ఐసిస్ ప్లాన్: 'క్రాస్ ఎగ్జాం' షాక్, ఎలా బుట్టలో వేస్తారు?
హైదరాబాద్: ఐసిస్ ఉగ్రవాదులు హైదరాబాద్ సహా, భారత్లోని పలు పట్టణాలను టార్గెట్ చేశారు. భారత్లోని కొంతమంది యువకులను తమ వైపు ఆకర్షించేందుకు వారు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విరివిగా ఉపయోగించుకుంటున్నారు.
రోజురోజుకి అభివృద్ది చెందుతోన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఉగ్రవాదులు తమ భావాజాలాన్ని ప్రచారం చేసుకునేందుకు, యువతను ఆకర్షించేందుకు ఎంతో చక్కగా ఉపయోగించుకుంటున్నారు. సమాచారం తెలుసుకునేందుకు, స్నేహితులతో చిట్ చాట్ చేసేందుకు సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు ఫేస్బుక్ వంటి సామాజిక మీడియాను వినియోగిస్తున్నారు.
ఐసిస్ ఇదే ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ద్వారా యువతను టార్గెట్గా చేసుకుంటోంది. ఎవరి ఖాతాలు వారికి పాస్వర్డ్ల సహాయంతో గోప్యంగా ఉండటంతో ఇదే చక్కటి మార్గంగా ఎంచుకుంది. నగరంలో భయంకరమైన విధ్వంసాన్ని సృష్టించేందుకు కొందరు ఐసిస్ ఉగ్రవాదులు చేసిన కుట్రను భగ్నం చేసిన ఎన్ఐఏ వారిని విచారించి, ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది.
రెచ్చగొట్టే సాహిత్యం
మతం పట్ల ఉన్న అభిమానాన్ని కాస్త ఉగ్ర సంస్థలు రెచ్చగొట్టే సాహిత్యంతో మతోన్మాదంగా మారుస్తోంది. యువకులు, ఐసిస్లో చేరాలనుకునే సానుభూతిపరులు ఈ ఫేస్బుక్ ద్వారా వ్యవహారాల్ని నడుపుతూ ఉగ్రవాదం వైపు ఆకర్షితులవుతున్నారు.
పక్కా ప్లాన్.. క్రాస్ ఎగ్జామ్
వీరిలో ఎక్కువ మందిని మత ప్రాతిపదికనే ఐసిస్ టార్గెట్ చేసుకుని, వారి వయస్సుకు తగిన విధంగా వారు త్వరగా తమవైపు ఆకర్షితులయ్యేలా సాహిత్యాన్ని వారికి పంపుతూ, వారు ఎంత వరకు వాటికి ఆకర్షితులయ్యారన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఎంతో పకడ్బందీగా, పక్కా ప్లాన్తో క్రాస్ ఎగ్జామ్ కూడా చేసుకుంటూ యువకులను ఎంచుకుంటోంది.
పేదవారికి వల
మరికొందరు యవకులను ఎంతో మేథస్సు ఉండి, తగిన గుర్తింపు లేక సామాన్యమైన జీవితాలు గడుపుతున్నారంటూ, తమవైపు రాగలిగితే మంచి గుర్తింపుతో పాటు విలాసవంతమైన జీవితాన్నిస్తామని ఆకర్షితులను చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
అమ్మాయిల్ని కూడా
ఐసిస్లో చేరుతున్న వారిలో ఎక్కువ మంది ఈ రకంగా ఆకర్షితులైన వారే ఉన్నారు. మరికొందరు పరోక్షంగా ఐసిస్కు ఏజెంట్లుగా పని చేస్తూ సంబంధాలను కొనసాగిస్తున్నారు. యువకులు మాత్రమే గాక, యువతులు కూడా ఆకర్షితులు కావటం గమనార్హం.
టర్కీ నుంచి సిరియాకు
ప్రత్యేకంగా తెలంగాణ నుంచి వెళ్లే వారు టర్కీ నుంచి సిరియాలోకి ప్రవేశించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. కొద్దిరోజుల క్రితం పాతబస్తీకి చెందిన ఓ యువతి టర్కీ గుండా సిరియా వెళ్లేందుకు యత్నించగా, గుర్తించి ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
విద్యావంతులు, ఐటీపై పట్టు
ఇటీవల ఖమ్మం, హైదరాబాద్ ప్రాంతాలకు చెందిన కొందరు యువకులు టర్కీ నుంచి సిరియా వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నట్లు గుర్తించి పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా ఫేస్బుక్ ద్వారా ఐసిస్ పట్ల ప్రభావితులై, వెళ్తున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. అంతేగాక, వీరిలో ఎక్కువ మంది విద్యావంతులు, ఐటిపై పట్టు, బాంబులు తయారు చేయగలిగే మేథస్సున్న వారే ఉండటం గమనార్హం.
ఇలా వల..
ఫేస్బుక్, ఇతర సోషల్ మీడియా ద్వారా ఒక వర్గానికి చెంది నిరుద్యోగులైన విద్యావంతులు, కుటుంబ ఆర్థిక స్తోమత సక్రమంగా లేని వారిని ఐసిస్ ఎంపిక చేసుకుంటుంది. వీరికి తొలుత మతం ఎంత మమకారం, దేశం పట్ల ఏ రకమైన ద్వేషం ఉందన్న విషయాల్ని సాధారణంగా చిట్చాట్ చేస్తూ అంచనా వేస్తున్నట్లుగా తెలుస్తోంది.
క్రాస్ ఎగ్జామ్
ఆ తర్వాత వేర్వేరు ఫేస్బుక్లతో స్నేహితులుగా ఉగ్రవాదంపై అభిప్రాయం తెలుసుకొని అభిరుచులు కలుపుకోవటం వంటివి చేసిన తర్వాత ఆకర్షితుడైన యువకుడు నిజంగా తమకు పనికొస్తాడా? లేడా? అన్న విషయాన్ని క్రాస్ చేసుకునేందుకు ఇప్పటి వరకు సంబంధం నెరపిన ఫేస్బుక్ ఐడికి పూర్తిగా వ్యతిరేక భావాలున్న మరో ఐడితో పరిచయమై పరీక్షిస్తారు. నిజంగానే ఆకర్షితుడయ్యాడని తలిశాక.. ఐసిస్ కార్యకలాపాలు బయటపెడతారు. ఇలా సిరియా వెళ్లేందుకు ప్రయత్నించి కొందరు పోలీసులకు చిక్కారు.
ఐసిస్
కాగా, హైదరాబాదులో సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్య బాంబు పేలుళ్లకు సరైన సమయమని ఐసిస్ భావించినట్లుగా తెలుస్తోంది. భారీ పేలుళ్లను ఆ సమయం మధ్యలో జరపాలని నిర్ణయించారని ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.