఉందనే అభిప్రాయం బలంగా నాటుకుపోయింది. ఈ స్థితిలో ఆయన ఏ పార్టీలో చేరితే ఆ పార్టీకి అదనపు బలం చేకూరుతుందనే అభిప్రాయం కూడా ఉంది.
గుట్టు తెలిసి రేవంత్.....
తమ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కెసిఆర్తో నెయ్యాన్నే కోరుకుంటున్నట్లు రేవంత్ రెడ్డి నిర్ధారణ చేసుకున్నట్లు అర్థమవుతోంది. పైగా, ఆ నెయ్యం కేవలం ఇరు రాష్ట్రాల మధ్య సంబంధాలకే పరిమితం కాకుండా తెరాస, టిడిపి పొత్తు పెట్టుకునే దిశగా సాగుతోంది. కెసిఆర్ను ఎదుర్కోవడమే ప్రధాన లక్ష్యంగా చేసుకున్న రేవంత్ రెడ్డికి అది మింగుడు పడని విషయంగా మారిందని చెప్పవచ్చు.
Recommended Video
కెసిఆర్ వ్యూహం కూడా...
తెలంగాణలో రెడ్డి నాయకత్వాన్ని దెబ్బ తీయడానికి కెసిఆర్ వెల్కమ్ వ్యూహానికి తెర తీసినట్లు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ బయటపెట్టారు. తెలంగాణలోని తెలుగుదేశం కమ్మ నాయకులను కెసిఆర్ తెరాసలోకి ఆహ్వానించే పనికి శ్రీకారం చుట్టారు. తద్వారా తెలంగాణలోని బలమైన రెడ్డి నాయకత్వాన్ని దెబ్బ తీయాలనేది ఆయన వ్యూహంగా చెబుతున్నారు. దీనికి చంద్రబాబు మౌనమైన అంగీకారం ఉంటుందని కూడా భావిస్తున్నారు. అందువల్ల తెలుగుదేశం పార్టీలో తాను ఒంటరివాడిని అయిపోతాననే భావన రేవంత్ రెడ్డికి కలిగి ఉంటుంది. అందుకే ఆయన టిడిపిని వదిలిపెట్టాలని నిర్ణయం తీసుకున్నారని అనుకోవాల్సి ఉంటుంది.
బిజెపిని ఎందుకు వద్దనుకున్నారు.....
రేవంత్ రెడ్డి బిజెపిలో చేరకూడదని అనుకోవడానికి కూడా బలమైన కారణమే ఉందని చెప్పవచ్చు. తెలంగాణ బిజెపి నాయకులు కెసిఆర్ను వ్యతిరేకిస్తున్నారు. అయితే, జాతీయ స్థాయిలో కెసిఆర్కు బిజెపి అనుకూలంగానే ఉంది. కెసిఆర్ మోడీ ప్రభుత్వానికి అనుకూలంగానే ఉన్నారు. మోడీతో పాటు బిజెపి జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా కెసిఆర్తో సత్సంబంధాలు నెరుపుతున్నారు. అందువల్ల బిజెపి తెలంగాణలో కెసిఆర్ను వ్యతిరేకించే స్థితి ఉండదని రేవంత్ రెడ్డి అర్థం చేసుకుని ఉంటారు. అంతేకాకుండా, తెలంగాణలో బిజెపికి ప్రజల నుంచి ఆమోదం లభించడం కూడా అంత సులభం కాదు. అందువల్ల బిజెపిని ఆయన కాదని అనుకుని ఉంటారని చెప్పవచ్చు.
కాంగ్రెసు ఎందుకు...
తెలంగాణలో దాదాపుగా టిడిపి తుడిచిపెట్టుకుపోయిందనే భావించవచ్చు. రేవంత్ రెడ్డి కెసిఆర్పై చేసే పోరాటానికి టిడిపిలోని సీనియర్ల నుంచి పెద్దగా మద్దతు లేదు. పైగా, చంద్రబాబు తెలంగాణ టిడిపిని బలోపేతం చేయాలనే ఆలోచనను వదిలేసినట్లే కనిపిస్తున్నారు. అసలు పార్టీని ఆయన పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కూడా ఉంది. పొత్తుల విషయంపై రగడ జరుగుతున్న సమయంలో సమావేశం పెట్టి ఎవరూ మాట్లాడకూడదని హెచ్చరికలు జారీ చేశారు. కాంగ్రెసు మాత్రమే కెసిఆర్పై ప్రస్తుతం పోరాటం చేస్తోంది. బలమైన నాయకులతో కాస్తా బలంగానే కనిపిస్తోంది. పైగా, పార్టీగా అది కెసిఆర్తో రాజీ పడే ప్రసక్తి లేదు. అందువల్ల ఆయన కాంగ్రెసు పార్టీని ఎంచుకుని ఉంటారు.
కాంగ్రెసుకూ అవసరమే...
కెసిఆర్పై రాజీ లేని పోరాటం చేసే నాయకుడు కాంగ్రెసుకు అవసరమైంది. ఉండడానికి చాలా మంది సీనియర్ నాయకులే ఉన్నప్పటికీ వారి శక్తి సరిపోవడం లేదు. పైగా, వాగ్దాటిలో కెసిఆర్ను ఎదుర్కోలేకపోతున్నారు. వాగ్ధాటితో ఘాటైన విమర్శలతో కెసిఆర్ను ఎదుర్కునే నాయకుడిగా రేవంత్ రెడ్డి గుర్తింపు పొందారు. అందువల్ల రేవంత్ రెడ్డి అవసరం ఉందని కాంగ్రెసు యువరాజు రాహుల్ గాంధీ గుర్తించి ఉంటారు.
రేవంత్ రెడ్డి రాజీ పడ్డారా.....
తెలంగాణకు ముఖ్యమంత్రిని కావాలనేది రేవంత్ రెడ్డి ఆశయం. అయితే, కాంగ్రెసులో జానా రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, డికె అరుణ, దామోదర రాజనర్సింహ వంటి పలువురు నాయకులు ముఖ్యమంత్రి పదవిని ఆశించేవారే. ఒకవేళ కాంగ్రెసు గెలిస్తే రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుందా అంటే గ్యారంటీగా అవునని చెప్పలేం. ఈ విషయంలో రేవంత్ రెడ్డి రాజీ పడ్డారనే అనుకోవాల్సి ఉంటుంది. ముందు తన శత్రువు కెసిఆర్ను ఓడిస్తే తర్వాత పదవి గురించి ఆలోచించవచ్చునని ఆయన అనుకుంటూ ఉండవచ్చు. పైగా, ఆయనకు వయస్సు ఏమీ మీరిపోలేదు. ఇవాళ కాకపోతే రేపు అని సర్దుకుపోవడానికి అవకాశం ఉంది.
ప్రయత్నాలకు విఘాతం...
కెసిఆర్కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నింటీని ఏకం చేసి మహాకూటమి కట్టాలనే ప్రయత్నాలను రేవంత్ రెడ్డి ఆశించారు. ఇందులో భాగంగా కాంగ్రెసుతో కలిసి పనిచేయాలని కూడా ఆయన టిడిపి నేతగా భావించారు. కానీ, చంద్రబాబు వైఖరి అందుకు అనుకూలంగా ఉన్నట్లు కనిపించడం లేదు. దీన్ని రేవంత్ రెడ్డికి తీవ్రమైన దెబ్బగానే చూడాల్సి ఉంటుంది.
జైపాల్ రెడ్డి అండదండలు...
రేవంత్ రెడ్డికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి అండదండలు లభించే అవకాశం ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెసుకు పెద్ద దిక్కు ఆయనే. పైగా, అధిష్టానంతో నేరుగా మాట్లాడగలిగే స్థితి ఆయనది. రేవంత్ రెడ్డికి ఆయన సమీప బంధువు. అందువల్ల రేవంత్ రెడ్డి జైపాల్ రెడ్డి అండదండలు ఉంటాయనే నమ్మకాన్ని కూడా పెట్టుకుని ఉంటారు.
రేవంత్ రెడ్డి చుట్టూ యువత ర్యాలీ....
తెలంగాణలో యువత రేవంత్ రెడ్డి చుట్టూ ర్యాలీ అవుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. యువత కెసిఆర్పై తీవ్రమైన ఆగ్రహంతో ఉందనేది కాదనలేని విషయం. ఉద్యోగాల విషయంలో కెసిఆర్ మోసం చేశారని రగిలిపోతోంది. తెలంగాణలో పలుచోట్ట స్థానిక నిరసనలు పెల్లుబుకుతున్నాయి. రేవంత్ రెడ్డి కెసిఆర్ వ్యతిరేక శక్తులను కూడగట్టే అవకాశం ఉంది.