ఓటుకు నోటు షాక్: 22సార్లు చంద్రబాబు పేరు, కానీ
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగు చూశాయి. ఓటుకు నోటు కేసులో ఎసిబి తన ఛార్జీషీటులో ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పేరును 22 సార్లు ప్రస్తావించింది.
ఆయన ఈ కేసులో నిందితులు కానప్పటికీ వివిధ సందర్భాలలో వేర్వేరు అంశాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు చంద్రబాబు పేరును పేర్కొన్నారని తెలుస్తోంది. ఈ కేసులో ఎసిబి దాఖలు చేసిన ఛార్జీషటు ప్రతి సోమవారం వెలుగులోకి వచ్చింది.
కేసు నమోదుకు దారి తీసిన పరిస్థితులు, దర్యాఫ్తులో వెల్లడైన అంశాలు, సేకరించిన ఆధారాలు, సాక్ష్యాలు, నిందితులు, సాక్ష్యుల వాంగ్మూలాలు, ఫోరెన్సిక్ ఇచ్చిన నివేదికలను క్రోడీకరించారు.
రేవంత్ రెడ్డి, సెబాస్టియన్లు చంద్రబాబు చెప్పినట్లుగానే వ్యవహరించారని పేర్కొన్నారు. తొలుత ఆంటోనీ అనే వ్యక్తి సెబాస్టియన్ను స్టీఫెన్ సన్కు పరిచయం చేసి వెళ్లిపోయాడని, ఆ తర్వాత సెబాస్టియన్ తనను చంద్రబాబు పంపారని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గైర్హాజరైన టిడిపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేసినా రూ.2 కోట్లు ఇస్తానని చెప్పారని, జెరూసలేం కూడా పంపిస్తానన్నారని స్టీఫెన్కు చెప్పినట్లు ఎసిబి పేర్కొంది.
చంద్రబాబు వద్దకు తీసుకెళ్తానని సెబాస్టియన్ చెబితే స్టీఫెన్ సన్ అంగీకరించలేదని, దాంతో రేవంత్ రెడ్డి... చంద్రబాబు తరఫున వచ్చి అతనితో సంప్రదింపులు జరిపారని ఛార్జీషీటులో పేర్కొన్నారు.
ఫోన్ సంభాషణ, రేవంత్, స్టీఫెన్ సన్ల మధ్య జరిగిన సంభాషణల వంటివాటిని వివరంగా పేర్కొన్నారు. స్టీఫెన్ సన్కు అడ్వాన్సుగా యాభై లక్షల రూపాయలు ఇచ్చేందుకు రేవంత్ వచ్చినప్పుడు వారిద్దరి మధ్య జరిగిన సంభాషణను కూడా ఛార్జీషీటులో వివరించారు.
ఏపీలో తమ ప్రభుత్వం అధికారంలో ఉందని, అవసరమైతే మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీని చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారని అందులో పేర్కొన్నారు. దీనికంటే ముందే ఓసారి రేవంత్ రెడ్డి తదితరులు స్టీఫెన్ సన్ను కలిసి ఒప్పందం గురించి చంద్రబాబు మాట్లాడతారని పేర్కొన్నారని ఛార్జీషీటులో వివరించారు.
వారు చెప్పనట్లుగా సెబాస్టియన్ సాయంత్రం స్టీఫెన్కు ఫోన్ చేశారని, చంద్రబాబు మాట్లాడుతారని చెబుతూ ఫోన్ ఆయనకు ఇచ్చారని, చంద్రబాబు ఫోన్లో స్టీఫెన్తో మాట్లాడారని.. ఆ వివరాలను ఛార్జీషీటులో పొందుపరిచారు. అన్ని రకాలుగా చూసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చినట్లుగా పేర్కొన్నారు.