అందరు గెలిచినట్లే: బాబు పక్కనే చిరు, వద్దన్నా విన్లేదు..!
హైదరాబాద్: విశాఖ హుధుద్ తుఫాను బాధితులను ఆదుకునేందుకు సినీ పరిశ్రమ 'మేము సైతం' కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో పలు ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రాజకీయ ప్రత్యర్థులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి ఒకే వేదికపై మాట్లాడుకుంటూ కనిపించారు.
వారి సందడి అందరినీ అలరించింది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు వచ్చినప్పుడు చిరంజీవి ఆయనను విష్ చేసి ఆయన పక్కనే కూర్చున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుకున్నారు. సినీ పరిశ్రమ మొత్తం చంద్రబాబును సాదరంగా ఆహ్వానించింది. ఈ సందర్భంగా సినీ నటులందరినీ పలకరిస్తూ ప్రతి ఒక్కరికీ చంద్రబాబు అభివాదం చేశారు.
ఒకప్పటి తెలుగుదేశం పార్టీ.. నేటి తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే బాబూమోహన్ తలతిప్పారు. చంద్రబాబు ఆయన ముందు పక్కనుండి వెళ్లిపోయారు. మరోవైపు, హిందూపురం శాసన సభ్యుడు, హీరో బాలకృష్ణ పాటలు పాడి అలరించారు. వెంకటేష్ ఆద్యంతం హంగామా చేశారు.
కాగా, సంగీత దర్శకులు దేవీశ్రీ ప్రసాద్ ఆట, పాటలతో ఉల్లాసపరుస్తున్న సమయంలో చిరంజీవిని వెంకటేష్ స్టేజ్ పైకి తీసుకుని వెళ్లాడు. వెంకటేష్కు మరోనటుడు రవితేజ వంతపాడి చిరంజీవిని స్టేజ్ మీదికి తీసుకెళ్లాడు. దీంతో స్టేజ్ మీదికెళ్లిన మెగాస్టార్కు డాన్స్ చేయక తప్పలేదు.
ఎప్పుడో రాజకీయాలకు వెళ్లకముందు వేసిన డాన్సులు ఇప్పుడు అకస్మాత్తుగా గుర్తురావని చిరు చెప్పినప్పటికీ వినిపించుకోలేదు. దేవీశ్రీ ప్రసాద్ పాట అందుకున్నాడు. చిరంజీవి డ్యాన్స్ ప్రారంభించలేదు. దీంతో, అల్లు అర్జున్ వచ్చి మామలో ఉత్సాహం నింపాడు. చిరు స్టెప్పులేశారు. ఆయన స్టెప్పులేయడం పూర్తయ్యాక... వెంకీ ఇంత పని చేస్తావా? నువ్వే నాతో డాన్స్ చేయించావన్నారు. ఏం పర్లేదు, అంతా మంచికే అని వెంకటేష్ నవ్వేశారు.
మేము సైతం కార్యక్రమం సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ.. ఆదివారం ఉదయం నుండి రాత్రి పన్నెండు గంటల వరకు సాగిన కార్యక్రమాలు ప్రత్యక్షంగా చూసిన వారినే కాకుండా టీవీల్లో చూసిన వారిని ఎంతో ఆకట్టుకున్నాయన్నారు. తుఫానుతో అల్లాడిపోయిన విశాఖతో పాటు ఉత్తరాంధ్రవాసులకు తాము అండగా ఉన్నామని భరోసా ఈ కార్యక్రమం ద్వారా చెప్పారు.
అనేక పోటీలు జరిగాయని, ఇందులో ఎవరు ఓడినా, ఎవరు గెలిచినా ఆ ఘతన అంతా హుధుద్ బాధితులను ఆదుకునేందుకు ఉపయోగపడి, అందరం విజయం సాధించినట్టే అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి పైసా బాధితులతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో సినీ రంగానికి చెందిన ప్రతి ఒక్కరి కృషి ఉందన్నారు.