బాబుకు మరో చిక్కు: 'కాపు-దళితులు కలిస్తే ఏమైనా జరగొచ్చు'
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మరిన్ని చిక్కులు వచ్చి పడేలా కనిపిస్తున్నాయి. విభజన నేపథ్యంలో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు, భవనాలు లేక, ఉద్యోగాలు రాక ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు పడుతోంది.
దానికి తోడు బలమైన ప్రతిపక్షంగా ఉన్న వైసిపి ప్రతి అంశాన్ని నిలదీస్తున్నాయి. మరోవైపు కాపు రిజర్వేషన్లు, అమరావతి రగడ.. ఇలా ఎన్నో అంశాలు చంద్రబాబును చిక్కుల్లో పెడుతున్నాయి. వాటిని దాటుకొని ఆయన ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా, చంద్రబాబుకు మరో చిక్కు వచ్చి పడేలా కనిపిస్తోంది. దళితులు, కాపులు కలిసి ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనిపిస్తోంది. రాజ్యాధికారంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఇరువురు గొంతెత్తుతున్నారు.
దళితులకు, కాపులకు ఎవరికీ రాజ్యాధికారం రావడం లేదని, ఇందుకోసం పోరాడుతామని, తమను అణిచివేసే కుట్రలు చేస్తున్నారని కాపులు, దళితులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రెండు కులాలు కలిసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇందుకు కాపు నేత ముద్రగడ పద్మనాభం, మాజీ ఎంపీ హర్ష కుమార్ ఒక్కటి కావడమే గమనార్హం.
ఆదివారం నాడు కాపు నేత ముద్రగడ మాజీ ఎంపీ హర్ష కుమార్ ఇంటికి వెళ్లారు. కాపు ఉద్యమానికి హర్ష మద్దతు పలికారు. ఈ నేపథ్యంలో తమ ఉద్యమానికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు ముద్రగడ ఆయన ఇంటికి వచ్చారు.
ఈ సందర్భంగా ముద్రగడ, హర్ష మాట్లాడారు. కాపులు, దళితులు కలిస్తే ఏపీలో ఏదైనా జరగవచ్చునని అన్నారు. కాపు ఉద్యమానికి సహకరించినందుకు హర్షకు థ్యాంక్స్ చెప్పానన్నారు. అలాగే తమ డిమాండ్ పైన ప్రభుత్వం ఇచ్చిన గడువు ఆగస్టుతో ముగుస్తుందని, ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. రాష్ట్రంలో దళితులను, కాపులను అణిచివేసే కుట్ర జరుగుతోందన్నారు. దళితులకు, కాపులకు రాజ్యాధికారం లేదన్నారు.