బాబు మరో కొత్త ఆలోచన: ‘ఏపీ పర్స్’తో ఇక నగదు రహితమే!
ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీలో స్వైపింగ్ మిషీన్లను అదుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కారు.. ఇప్పుడు నగదు రహిత కార్యకలాపాలను ప్రోత్సహించే పనిలో పడింది.
అమరావతి: పెద్ద నోట్ల రద్దు, చిల్లర ఇబ్బందుల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీలో స్వైపింగ్ మిషీన్లను అదుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కారు.. ఇప్పుడు నగదు రహిత కార్యకలాపాలను ప్రోత్సహించే పనిలో పడింది.
ఈ క్రమంలో ఏపీలో నగదు రహిత లావాదేవీల నిర్వహణ కోసం 'ఏపీ పర్సు' అనే యాప్ను ప్రవేశపెట్టబోతున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇలాంటి సర్వీసు ప్రొవైడర్లలో 13 మందిని ఒక వేదికపైకి తీసుకువచ్చి ఈ యాప్ను అందిస్తున్నామన్నారు. ఇది తెలుగులోనే ఉంటుందన్నారు. ఇంటర్నెట్ లేదా యూఎస్ఎస్డీ ద్వారా ఈ యాప్ వినియోగించుకోవచ్చన్నారు.
మూడు నాలుగు రోజుల్లోనే ఇది ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు. విజయవాడలోని కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఆయన శుక్రవారం రాత్రి మీడియాతో మాట్లాడారు. అంతక్రితం బ్యాంకర్లు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగదు రహిత చెల్లింపుల్లో ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కన్నా ముందుండేలా చేయబోతున్నామన్నారు. నగదు రహిత చెల్లింపుల గ్రామం, మండలం, జిల్లాలను ప్రకటించబోతున్నామని చెప్పారు.
'రాష్ట్రాన్ని నగదు రహితంగా మార్చేందుకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక వ్యూహాలు అమలు చేయబోతున్నాం. మొబైల్ చెల్లింపులు, కార్డుల ద్వారా చెల్లింపులు, ఆన్లైన్ చెల్లింపులు ప్రోత్సహిస్తాం. ఇందుకు అవసరమయితే పేదలకు ఫోన్లు ఉచితంగా లేదా సబ్సిడీపై ఇవ్వాలని నిర్ణయించాం. దీనిపై మరింత చర్చించనున్నాం' అని తెలిపారు.
'నగదు రహిత లావాదేవీల అమలుకు నాలుగు కమిటీలు నియమించాం. నగదు రహిత చెల్లింపులపై అవగాహన కల్పించేలా హరిప్రసాద్ ఛైర్మన్గా ఒక కమిటీ ఏర్పాటు చేశాం. కార్డులు వినియోగించి పోస్ మిషన్ల ద్వారా చెల్లింపుల అమలు వేగవంతం చేసేలా ప్రేమ్చంద్రారెడ్డి అధ్యక్షతన మరో కమిటీ, జనధన్ ఖాతాలు - రూపే కార్డు వినియోగం, పంపిణీ తదితర అంశాలకు సంబంధించి కృష్ణమోహన్ ఛైర్మన్గా మరో కమిటీ, ఈ సేవల వినియోగానికయ్యే ఖర్చులపై సమీక్షించి వాటిని హేతుబద్ధం చేసేందుకు మరో కమిటీ నియమిస్తున్నాం' అని చంద్రబాబు వివరించారు.
5వేల కోట్లు పంపాలని లేఖ
డిసెంబరు 1న జీతాలు చెల్లింపు, పెన్షన్లు, ప్రజలకుండే లావాదేవీల దృష్ట్యా తక్షణమే రాష్ట్రానికి రూ.5,000 కోట్లు పంపాలని ఆర్బీఐకి లేఖ రాస్తున్నామని చంద్రబాబు తెలిపారు. నగదు రహిత చెల్లింపులపై విస్తృతంగా ప్రచారం చేయనున్నామని టీవీల్లో, రేడియోల్లో ప్రచారం చేస్తామని వివరించారు.