బాబు టార్గెట్ 3 మెగా, 36స్మాల్: సింగపూర్ సాయం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ను మూడు మెగా సిటీలు, 36 చిన్న నగరాలుగా అభివృద్ధి చేయబోతున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గురువారం చంద్రబాబును సింగపూర్ విదేశాంగ మంత్రి కె షణ్ముగంతో ఈ విషయం చంద్రబాబు చర్చించారు. వీటిని నిర్మించేందుకు సింగపూర్ సహకారం కావాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబుతో షణ్ముగం వివిధ అభివృద్ధి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సింగపూర్ అభివృద్ధి చెందిన క్రమాన్ని బాబు కొనియాడారు.
ప్రపంచంలోనే క్రమశిక్షణ, నీతి నిబద్ధతలు కలిగిన దేశంగా సింగపూర్ సాధించిన ఘనతే తమకు స్ఫూర్తి అని పేర్కొన్నారు. అవినీతిరహిత ఏపీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. మౌలిక వసతులు, వైజ్ఢానిక రంగం, ఓడ రేవులు, పర్యాటక రంగానికి ప్రాధాన్యమిస్తూ అభివృద్ధిలో ఏపీకి ప్రపంచస్థాయి గుర్తింపు తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారిని భాగస్వామ్యులను చేయాలని యోచిస్తున్నామన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి స్నేహపూరితంగా సహకరిస్తామని షణ్ముగం హామీ ఇచ్చారు. విశాఖ నుండి చెన్నై వరకు ఉన్న పొడవైన సముద్ర తీరం, శ్రీకాకుళం నుండి చెన్నై వరకు ఆరు వరుసల రోడ్ల నిర్మాణంలో విస్తృత అభివృద్ధి అవకాశాలున్నాయన్నారు. ఉన్నత విద్యా విలువలు కల దేశంగా భారత్ ఎంతో అభివృద్ధి చెందగా, అందులో ఏపీది ప్రత్యేక స్థానమని, అందుకు మైక్రోసాఫ్ట్ పగ్గాలు చేపట్టిన సత్య నాదెళ్ల ఉదాహరణ అని చెప్పారు.
విశాఖ - కాకినాడల మధ్య పెట్రో కారిడార్ను అభివృద్ధి చేయాలని చూస్తున్న నేపథ్యంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్న సింగపూర్లోని పెట్రో కెమికల్ కారిడార్ను చూసేందుకు రావాలని చంద్రబాబును ఆహ్వానించారు. ఓడ రేవులు, టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్కు ప్రాధాన్యత ఇస్తుందని చంద్రబాబు చెప్పారు. కాగా, టూరిజం, ఇన్ఫ్రాస్ట్రక్చర్, సాంకేతిక సహకారం అందించేందుకు తాము సిద్ధమని షణ్ముగం చెప్పారు.