ఏపీ సచివాలయమా? బిగ్బాస్ హౌసా?: సీసీ కెమెరాలకు బాత్రూమే మినహాయింపు!
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఉద్యోగులు తాము బిగ్బాస్ షో చేస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. ఎందుకంటే.. సచివాలయంలో ఒక్క బాత్రూంలో తప్ప మిగిలిన చోట్లన్నీ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారట.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఉద్యోగులు తాము బిగ్బాస్ షో చేస్తున్నట్లుగా ఉందని అంటున్నారు. ఎందుకంటే.. సచివాలయంలో ఒక్క బాత్రూంలో తప్ప మిగిలిన చోట్లన్నీ సీసీ కెమెరాలతో నిఘా పెట్టారట. దీంతో సచివాలయంలో సీసీ కెమెరాలు ఉండాలి కానీ.. మరీ ఇన్ని అవసరమా? అని ఉద్యోగులు వాపోతున్నారు. సచివాలయ అధికారులు, ఉద్యోగులపై ప్రభుత్వం నిఘా పెంచిందని అంటున్నారు.
Recommended Video
బాత్రూమ్ తప్ప..
సచివాలయంలోని బాత్రూమ్లు మినహా కారిడార్లు, ఉద్యోగులు పనిచేసే క్యాబిన్లు, క్యాంటీన్లు.. చివరకు కంప్యూటర్లలో సైతం కెమెరాలు అమర్చారంటూ వాపోతున్నారు. ఎటు కదిలినా కెమెరాలు వెంటాడుతుండటంతో సచివాలయ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో తప్పులేదు గానీ.. తమను అవమానించేలా ఎక్కడపడితే అక్కడ కెమెరాలు పెట్టడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కంప్యూటర్లలో కూడా..
కంప్యూటర్లలో సైతం మైక్రో కెమెరాలు ఏర్పాటు చేశారని.. దీంతో పక్కనున్న సహ ఉద్యోగులతో మాట్లాడటం కూడా ఇబ్బందికరంగా మారిందని వాపోయారు. ప్రభుత్వం ఇంత అనుమానంతో వ్యవహరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని ఓ సీనియర్ ఉద్యోగి వ్యాఖ్యానించడం గమనార్హం. తమ ప్రతీ కదలికపైనా నిఘా పెట్టడం సరికాదని అన్నారు.
బిగ్బాష్ షో తలపించేలా..
బిగ్బాష్ షో తలపించేలా..కాగా, కొందరు అధికారులు, ఉద్యోగులు ఇది సచివాలయమా? లేక ‘బిగ్బాస్ హౌసా?'అని ఆవేదన వ్యక్తం చేస్తుండటం గమనార్హం. అక్కడ 60 కెమెరాలైతే ఇక్కడ ఏకంగా 240 కెమెరాలు ఏర్పాటు చేశారని వాపోతున్నారు. కంప్యూటర్లలో కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తే.. ప్రశాంతంగా ఎలా పనిచేయగలమని ప్రశ్నించారు.
అవమానించేడమే..
ఏ అధికారి వద్దకు.. ఎవరు వచ్చి వెళ్తున్నారనే వివరాలను తెలుసుకునే రీతిలో కెమెరాల ఏర్పాటు చేశారని ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడం సరికాదని అన్నారు. ఇప్పటికే బయోమెట్రిక్ హాజరు పేరుతో ఉద్యోగుల పనితీరు పట్టించుకోకుండా.. హాజరు మాత్రమే చూస్తున్నారని పలువురు ఉద్యోగులు మండిపడ్డారు. తాము సమయంతో సంబంధం లేకుండా పనిచేస్తామని, ఇప్పుడు ఈ-ఆఫీస్ వల్ల సెలవు రోజుల్లో కూడా విధులు నిర్వర్తిస్తున్నామన్నారు. అలాంటి తమ పట్ల ఈ విధంగా వ్యవహరించడం తమను అవమానించడేమనని అన్నారు.
చంద్రబాబూ ఇది మీకు తగునా...?
ఇంతకు ముందు డీఏ ఇవ్వకుండా ఏడిపించేవారని.. ఇప్పుడు డీఏలు ప్రకటించి.. ఆ తర్వాత పెండింగ్లో పెట్టి తమతో ఆడుకుంటున్నారని చంద్రబాబు సర్కారుపై ఉద్యోగులు మండిపడుతున్నారు. అంతేగాక, 50 ఏళ్లకే బలవంతంగా పదవీ విరమణ చేయించి ఇంటికి పంపించే చర్యలు కూడా చేపట్టారని ఆరోపించారు. అయితే, పారదర్శక పాలన కోసమే ఈ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు సర్కారు పెద్దలు చెబుతుండటం గమనార్హం.