నిలదీసిన అభిమాని, ఆగ్రహంతో తోసేసిన చిరంజీవి
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మెగాస్ట్రార్ చిరంజీవికి శనివారం నాడు మధ్యాహ్నం ఊహించని షాక్ తగిలింది. రేణిగుంటలో ఓ అభిమాని చిరంజీవిని నిలదీశాడు. తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆధ్యాత్మిక నగర అభివృద్ధికి ఏం చేశారని సదరు అభిమాని చిరంజీవిని ప్రశ్నించాడు.
చిరంజీవి శనివారం నాడు కడప జిల్లా రైల్వే కోడూరులో శ్రీకృష్ణ దేవరాయలు విగ్రహావిష్కరణకు వచ్చారు. విగ్రహావిష్కరణ అనంతరం హైదరాబాదు వెళ్లేందుకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.
విషయం తెలుసుకున్న చిరు అభిమానులు పెద్ద ఎత్తున అక్కడకు తరలి వచ్చారు. ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు ఎగబడ్డారు. ఈ సందర్భంగా ఓ అభిమాని... ఎమ్మెల్యేగా తిరుపతికి ఏం చేశారని ప్రశ్నించారు.
కాగా, చిరంజీవి పట్ల జనంలో ఎలాంటి క్రేజ్ తగ్గలేదని మరోసారి నిరూపితమైంది. మెగా అభిమానులు రాజకీయాలను, సినిమాలను వేరుగానే చూస్తున్నారు.
రాజకీయాల విషయానికి వస్తే కొందరు చిరు వైపు, మరికొందరు పవన్ కళ్యాణ్ వైపు... ఇలా ఎటు ఉన్నప్పటికీ.. సినిమాల విషయానికి వచ్చేసరికి మెగా కుటుంబం మొత్తం ఒక్కటేనని అభిమానులు నిత్యం చెబుతుంటారు. రేణిగుంటకు వచ్చిన చిరును చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన అభిమానులను చూస్తే అది నిజమేనని చెప్పక తప్పదు.
ఆగ్రహం వ్యక్తం చేసిన చిరు
రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న చిరంజీవికి కరచాలనం చేసేందుకు భారీగా అభిమానులు తరలి వచ్చారు. ఈ క్రమంలో ఓ అభిమాని ఆయన పైన పడ్డారు. చిరు తూలి పడపోయారు. ఈ క్రమంలో అభిమాను చిరు షర్ట్ పట్టుకున్నారు. తన షర్ట్ పట్టుకు లాగిన అభిమానిని చిరు తోసేశారు. అతని పైన చిరంజీవి ఆగ్రహం వ్యక్తం చేశారు. పద్ధతిగా ప్రవర్తించాలని హితవు పలికారు.