ఎక్కడ?: 20శాతం కమీషన్తో నల్లధనం.. తెల్లధనమవుతోంది!
అమరావతి: పెద్ద నోట్ల రద్దుతో నల్ల కుబేరుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పెద్ద మొత్తంలో ఉన్న తమ దగ్గరి పెద్దనోట్లను ఏ విధంగా తెల్లగా మార్చుకోవాలో తెలియక నానా హైరానా పడుతున్నారు. ఈ నేపథ్యంలో నల్లకుబేరులకు అండగా నిలిచేందుకు పలువురు వ్యాపారులు సిద్ధమయ్యారు. తమకు 20శాతం కమీషన్ ఇస్తే చాలు మీ దగ్గర ఉన్న కోట్ల రూపాయల నల్లధనాన్ని తెల్లగా చేసేస్తామని అభయహస్తమందిస్తున్నారు.
20శాతం అంటే నల్లకుబేరులకు చెందిన రూ.5కోట్లను తెల్లగా మారిస్తే రూ. కోటి వరకు వ్యాపారులకు మిగులుతుందన్నమాట. కాగా, తమకు ఏ దారి లేకపోవడంతో నల్ల కుబేరులు సైతం వారినే ఆశ్రయిస్తుండటం గమనార్హం. ఈ తతంగమంతా ఏపీ నూతన రాజధాని అమరావతి ప్రాంతం(విజయవాడ, గుంటూరు)లో మరింత ఎక్కువగా కొనసాగుతోంది.
విజయవాడ నగరంలో ఇప్పటికే రెండు, మూడు రోజుల నుంచి ఈ తరహాలో కొందరు వ్యాపారులు, ఆడిట్ సంస్థలు కోట్లాది రూపాయలు మార్చి ఉండొచ్చని తెలుస్తోంది. గుంటూరు డొంకరోడ్డులో కూడా కొందరు ఫైనాన్స్ వ్యాపారులు తమ వద్ద ఉన్న పాత 500, 1000కరెన్సీ నోట్లు మార్చి పెట్టడానికి జన్ధన్ ఖాతాలు కలిగిన పేద లబ్ధిదారులను పావులుగా వినియోగించుకుంటున్నట్లు తెలుస్తోంది. వారికి చెందిన బ్యాంకు పాస్పుస్తకాలు, ఏటీఎం కార్డులను ఆ వ్యాపారులు తమ వద్దే పెట్టుకుని ఈ మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్చేసి తిరిగి కొత్త నోట్లు వచ్చిన తర్వాత అందజేస్తామని నమ్మబలుకుతున్నారు.
ఈ క్రమంలో వారికి ఏదైనా ఆర్థిక అత్యవసరం ఏర్పడితే తమ సమక్షంలోనే ఏటీఎంలతో డ్రా చేసుకుని తీసుకునేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇక్కడ వ్యాపారులు కూడా ఇలా చేసినందుకు 10శాతం వరకు పేదలకు కమిషన్ ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది.
కాగా, నల్లకుబేరుల నుంచి మార్పిడి చేసి పెడతామని తీసుకుంటున్న పెద్ద కరెన్సీ నోట్లను బ్యాంకుల్లో జమ చేస్తున్న వ్యాపారులు వారికి తమ కమిషన్ శాతం పోనూ మిగిలిన మొత్తాన్ని ప్రస్తుతం చెల్లుబాటయ్యే కరెన్సీ రూపంలో తిరిగి చెల్లించటానికి కనీసం 6నెలల సమయం కావాలని షరతులు పెట్టుకుంటున్నారు. తమ నుంచి రూ.కోట్ల నల్లధనాన్ని తీసుకుంటున్న వ్యాపారులు తిరిగి ఆమేరకు పారదర్శకంగా చెల్లింపులు చేస్తారా? లేదా అని ఎవరైనా అనుమానపడితే ఆమేరకు తాము పెద్ద నోట్ల రద్దుకు ముందు అప్పుగా తీసుకున్నామని చెప్పి ప్రాంసరీ నోట్లు రాసివ్వటానికి కూడా కొందరు వ్యాపారులు సిద్ధపడుతుండటం గమనార్హం.
మరికొందరైతే ఇంకా నమ్మకం కుదరకపోతే ఆమేరకు ఖాళీ చెక్కులు ఇస్తామని నమ్మబలుకుతున్నారు. కేవలం ఒక్క బ్యాంకుల నుంచి డ్రా చేసి ఇవ్వటమే కాదు.. రెగ్యులర్గా కూడా తమకు కొత్త కరెన్సీనోట్లు వస్తాయని అవన్నీ కలిపి ఎప్పటికప్పుడు చెల్లింపులు చేస్తామని కొందరు మూడు మాసాలు సమయం పెట్టుకుని నల్లధనం మార్పిడికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎలాంటి పెట్టుబడి పెట్టకుండా కోటి రూపాయలు వచ్చి పడటంతో చాలా మంది వ్యాపారులు నల్లధనం మార్పిడే లక్ష్యంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల క్రితం విజయవాడ వన్టౌన్ కాటూరివారి వీధిలో ఓ మార్వాడీ వ్యాపారి.. బందరు రోడ్డులోని ఓ ప్రముఖుడి నుంచి రూ.5 కోట్లు మార్పిడి చేయటానికి ముందుకొచ్చారని, అందుకు 20 శాతం కమిషన్ ఇచ్చేలా వారి మధ్య ఒప్పందం కుదిరినట్లు వ్యాపారవర్గాల ద్వారా తెలిసింది.
ఇటు నల్ల కుబేరులు, అటు వ్యాపారులు ఇద్దరికీ గిట్టుబాటు అవుతుండటంతో ఈ వ్యాపారం రాజధాని ప్రాంతంలో విస్తృతంగా కొనసాగుతున్నట్లు సమాచారం. చాలా నల్లకుబేరులు ఇలాంటి వ్యాపారులను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. నల్లధనం ఎక్కువగా ఉన్న వారు కొందరు ఈ వ్యాపారులకు 30శాతం కమీషన్ ఇచ్చేందుకు కూడా వెనుకాడటం లేదని సమాచారం.