కేబీఆర్ ఫైరింగ్: సెలవు పెట్టి స్కెచ్చేశాడా?(ఫోటో)
హైదరాబాద్: అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డి పైన కాల్పులకు పాల్పడిన ఏఆర్ కానిస్టేబుల్ ఓబులేష్.. విధులకు సెలవు పెట్టి మరీ స్కెచ్ వేశాడని తెలుస్తోంది. కాల్పులకు పాల్పడిన అనంతరం తన ప్రణాళిక ఫెయిల్ కావడంతో.. ఎస్సార్ నగర్ చేరుకున్నాడు. అక్కడి నుండి బెంగళూరు బస్సు ఎక్కాడు.
అనంతపురం వెళ్తున్న అతడిని సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు గుర్తించి, అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అతడిని హైదరాబాదులో రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
ఓబులేష్ 1998 బ్యాచ్కు చెందిన ఎపీఎస్పీ కానిస్టేబుల్. గతంలో గ్రేహౌండ్స్లో ఉండగా విశాఖ నుండి హైదరాబాద్ వస్తుండగా విజయవాడలో ఏకే 47 ఆయుధాన్ని చోరీ చేశాడని తెలుస్తోంది. గ్రేహౌండ్స్ విచారణలో తనకు ఏమీ తెలియదని చెప్పాడు.
కాగా, నిందితుడు వదిలి వెళ్లిన బ్యాగులో లభించిన కొన్ని ఆధారాల ద్వారా, సీసీ ఫుటేజీ దృశ్యాలను చూసిన పోలీసులు, నిత్యానంద రెడ్డి అతనిని గుర్తించారు. దీంతో అతనే కాల్పులు జరిపాడని నిర్ధారణకు వచ్చారు. అతని కోసం టాస్క్ ఫోర్స్, ఆరు ప్రత్యేక బృందాలను పంపించారు.
బుధవారం ఉదయం ఏడున్నర గంటలకు బంజారాహిల్స్లోని కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ వద్ద కారులోకి ఎక్కిన నిత్యానంద రెడ్డితో పాటు అగంతకుడు ఎక్కి అతనిని బెదిరించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో పెనుగాలట, కాల్పులు జరిగాయి. నిత్యానంద సోదరుడు నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేయడంతో అతను పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేసి దర్యాఫ్తు చేస్తున్నారు. కాగా, ఓబులేష్ను పట్టుకున్నట్లుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే అంతకుముందు పోలీసులు అతని చిత్రం విడుదల చేశారు.