చిరంజీవి వర్సెస్ బాలకృష్ణ: ఆంధ్రా పోలీసులకు టెన్షన్
టాలీవుడ్ దిగ్గజ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఏపీ పోలీసులు అప్రమత్తయ్యారు.
అమరావతి: తెలుగు పరిశ్రమలో దిగ్గజ నటులైన మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల ప్రతిష్టాత్మక చిత్రాలు ఈ సంక్రాంతి బరిలో నిలిచిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాల అమితాసక్తి నెలకొంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరింత ఎక్కువగా ఉంది.
సుదీర్ఘ విరామం తర్వాత
సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి నటించిన ‘ఖైదీ నెం 150' చిత్రం సంక్రాంతిని పురస్కరించుకుని జనవరి 11న విడుదలవుతోంది. దీనికి రెండ్రోజుల తర్వాత జనవరి 13న బాలకృష్ట నటించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి' విడుదల కానుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన చక్రవర్తి.. గౌతమీపుత్ర శాతకర్ణిపై దర్శకుడు క్రిష్ తీసిన చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రజల్లో కొంత ఎక్కువగానే ఆసక్తి నెలకొంది.
భారీ అంచనాలు
కాగా, ఇప్పటికే ఈ రెండు సినిమాలపై ఆయా హీరోల అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. విడుదల సందర్భంగా అభిమానులు సందడి కూడా కొంత మితిమీరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇద్దరు పెద్ద హీరోల సినిమాలు తక్కువ రోజుల విరామంలో విడుదలవుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పోలీసుల అప్రమత్తం
ఈ క్రమంలో శనివారం ఉదయం అన్ని జిల్లాలకు చెందిన ఎస్పీలతో డీజీపీ సాంబశివరావు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ హీరోల సినిమాలు విడుదలవుతున్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అభిమానులు, సంఘాలు సంయమనంగా వ్యవహరించాలని కోరారు.
కఠిన చర్యలు
అంతేగాక, అనుమతి లేకుండా ర్యాలీలు, ఉత్సవాలు నిర్వమించకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బంది కలిగే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరించాలనిపోలీసులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాల్లో కూడా పోలీసులు అప్రమత్తమై, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు.