ఆర్టీసి సమ్మె: బాబును చిక్కుల్లోకి నెట్టిన కెసిఆర్?
హైదరాబాద్: ఆర్టిసీ సమ్మె పరిష్కారం విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని చిక్కుల్లోకి నెట్టినట్లే కనిపిస్తున్నారు. తెలంగాణ ఆర్టీసి కార్మికులకు 40 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది.
ఆర్థిక లోటుతో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇబ్బందుల్లోకి నెట్టడానికే తెలంగాణ ప్రభుత్వం భారీగా వేతనాలను పెంచాలని ఆలోచిస్తోందని ఒకరిద్దరు మంత్రులు మంగళవారంనాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో అనడాన్ని బట్టి, తెలంగాణ ఇచ్చినంత మనం ఇవ్వలేమని చంద్రబాబు అనడాన్ని బట్టి అది అర్థమవుతోంది.
ప్రభుత్వోద్యోగుల వేతనాల పెంపు విషయంలోనూ అదే విధంగా జరిగింది. ప్రభుత్వోద్యోగులకు 43 శాతం ఫిట్మెంట్ను కెసిఆర్ ప్రకటించారు. దాంతో తెలంగాణకు ఇచ్చినంత ఫిట్మెంట్ తమకు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు పట్టుబట్టారు. దాంతో చంద్రబాబు నాయుడు అందుకు అంగీకరించాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అటువంటి ఇబ్బంది కలిగించడానికే కెసిఆర్ పూనుకున్నట్లు చెబుతున్నారు.
ఆర్టీసి కార్మికులకు తెలంగాణ పెంచినంత మేర వేతనాలు పెంచలేమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం 40 శాతం వేతనాలు పెంచడానికి ఆలోచిస్తోందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఆ మాటన్నారు. తెలంగాణ ఇచ్చినంత మనం ఇవ్వలేమని, మన ఆర్థిక పరిస్థితి అంత అనుకూలంగా లేదని చంద్రబాబు అన్నారు.
ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా స్పందించారు. ప్రజలను ఇరకాటంలో పెట్టి సమ్మె చేయడం, తమ పంతాన్ని నెగ్గించుకోవాలని సంఘాల నాయకులు చూడడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
ఆర్టీసీ సమ్మెపై చంద్రబాబు చిరాకు పడినట్లు తెలుస్తోంది. కార్మిక సంఘాల నాయకులు మెట్టు దిగకపోవడం, తెలంగాణ ప్రభుత్వం ఫిట్మెంట్ పెంచే విధంగా సంకేతాలు పంపడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇరకాటంగా పరిణమించిన అంశంపై చంద్రబాబు మంత్రివర్గంలో చాలాసేపు చర్చించినట్టు తెలిసింది.
ఆర్టీసీ కార్మికులు కోరుతున్న విధంగా 40 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్టు సంకేతాలు వెలువడుతున్న విషయాన్ని కొందరు మంత్రులు ప్రస్తావించగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే 43శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఇబ్బందుల్లో పడ్డామని చంద్రబాబు వ్యాఖ్యానించినట్టు తెలిసింది.
ఆర్థికపరమైన అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్కు ఇబ్బందికరమైనవేనని ఆయన అన్నట్టు తెలిసింది. ప్రభుత్వం 30 శాతానికి మించి ఇవ్వలేని ఆర్ధిక సంక్షోభంలో ఉందని సిఎం చెప్పగా, 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించేంత వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాలు తేల్చిచెప్పాయని మంత్రులు చెప్పినట్టు సమాచారం.
ఇప్పటికే ఉద్యోగుల జీతభత్యాల భారంతో ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉందని, ఆర్టీసీ కార్మికులకు సైతం ఆ స్థాయిలో వేతనాలు పెంచడం ఈ దశలో సాధ్యం కాదని చంద్రబాబు వ్యాఖ్యానించారు.