అదే కొంపముంచింది: బీజేపీ ఇంతలా మొండికేయడానికి టీడీపీ, వైసీపీలే కారణం?
న్యూఢిల్లీ/విజయవాడ: రాజకీయ ప్రయోజనాలా?.. రాష్ట్ర ప్రయోజనాల అని తేల్చుకోవాల్సి వస్తే.. ఏపీలోని రెండు ప్రధాన పార్టీలు రాజకీయ ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తాన్న సంగతి బడ్జెట్ సమావేశాల సందర్భంగా మరింత స్పష్టమైంది. కేంద్రంపై పోరాడి రాష్ట్ర ప్రయోజనాలను నెరవేర్చుకోవాలన్న తాపత్రయం కంటే.. ఆ క్రెడిట్ ఎక్కడ ప్రత్యర్థి పార్టీకి వెళ్తుందోనన్న ఆందోళనే ఇరువురిలోనూ కనిపించింది. టీడీపీ, వైసీపీలు ఇలా తయారయ్యాయి కాబట్టే బీజేపీ కూడా ఏపీని లైట్ తీసుకుందనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ అలసత్వమే కొంపముంచింది..:
రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాల కోసమే టీడీపీ, వైసీపీలు ఎక్కువగా పాకులాడుతున్నప్పుడు.. బీజేపీ మాత్రం తమ రాజకీయ ప్రయోజనాలను పక్కనపెట్టి ఏపీని ఆదుకుంటుందా?. ప్రాంతీయ పార్టీలే పంతాలు, పట్టువిడుపులకు పోయినప్పుడు.. ఒక జాతీయ పార్టీగా బీజేపీ
మాత్రం తమ రాజకీయ లెక్కల్ని పక్కనపెట్టి ఏపీకి సహాయం చేస్తుందా?.. కాబట్టి ఇక్కడి రెండు పార్టీలు ఇచ్చిన అలసత్వం వల్లే ఈరోజు బీజేపీ ఇంతలా మొండికిపోయే పరిస్థితికి కారణమైందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇదేదో ముందు నుంచి చేస్తే..:
రాష్ట్రం కోసం కలిసి పోరాడలేనితనం బీజేపీకి అలుసుగా మారింది. పైగా ఇన్నాళ్లు కేంద్రంలో మిత్రపక్షంగానే ఉంటూ వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. నాలుగేళ్ల వరకు కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడానికి సాహసించలేదు. తీరా ఐదేళ్ల పీరియడ్ దగ్గరపడ్డ సమయంలో అరిచి గగ్గోలు పెట్టినంత మాత్రానా బీజేపీ మనసు మారుతుందా?.. ఈ చిత్తశుద్ది ఏదో ముందు నుంచే వెంటే పరిస్థితి ఇంతదాకా వచ్చేది కాదు కదా అన్న వాదన వినిపిస్తోంది.
అంతా పొలిటికల్ స్టంట్?:
ఒకవేళ నిజంగా ఇప్పుడు బీజేపీ ఏపీ కోసం కొన్ని తాయిలాలు ప్రకటించినా.. వాటిని నెరవేర్చేంత సమయం ఇప్పుడుందా?.. అసలు వాటికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయిస్తారా?.. అన్న ప్రశ్నలకు సమాధానం వెతుక్కోవడం అంత కష్టమేమి కాదు. ఇలా ఆలోచించినప్పుడు టీడీపీ-బీజేపీ రెండూ కేవలం ఎన్నికల కోసమే ఈ పొలిటికల్ గేమ్ ఆడుతున్నట్టు కనిపించడంలో అతిశయోక్తి లేదు.
టీడీపీ, వైసీపీ.. రెండూ రెండే..:
టీడీపీ, వైసీపీలు రెండూ బీజేపీ చేతిలో చిక్కుపడిపోయాయి అన్న సంగతి తాజా పరిణామాలతో మరింత స్పష్టమైంది. ఈ రెండు పార్టీలకు ఉన్న లొసుగుల వల్లే ఇన్నాళ్లు కేంద్రాన్ని గానీ, మోడీని గానీ ఎదిరించే సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు కూడా మోడీని ప్రత్యక్షంగా టార్గెట్ చేసేంత ధైర్యం ఇరు పార్టీల నేతలకు లేదన్నది అందరికీ తెలిసిన సత్యమే. ఒకరేమో అవినీతి కేసుల్లో ఇరుక్కుని, ఇంకొకరు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి కేంద్రం చేతిలో చిక్కుబడిపోయారు. కాబట్టి ఈ రెండు పార్టీల పోరాటం మేకపోతు గాంభీర్యం తప్ప మరొకటి కాదు అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.