జైల్లో తండ్రి లాలూ: బచ్చా కాదని తేల్చిన తనయుడు తేజస్వి
లక్నో: ఆర్జెడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జైలులో ఉన్నప్పటికీ పార్టీని నిలబెట్టగలనని ఆయన తనయుడు తేజస్వి యాదవ్ నిరూపించుకున్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్తో తెగదెంపులు చేసుకున్నప్పటికీ పార్టీ స్థానాలను ఉప ఎన్నికల్లో నిలబెట్టగలిగారు
తేజస్వీ యాదవ్ తొలిసారి శాసనసభ్యుడిగా గెలిచారు. గతంలో నితీష్ కుమార్తో పొత్తు ద్వారా గెలుచుకున్న సీట్లను విడిపోయిన తర్వాత కూడా తేజస్వి గెలిపించగలిగారు. నితీష్ కుమార్ నిరుడు లాలూ ప్రసాద్ యాదవ్తో తెగదెంపులు చేసుకుని తిరిగి బిజెపి పక్కన చేరారు
తేజస్వీ సత్తా చాటారు..
ఆరారియా లోకసభ స్తానానికి, జెహనాబాద్, భబువా అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు బుధవారం వెలువడ్డాయి. లాలూతో విడిపోయిన తర్వాత బీహార్లో జరిగిన తొలి ఎన్నికలు ఇవే. ఆర్జెడీ ఆరారియా లోకసభ స్థానాన్ని, జెహనాబాద్ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకోగా, బిజెపి భబువా స్థానాన్ని కాపాడుకుంది. ఆ రెండు స్థానాలను తిరిగి గెలుచుకోవడం 28 ఏళ్ల తేజస్వి యాదవ్కు పెద్ద విజయమే.
ఇది మామూలు గెలుపు కాదు
ఇది సాధారణమైన విజయం కాదని, లాలూజీ ఖతమ్ హోగయా (లాలూజీ పని అయిపోయింది) అనే వాళ్లకు ఇది సమాధానమని, లాలూజీ ఓ సిద్ధాంతమని, ఆ సిద్ధాంతం ఈ రోజు విజయం సాధించిందని తేజస్వీ యాదవ్ బుధవారంనాడు అన్నారు.
తండ్రి అందుబాటులో లేకుండా..
తండ్రి సహాయం లేని స్థితిలో ఉప ఎన్నికలను ఎదుర్కోవాల్సి రావడం తేజస్వి యాదవ్ నాయకత్వానికి పరీక్షనే. అవినీతి కేసులో జైలులో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల్లో ప్రచారం చేయలేపోయారు. గత రెండు దశాబ్దాల్లో ఆయన పార్టీ ప్రచారానికి దూరంగా ఉండడం ఇదే మొదటిసారి.
తేజస్వీ జాతీయ ఎజెండా
తమ మహాకూటమి జాతీయ స్థాయిలో సత్తా చాటాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాజకీయ పార్టీలు తమ అహంకారాలను దూరం పెట్టి మహా సమరం చేయడానికి సిద్ధపడాలని తేజస్వి యాదవ్ అన్నారు.
ఆయన్ను బచ్చా అన్నారు...
క్రికెటర్ అయిన తేజస్వీ యాదవ్ రాజకీయ నేతగా అవతారమెత్తారు. అయితే, జెడియు, బిజెపి నాయకులు ఆయనను బచ్చాగా అభివర్ణిస్తూ వచ్చారు. ఆర్జెడీలోని కొంత మంది కూడా ఆయనను తక్కువ అంచనా వేస్తూ వచ్చారు. తన ఆహారంలో నితీష్ కుమార్ విషం కలిపారని అన్నప్ప్పుడు ఆయనకు ఏ విధమైన మద్దతు కూడా లభించలేదు.