సర్టిఫికేషన్ స్పీడప్కు సెన్సార్ బోర్డు నో: ‘పద్మావతి’పై దుమారం ఇలా
‘పద్మావతి’ సినిమాకు త్వరితగతిన సర్టిఫికెట్ విడుదల చేయడం కుదరని పని అని కేంద్ర సెన్సార్ బోర్డు తేల్చేసింది. అన్ని నియమ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: రాజపుత్రుల వారసురాలు 'రాణి పద్మిని'పై సినీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన 'పద్మావతి' సినిమా పలు మలుపులు తిరుగుతోంది. సెంట్రల్ బోర్డు ఆఫ్ ఫిల్మి సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) సర్టిఫికెట్ జారీ చేయకపోవడంతోపాటు విమర్శలు, హెచ్చరికలు, బెదిరింపుల నేపథ్యంలో వచ్చేనెల ఒకటో తేదీన సినిమా విడుదలను సినిమా నిర్మాణ సంస్థ 'వయాకామ్18' వాయిదా వేసుకున్నది. మరోవైపు సుప్రీంకోర్టు సీబీఎఫ్సీ ప్రక్రియలో తాము వేలు బెట్టబోమని తేల్చేసింది.
Recommended Video
సినీ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ అభ్యర్థనపై స్పందించిన కేంద్ర సెన్సార్ బోర్డు 'పద్మావతి' సినిమా విడుదల కోసం తమ తనిఖీ ప్రక్రియ వేగవంతం చేయలేమని కేంద్ర సెన్సార్ బోర్డు తేల్చేసింది. అన్ని అంశాలు పరిశీలించిన తర్వాతే సర్టిఫికెట్ జారీ చేస్తామని పేర్కొన్నది. కథనంలో నేపథ్యం తదితర విషయాలు, నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తామని తేల్చేసింది. అన్ని సినిమాల దరఖాస్తులను వరుసక్రమంగా పరిశీలిస్తామని పేర్కొన్నది.
కత్తిరింపుల్లేకుండా ఆడనివ్వబోమన్న యూపీ డిప్యూటీ సీఎం మౌర్య
మరోవైపు సినిమా కథనంపై రాజకీయ విమర్శలు జోరందుకున్నాయి. తమ రాష్ట్రంలో సినిమాను ఆడకుండా నిషేధం విధిస్తామని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. తానూ సినిమాటోగ్రఫీ సినిమా మంత్రిగా వివాదాస్పద అంశాలను కత్తిరింపుల్లేకుండా విడుదల చేయనివ్వబోమని యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్ మౌర్య తేల్చేశారు. భావ ప్రకటన వ్యక్తీకరణ స్వేచ్ఛను అణగదొక్కుతున్నారని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ‘పద్మావతి' సినిమాపై ఆగ్రహం అర్థమే లేదని బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ అన్నారు. ఆ చిత్రంలో చిత్తోడ్రాజు రతన్సింగ్గా షాహిద్ నటించిన విషయం తెలిసిందే. మరోవైపు దీపిక, బన్సాలీ తల నరికిన వారికి రూ.10 కోట్లు నజరానాగా ఇస్తామని హర్యానా బీజేపీ నేత చేసిన ప్రకటనపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని జాతీయ మహిళా కమిషన్ ఆదేశించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పద్మావతిపై నిషేధం ఇలా
‘దేశంలో భావవ్యక్తీకరణ స్వేచ్ఛను ఒక పథకం ప్రకారం అణగదొక్కుతున్నారు. ఒక రాజకీయపక్షానికి అనుకూలంగానే ఈ తరహా వివాదాలు ప్రారంభమవుతున్నాయి. అందులో పద్మావతి వివాదం కూడా ఒకటి. దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి' అని పశ్చిమ బెంగాల్ సీఎం మమతాబెనర్జీ ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా చారిత్రక అంశాలను వక్రీకరిస్తే పద్మావతి చిత్రాన్ని రాష్ట్రంలో విడుదల కానివ్వబోమని, శతాబ్దాలుగా రాణి పద్మవతిని భారతీయ మహిళలు తమ ప్రతీకగా భావిస్తున్నారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. అందుకే ఏటా రాష్ట్రమాత పద్మావతి పేరిట అవార్డును ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
చరిత్రను వక్రీకరించొద్దన్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్
‘దీపికా పదుకునేను బెదిరిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలి. ఇటీవల ఓ గ్రూపు ముక్కుకోస్తామని కూడా బెదిరించింది. ఇది అనాగరికం. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా సీఎంను కోరుతున్నాను. బెంగళూరులోని దీపిక కుటుంబానికి ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది' అని కర్ణాటక సీఎం సిద్ధ రామయ్య తెలిపారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ స్పందిస్తూ ‘చరిత్ర వక్రీకరణను ఎవరూ సమర్థించరు. నిరసన తెలుపుతున్న వారి వాదనలో అర్థం ఉన్నది. పద్మావతి త్యాగాన్ని చిన్నప్పటినుంచీ చదువుకుంటూ వచ్చాం. ఆ చరిత్రను వక్రీకరిస్తే మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ ఎవరూ సహించరు' అని స్పష్టం చేశారు.
ఏ హెచ్చరిక.. ఏ బెదిరింపుపై.. చట్టం ఏం చెప్తున్నది?
పద్మావతి చిత్రంపై సాధారణంగా ప్రారంభమైన నిరసనలు క్రమంగా అసహ్యకరమైన బెదిరింపులకు, అభ్యంతరకరమైన హెచ్చరికలకు మారుతున్నాయి. ఈ బెదిరింపులపై చట్టం ఏం చెబుతున్నదన్న సంగతి పరిశీలిద్దాం. రామాయణంలో శూర్పణఖకు పట్టినగతే దీపికకు పడుతుందని, పద్మావతి చిత్రం విడుదలైతే ఆమె ముక్కును కోసేందుకూ వెనుకాడబోమని కర్ణిసేన రాజస్థాన్ రాష్ట్రశాఖ అధ్యక్షుడు మహిపాల్సింగ్ మక్రానా హెచ్చరించారు. ఆయన ఇలా వ్యాఖ్యానించినందుకు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్-506 ప్రకారం నేరం. ఇందుకు రెండేండ్ల జైలుశిక్ష, జరిమానా..ఒక్కోసారి రెండూ శిక్షగా విధించవచ్చు.
దీపిక, బన్సాలీలపై ఇలా హెచ్చరికలు.. బెదిరింపులు
దీపిక, సంజయ్లీలా బన్సాలీ తలలు నరికితెచ్చిన వారికి రూ.10కోట్లు ఇస్తామని బీజేపీ హర్యానా రాష్ట్రశాఖ నేత సూరజ్పాల్ అమూ ప్రకటించారు. రణవీర్సింగ్ కాళ్లు నరికేస్తామని కూడా హెచ్చరించారు. అంతకుముందు మీరట్కు చెందిన ఓ వ్యాపారి రూ.5 కోట్లు ప్రకటించారు. ఇదీ కూడా ఇది ఐపీసీ లోని పలు సెక్షన్ల కిందకు వస్తుంది. సెక్షన్-506 ప్రకారం తీవ్రంగా గాయపరుస్తామని బెదిరిస్తే రెండేండ్ల జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించవచ్చు. ఐసీపీ-503 సెక్షన్ ప్రకారం.. ఏడేండ్ల వరకు జైలు లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు. సమూహాన్ని దాడిచేసేలా రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినందుకు సెక్షన్ 155 కింద అదనంగా శిక్ష పడే అవకాశముంది.
దీపికాను వేశ్య అని దుర్భాషలాడిన లోకేంద్ర సింగ్ కల్వి
పద్మావతి చిత్రంలో ప్రధాన నాయిక పాత్ర పోషిస్తున్న దీపికా పదుకొనెపైనా పలు సంఘాలు హద్దుమీరి దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నాయి. కర్ణిసేన కన్వీనర్ లోకేంద్ర సింగ్ కల్వి వేశ్య అని ప్రస్తావించారు. ఇలా ఒక మహిళను వేశ్యగా లేదా అదే అర్థంవచ్చేలా పేర్కొనడం సెక్షన్ 354 ప్రకారం లైంగిక వేధింపుల కిందకే వస్తుంది. ఏడాది జైలుశిక్ష, జరిమానా లేదా రెండూ విధించే అవకాశముంది. ఇక రాజస్థాన్లో పద్మావతి చిత్రయూనిట్పై జనవరిలో కర్ణిసేన కార్యకర్తలు దాడిచేసి సినిమా సెట్లను ధ్వంసంచేశారు. బన్సాలీపై దాడిచేసి కొట్టినందుకు ఐపీసీలోని సెక్షన్ 352 ప్రకారం ఒక వ్యక్తిపై దౌర్జన్యం చేసినందుకు మూడునెలల జైలుశిక్ష, జరిమానా, రెండూ విధించే అవకాశమున్నది. ఆస్తులు కూడా ధ్వంసమైనందున నిందితులపై సెక్షన్ 425 కింద అదనపు అభియోగాలు నమోదవుతాయి.