ట్విస్ట్: నాడు డోన్లో, నేడు పత్తికొండలో జగన్ ప్లాన్ ఇదే, కె.ఈ కోటాను ఢీకొట్టేనా?
కర్నూల్ జిల్లాలోని టిడిపి కంచుకోటలపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు.
కర్నూల్: కర్నూల్ జిల్లాలోని టిడిపి కంచుకోటలపై వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డి వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. పాదయాత్ర సందర్భంగా పత్తికొండ అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవి పోటీ చేస్తారని జగన్ ప్రకటించారు.2014 ఎన్నికలకు ముందు డోన్ అసెంబ్లీ నియోజకవర్గంలో బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి పేరును జగన్ ప్రకటించారు. ప్రస్తుతం పత్తికొండ అసెంబ్లీ స్థానానికి శ్రీదేవి పేరును జగన్ ప్రకటించారు. అయితే ఈ రెండు నియోజకవర్గాల్లో కె.ఈ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ఉన్న సమయాల్లోనే జగన్ ముందుగా అభ్యర్థులను ప్రకటించారు.
2019 ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారంలోకి రావాలనే లక్ష్యంతో వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ వ్యూహత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ మేరకు పాదయాత్రను లక్ష్యంగా ఎంచుకొన్నారు.
జగన్ పాదయాత్ర ప్రస్తుతం కర్నూల్ జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్ర సందర్భంగా జగన్ టిడిపి వైఫల్యాలపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు తాము అధికారంలోకి వస్తే ఏ కార్యక్రమాలను చేపట్టనున్నామో నవరత్నాల కార్యక్రమాలను ప్రచారం నిర్వహిస్తున్నారు.
కె.ఈ. కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహించిన స్థానాలపై
కర్నూల్ జిల్లాలో డోన్, పత్తికొండ అసెంబ్లీ స్థానాలు టిడిపికి కంచుకొటలుగా ఉన్నాయని ఆ పార్టీ నేతలు చెబుతుంటారు. ఈ స్థానాల నుండి కె.ఈ సోదరులు ప్రాతినిథ్యం వహించారు. 2009 నుండి 2014 వరకు డోన్ నుండి కె.ఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహించారు. పత్తికొండ నుండి ఆయన సోదరుడు కె.ఈ ప్రభాకర్ ప్రాతినిథ్యం వహించారు.అయితే 2014 ఎన్నికల్లో పత్తికొండ నుండి కె.ఈ. కృష్ణమూర్తి బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఏపీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అయితే ఈ రెండు అసెంబ్లీ నియోజకర్గాలపై వైసీపీ కన్నేసింది. ఈ స్థానాల్లో కె.ఈ సోదరులను ఓడించాలని ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు పత్తికొండలో వైసీపీ అభ్యర్థిగా చెరుకులపాడు నారాయణరెడ్డి సతీమణి శ్రీదేవిని 2019 ఎన్నికల్లో బరిలోకి దింపనున్నట్టు వైసీపీ చీఫ్ జగన్ ప్రకటించారు. కె.ఈ కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకొని వైసీపీ వ్యూహరచన చేస్తోంది.
నాడు డోన్లో, నేడు పత్తికొండలో
2009 నుండి 2014 వరకు డోన్ నియోజకర్గంలో కె.ఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహించారు. 2014 నుండి పత్తికొండ సెగ్మెంట్లో కె.ఈ కృష్ణమూర్తి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ముందుగా అభ్యర్థులను ప్రకటించడం వైసీపీలో చాలా అరుదుగా కన్పిస్తోంది. 2014 ఎన్నికలకు ముందుగానే డోన్ వైసీపీ అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరును జగన్ ప్రకటించారు. పాదయాత్ర సందర్భంగా తాజాగా పత్తికొండ అభ్యర్థిగా శ్రీదేవి పేరును జగన్ ప్రకటించారు. అయితే ముందుగా అభ్యర్థులను ప్రకటించిన రెండు నియోజకర్గాలకు కె.ఈ. కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన సందర్భంలోనే కావడం గమనార్హం.
కె.ఈ కంచుకోటను ఢీకొట్టేనా
2014 ఎన్నికలకు ముందే అభ్యర్థులను ప్రకటించడం వల్ల రాజకీయంగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే ఈ కారణాలతోనే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డికి కలిసివచ్చిందనే అభిప్రాయాన్ని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే డోన్ నుండి కె.ఈ. కృష్ణమూర్తి పోటీ చేయకపోవడం కూడ బుగ్గనకు కలిసివచ్చింది. అంతేకాదు ఈ స్థానం నుండి కె.ఈ ప్రతాప్ పోటీ చేశారు. అయితే కె.ఈ ప్రభాకర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేయాలని భావించినా టిడిపి టిక్కెట్టు దక్కలేదు. అయితే కె.ఈ కృష్ణమూర్తిని ఢీకొట్టేందుకు శ్రీదేవి పేరును ముందుగానే ప్రకటించారని సమాచారం.
2019లో కె.ఈ వారసులు బరిలోకి
2019 ఎన్నికల్లో కె.ఈ కృష్ణమూర్తి వారసులు ఎన్నికల బరిలోకి దిగే అవకాశం ఉందని టిడిపి వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో కె.ఈ. కృష్ణమూర్తి పోటీ చేస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే కె.ఈ కుటుంబాన్ని ఢీకొట్టేందుకు వైసీపీ రచిస్తున్న వ్యూహలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.